మసాజ్‌ పార్లర్ల మాటున దోపిడీ.. ఐదుగురు సభ్యుల ముఠా అరెస్ట్

- August 05, 2022 , by Maagulf
మసాజ్‌ పార్లర్ల మాటున దోపిడీ.. ఐదుగురు సభ్యుల ముఠా అరెస్ట్

యూఏఈ: మసాజ్‌ పార్లర్ల మాటున దోపిడీలకు పాల్పడుతున్న ఐదుగురు సభ్యుల ముఠాను షార్జా పోలీసులు అరెస్ట్ చేశారు. ముఠాలో ఐదుగురు ఆసియన్లు ఉన్నారన్నారు.  నిందితులు మసాజ్ లేదా స్పా థెరపీ సెషన్‌లను అందించే 'బిజినెస్ కార్డ్‌లను' పంపిణీ చేస్తారని, ఆ తర్వాత ఖాతాదారులను ఈ ముఠా కత్తులతో బెదిరించి బ్లాక్‌మెయిల్ చేసి డబ్బులు వసూలు చేసేవారని షార్జా పోలీస్‌లోని క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్‌మెంట్ (సిఐడి) డైరెక్టర్ కల్నల్ ఒమర్ అబు జౌద్ తెలిపారు. రోల్లా ప్రాంతంలో కార్డులు పంపిణీ చేస్తున్న అనుమానితులలో ఒకరి గురించి అధికార యంత్రాంగానికి సమాచారం అందిందని ఆయన వివరించారు. ప్రత్యేక భద్రతా బృందాలు అనుమానితుడి నివాసాన్ని గుర్తించి దాడి చేసి ముఠా  సభ్యులను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. నిందితుల నివాసం నుంచి విజిటింగ్ కార్డుల పెట్టెలు, అనేక సైజుల్లో ఉన్న ఆయుధాలను (కత్తులు) గుర్తించి స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. నిందితులందరూ నేరాన్ని అంగీకరించారని, తదుపరి విచారణ నిమిత్తం వారిని సంబంధిత అధికారులకు అప్పగించినట్లు ఒమర్ అబు జౌద్ పేర్కొన్నారు. అనుమానాస్పద ప్రకటనలు లేదా ప్రతికూల కార్యకలాపాలను వెంటనే అధికారులకు తెలియజేయాలని షార్జా పోలీసులు పిలుపునిచ్చారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com