భారత 15వ రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము..

- July 21, 2022 , by Maagulf
భారత 15వ రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము..

న్యూ ఢిల్లీ: భారత 15వ రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము ఎన్నికయ్యారు. ఇంకా ఓట్ల లెక్కింపు కొనసాగుతున్నప్పటికీ, ఇప్పటివరకు విడుదలైన ఫలితాల ప్రకారం ద్రౌపది ముర్ము సగానికిపైగా ఓట్లు సాధించారు. అంటే మెజారిటీ మార్కును దాటేశారు. దీంతో ఆమె రాష్ట్రపతిగా ఎన్నికవడం ఖాయమైంది. ఇప్పటివరకు మూడు రౌండ్ల ఫలితాలు వెల్లడయ్యాయి. మూడింట్లోనూ ద్రౌపది, యశ్వంత్ సిన్హాపై ఆధిక్యం సాధించారు.

ఈ నెల 25న ఆమె రాష్ట్రపతి భవన్‌లో ప్రమాణ స్వీకారం చేస్తారు. ఈ విజయం ద్వారా రాష్ట్రపతి పదవి చేపట్టనున్న తొలి గిరిజన మహిళగా నిలవబోతున్నారు ద్రౌపది ముర్ము. అలాగే ప్రతిభా పాటిల్ తర్వాత ఆ పదవి చేపట్టిన రెండో మహిళగా కూడా ద్రౌపది ముర్ము నిలుస్తారు. కాగా, ప్రధాని నరేంద్ర మోదీ ద్రౌపది నివాసానికి వెళ్లి అభినందనలు తెలిపారు. ఆయనతో పాటు బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నద్దా కూడా అభినందనలు తెలిపారు. ద్రౌపది ముర్ము ఎన్డీయే తరఫున పోటీ చేసిన సంగతి తెలిసిందే. మరోవైపు ప్రతిపక్షాల అభ్యర్థిగా పోటీ చేసిన యశ్వంత్ సిన్హా కూడా ద్రౌపది ముర్ముకు శుభాకాంక్షలు తెలిపారు. ఇప్పటివరకు వెలువడ్డ ఫలితాల ప్రకారం ద్రౌపది ముర్ముకి 5,77,777 ఓట్లు పోలవగా, యశ్వంత్ సిన్హాకి 2,61,062 ఓట్లు పోలయ్యాయి.

ఈ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ బాగానే జరిగినట్లు ఫలితాల ద్వారా తెలుస్తోంది. ద్రౌపది ముర్ముకు మద్దతుగా ప్రతిపక్ష నేతలు కూడా ఓట్లు వేశారు. 17 మంది ఎంపీలు, 104 మంది ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్‌కు పాల్పడ్డారు. జార్ఖండ్‌లో 10 మంది ఎమ్మెల్యేలు, ఛత్తీస్‌గఢ్‌లో 6గురు ఎమ్మెల్యేలు, అసోంలో 22 మంది ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్‌కు పాల్పడ్డట్లు ఫలితాల ద్వారా తెలుస్తోంది. ద్రౌపది ముర్ము విజయంతో దేశవ్యాప్తంగా బీజేపీ నేతలు సంబురాలు చేసుకుంటున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com