మార్చి 1వ నుంచి 31 వరకు సుమారు 1.75 లక్షల హెల్మెట్ కేసులు..

- April 05, 2016 , by Maagulf
మార్చి 1వ నుంచి 31 వరకు సుమారు 1.75 లక్షల హెల్మెట్ కేసులు..

 హెల్మెట్ లేకుండా వాహనం నడిపే వారిపై నగర ట్రాఫిక్ పోలీసులు కొరఢా ఝళిపిస్తున్నారు. ఒక్క మార్చి నెలలోనే హెల్మెట్ లేకుండా బైక్‌లు నడిపిన 1.75 లక్షల మందికి చలాన్‌లు విధించారు. సుప్రీంకోర్టు కమిటీ సూచనల మేరకు గత మార్చి 1వ తేదీ నుంచి నగర ట్రాఫిక్ పోలీసులు హెల్మెట్, డ్రైవింగ్ లైసెన్స్, సిగ్నల్ జంపింగ్, డ్రంక్‌అండ్ డ్రైవ్, సెల్‌ఫోన్ డ్రైవింగ్‌పై స్పెషల్ డ్రైవ్‌లు ప్రారంభించారు. ఈ క్రమంలోనే హెల్మెట్ లేని వారికి జరిమానాలు విధిస్తూ, వారికి అవగాహన కల్పిస్తున్నారు. అలాగే, డ్రైవింగ్ లైసెన్స్ లేని 100 మందికి జైలు శిక్షలు కూడా పడేట్లు చేశారు. ఈ-హెల్మెట్ కేసులే ఎక్కువ.నగరంలో తిరిగే ద్విచక్రవాహనదారులకు హెల్మెట్ వాడకం తప్పని సరిచేస్తూ ట్రాఫిక్ పోలీసులు చర్యలు చేపట్టారు. మార్చి 1వ తేదీ నుంచి 31వ తేదీ వరకు సుమారు 1.75 లక్షల హెల్మెట్ కేసులు నమోదు చేశారు. ఇందులో కాంటాక్టు పద్దతిలో 40 శాతం చలానాలు విధించగా, నాన్‌కాంటాక్టు పద్దతిలో మిగతా 60 శాతం చలానాలు విధించారు. టెక్నాలజీకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్న పోలీసులు, ఆ దిశగా ట్రాఫిక్ ఉల్లంఘనలు పాల్పడే వారిని గుర్తించడానికి దాన్నే వినియోగిస్తున్నారు. కూడళ్లు, రోడ్లపై ట్రాఫిక్ సిబ్బంది కెమెరాలు పట్టుకుని హెల్మెట్ లేకుండా వాహనం నడిపేవారి ఫొటోలను తీస్తున్నారు. అలాగే, కూడళ్లలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల సహాయంతోకూడా హెల్మెట్ లేని వారిని గుర్తించి, చలాన్ విధిస్తున్నారు. డ్రైవింగ్ లైసెన్స్ లేనివారికి జైలు డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనం నడుపుతున్న 12,500 మందిపై నెల రోజుల్లో కేసులు రాశారు. ఇందులో ముందుగా ఒక కేసు వరకు చలానా వేసి, కనీసం లర్నింగ్ లైసెన్స్ అయినా తీసుకోవాలని పోలీసులు సూచిస్తూ ద్విచక్రవాహనదారులను పంపిస్తున్నారు. అదే వాహనదారుడు లైసెన్స్ లేకుండా మరోసారి పట్టుబడితే అతనికి చలానా వేసి, తర్వాత చార్జిషీట్ విధిస్తూ కోర్టులో హాజరుపరుస్తున్నారు. ఇక మూడో సారి పట్టుబడితే వారిపై కోర్టులు కూడా సీరియస్ అవుతూ జైలు శిక్షలు విధిస్తున్నాయి. ఆటోల విషయంలో మాత్రం సీరియస్‌గా ఉంటున్నారు. ప్రయాణికులను తమ గమ్యస్థానాలకు చేర్చే ఆటో డ్రైవర్లు లైసెన్స్ లేకుండా వాహనం నడిపి పోలీసులకు పట్టుబడితే వారిపై చార్జిషీటు విధిస్తున్నారు. ఒకసారి హెచ్చరించి, లైసెన్స్ పొందాలని సూచిస్తున్నారు. రెండో సారి పట్టుబడితే వారికి జైలు శిక్ష పడ్డట్టే. భారీ వాహనాలపై ఒక్కసారి పట్టుబడ్డా వారికి జైలు శిక్ష తప్పడం లేదు. ఇలా నెల రోజులలో నమోదైన కేసుల్లో 1500 మందిపై పోలీసులు చార్జిషీట్లు నమోదు చేశారు. అందులో వంద మంది వరకు జైలు శిక్షలు పడ్డాయి.95 శాతం మార్పు వచ్చింది నెల రోజుల్లో నగర పౌరుల్లో మార్పు వచ్చింది. 90 నుంచి 95 శాతం మంది హెల్మెట్ వాడుతున్నారు. అయితే, ప్రధాన రహదారులపై వెళ్లే వారు మాత్రమే హెల్మెట్ ధరిస్తున్నారు. కాలనీలు, అంతర్గత రోడ్లపై వెళ్లే వారు ధరించడం లేదు. ముందుగా ప్రధాన రోడ్లపై దృష్టి సారించాం. నెల రోజుల్లోనే ఇంత మార్పు రావడం అభినందనీయం. తాము నిబంధనలు పాటించాలని సూచిస్తున్నాం. మరికొన్ని రోజుల్లో పూర్తిస్థాయిలో మార్పు వస్తుందని భావిస్తున్నాం. - రంగనాథ్, ట్రాఫిక్ డీసీపీ

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com