భారత్-గబాన్ ఆర్థిక భాగస్వామ్యం మరింత బలోపేతం కావాలి: ఉపరాష్ట్రపతి
- June 01, 2022
లిబ్రవిల్లే: ఆఫ్రికాఖండ సర్వతోముఖాభివృద్ధిని భారతదేశం ఆకాంక్షిస్తోందని భారత ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు పేర్కొన్నారు.ఆఫ్రికాతో ఆర్థిక సంబంధాలను మరింత బలోపేతం చేసుకునే దిశగా భారతదేశం ప్రయత్నిస్తోందని, ఆఫ్రికాలో వైద్యరంగంతోపాటు డిజిటల్, హరితాభివృద్ధి విషయంలో భారత్ అవసరమైన తోడ్పాటు అందిస్తుందని ఆయన పేర్కొన్నారు.
గబాన్ లో ఉన్న భారతీయ సంతతి ప్రజలు, వ్యాపావేత్తలతో ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు నేతృత్వంలోని భారతీయ ప్రతినిధి బృందం సమావేశమైంది.ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతి మాట్లాడుతూ.. ఆఫ్రికా పురోగతిలో భారతదేశం తన పాత్రను సుస్పష్టంగా పోషిస్తుందని పేర్కొన్నారు.ఇందుకోసం ఆఫ్రికా-భారత్ సంబంధాలను మరింత బలోపేతం చేసుకునే దిశగా అన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు.
2021-22 ఆర్థిక సంవత్సరంలో కరోనా నేపథ్యంలోనూ గబాన్-భారత్ మధ్య బిలియన్ డాలర్ వాణిజ్యం జరిగిందని దీన్ని మరింతగా పెంచాల్సిన అవసరం ఉందన్నారు. గబాన్ యువతను నైపుణ్యవంతులుగా తీర్చిదిద్దే విషయంలో భారతదేశం అన్ని రకాలుగా అండగా నిలుస్తుందన్నారు. వ్యవసాయరంగంలోనూ అవసరమైన మద్దతు అందించేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఉపరాష్ట్రపతి తెలిపారు.
ఈ పర్యటన సందర్భంగా గబాన్ ప్రత్యేక ఆర్థిక మండలి (జీఎస్ఈజెడ్) ను భారతీయ బృందం సందర్శించింది.ఈ సందర్భంగా జీఎస్ఈజెడ్ లో 54 భారతీయ కంపెనీలు తమ పెట్టుబడులు పెట్టిన విషయాన్ని అధికారులు ఉపరాష్ట్రపతికి తెలియజేశారు.పర్యటన సందర్భంగా ఎస్ఈజెడ్ లోని కార్మికులు వివిధ కంపెనీ ప్రతినిధులతో ఉపరాష్ట్రపతి మాట్లాడారు.
గబాన్ లో భారతీయ సంతతి ప్రజల కారణంగా ఇక్కడ మన సంస్కృతి, సంప్రదాయాలు కొనసాగుతుండటాన్ని ఆయన అభినందించారు. భారతదేశాన్ని మళ్లీ విశ్వగురుగా తీర్చిదిద్దే ప్రయత్నంలో విదేశాల్లోని భారతీయ సంతతి ప్రజల పాత్ర కీలకమని ఉపరాష్ట్రపతి అన్నారు.
భారతీయ సంతతి ప్రజలు, వ్యాపారవేత్తలతో సమావేశం,జీఎస్ఈజెడ్ సందర్శనలో ఉపరాష్ట్రపతితోపాటు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ భారతీ ప్రవీణ్ పవార్,ఎంపీలు సుశీల్ కుమార్ మోదీ,విసయ్ పాల్ సింగ్ తోమర్, పి.రవీంద్రనాథ్, విదేశాంగ శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.


తాజా వార్తలు
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్







