యూఏఈ: రూ.24.93కోట్లు గెలుచుకున్న భారత ట్రక్ డ్రైవర్‌

- May 04, 2022 , by Maagulf
యూఏఈ: రూ.24.93కోట్లు గెలుచుకున్న భారత ట్రక్ డ్రైవర్‌

అబుధాబి: అజ్మాన్‌లో ట్రక్ డ్రైవర్‌గా పనిచేసే ఓ భారత వ్యక్తికి ఈ ఏడాది ఈద్ అల్ ఫితర్ బాగా కలిసొచ్చింది.ఈద్ రెండోరోజు(మంగళవారం) అబుధాబిలో తీసిన బిగ్ టికెట్ ర్యాఫిల్ డ్రాలో భారత్‌కు చెందిన ముజీబ్ చిరతోడి(40) ఏకంగా 12 మిలియన్ దిర్హమ్స్ గెలుచుకున్నాడు. ఏప్రిల్ 22న ముజీబ్ కొనుగోలు చేసిన లక్కీ టికెట్: 229710 అతనికి ఈ అదృష్టాన్ని తెచ్చిపెట్టింది. దీంతో అతడి ఆనందానికి అవధుల్లేవు. పవిత్ర రమదాన్ మాసం సందర్భంగా తాను చేసిన ప్రార్థనలు ఫలించాయంటూ మురిసిపోతున్నాడు.రెండేళ్లుగా అబుధాబి బిగ్ రాఫెల్‌లో లాటరీ టికెట్లు కొనుగోలు చేస్తూ తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నానని, ఇంత భారీ మొత్తం గెలుస్తానని కలలో కూడా ఊహించలేదని ముజీబ్ చెప్పుకొచ్చాడు.

“ఇది నిజంగా ఊహించనిది. నా జీవితంలో కోటీశ్వరుడిని అవుతానని ఎప్పుడూ అనుకోలేదు. నాకు ఆర్థిక ఇబ్బందులు చాలా ఉన్నాయి. చాలా ఏళ్లు విదేశాల్లో పనిచేసి కేరళలో సొంత ఇంటిని నిర్మించుకోగలిగాను. దానికి సంబంధించిన గృహ రుణాలు ఇప్పటికీ అలాగే ఉన్నాయి. నేను ఇప్పుడు నా బాకీలన్నీ తీర్చగలను. ఈ సమయంలో తేలికగా శ్వాస తీసుకోగలను. దేవుడు మా ప్రార్థనలు ఆలకించాడు” అని ముజీబ్ చెప్పుకొచ్చాడు. 1996లో తన గల్ఫ్ జర్నీ ప్రారంభమైందని, మొదట సౌదీ అరేబియా అక్కడి నుంచి 2006లో యూఏఈ వెళ్లినట్లు చెప్పాడు. ట్రక్ డ్రైవర్ అయిన ముజీబ్.. దుబాయ్, అబుధాబిలో కొంత కాలం పని చేశాడు. ప్రస్తుతం అజ్మాన్‌లోని అల్ నఖ్వా డ్రింకింగ్ వాటర్ కంపెనీలో డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. కేరళ రాష్ట్రం మలప్పురం జిల్లాలోని మెల్టూర్ టౌన్ ముజీబ్ స్వస్థలం. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com