శాస్త్రోక్తంగా శ్రీవారి మెట్ల మార్గం పునఃప్రారంభం

- May 05, 2022 , by Maagulf
శాస్త్రోక్తంగా శ్రీవారి మెట్ల మార్గం పునఃప్రారంభం

తిరుమల: శ్రీ‌వారి మెట్టు న‌డ‌క మార్గాన్ని గురువారం ఉద‌యం టీటీడీ చైర్మ‌న్ వై.వి.సుబ్బారెడ్డి శాస్త్రోక్తంగా పూజ‌లు నిర్వ‌హించి పునఃప్రారంభించారు. ఈ మార్గంలో భ‌క్తుల‌ను తిరుమలకు అనుమ‌తించి.. అనంత‌రం చైర్మ‌న్ మీడియాతో మాట్లాడారు.గత ఏడాది నవంబ‌రు 18, 19వ తేదీల్లో కురిసిన భారీ వ‌ర్షాల‌కు శ్రీ‌వారి మెట్టు మార్గంలో బండ‌రాళ్ళు ప‌డి రోడ్డు, మెట్లు, ఫుట్‌పాత్‌లు, మ‌రుగుదొడ్లు దెబ్బ‌తిన్నాయ‌ని తెలిపారు.

ఆ తర్వాత ఇంజినీరింగ్ అధికారులు యుద్ధ ప్రాతిపాదిక‌న న‌డ‌క మార్గాన్ని రూ.3.60 కోట్ల‌తో మ‌ర‌మ్మ‌తు ప‌నులు పూర్తి చేసినట్లు వెల్లడించారు. కేవ‌లం నాలుగు నెల‌ల వ్య‌వ‌ధిలో శ్రీ‌వారి మెట్టు మార్గంలో పనులు పూర్తి చేసిన ఇంజినీరింగ్ అధికారులు, సిబ్బంది కాంట్రాక్ట‌ర్ల‌ను చైర్మ‌న్ అభినందించారు.

ఈ మార్గం గుండా రోజుకు 6 వేల మంది, ప్ర‌త్యేక ప‌ర్వ‌దినాల్లో 15 వేల మంది భ‌క్తులు తిరుమ‌ల‌కు చేరుకుంటార‌ని వివరించారు. శ్రీ‌వారి మెట్టు మార్గంలోనే సాక్షాత్ శ్రీ‌నివాసుడు తిరుమ‌ల‌కు చేరుకున్న‌ట్లు, శ్రీ కృష్ణ‌దేవ‌రాయులు శ్రీ‌వారిని ద‌ర్శించుకున్న‌ట్లు శాస‌నాల ద్వారా తెలుస్తోంద‌ని వివ‌రించారు.

అనంత‌రం శ్రీ‌వారి మెట్టు న‌డ‌క మార్గంలో త్వ‌రిత‌గ‌తిన మ‌ర‌మ్మ‌తులు పూర్తి చేసిన సీఈ  నాగేశ్వ‌ర‌రావు, ఎస్ఈ – 2 జ‌గ‌దీశ్వ‌ర్ రెడ్డి, ఈఈ సురేంద్ర‌రెడ్డి, ఈరోడ్ కు చెందిన ఆర్ఆర్ బిల్డ‌ర్స్ డీజీఎమ్ ఆర్ముగంను చైర్మ‌న్ శాలువ‌, శ్రీ‌వారి ప్ర‌సాదాల‌తో స‌న్మానించారు.

ఈ కార్య‌క్ర‌మంలో బోర్డు స‌భ్యులు, చంద్ర‌గిరి ఎం.ఎల్‌.ఏ. చెవిరెడ్డి భాస్క‌ర్ రెడ్డి, బోర్డు స‌భ్యులు  పోకల అశోక్ కుమార్‌, మొరం శెట్టి రాములు, జేఈవోలు స‌దా భార్గ‌వి, వీర‌బ్ర‌హ్మం, సీవీఎస్ఓ న‌ర‌సింహ కిషోర్‌, శ్రీ‌నివాస‌ మంగాపురం ఆల‌య డిప్యూటీ ఈఓ వ‌ర‌ల‌క్ష్మీ, డీఈ  ర‌విశంక‌ర్ రెడ్డి, అద‌న‌పు సీవీఎస్ఓ శివ‌కుమార్ రెడ్డి, ఇత‌ర అధికారులు పాల్గొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com