పాకిస్థాన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం..20 మంది సజీవ దహనం..

- August 16, 2022 , by Maagulf
పాకిస్థాన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం..20 మంది సజీవ దహనం..

పాకిస్థాన్‌: పాకిస్థాన్ లోని పంజాబ్ ప్రావిన్స్ లో మంగళవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ప్రయాణీకులతో వెళ్తున్న బస్సు, చమురు ట్యాంకర్ ఎదురెదురుగా ఢీకొనడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగి 20 మంది సజీవ దహనమయ్యారు. లాహోర్‌కు 350 కిలోమీటర్ల దూరంలో ఉన్న ముల్తాన్‌లోని హైవేపై ఈ ప్రమాదం చోటు చేసుకుంది. హైవే పై అతివేగం కారణంగానే ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ప్రమాదం తర్వాత మంటలు ఎగిసిపడటంతో కొన్ని గంటలపాటు హైవేపై ట్రాఫిక్ నిలిచిపోయింది.

లాహోర్ నుండి కరాచీకి వెళ్తున్న బస్సు, ఆయిల్ ట్యాంకర్ ఢీకొన్న తర్వాత బస్సు, ట్యాంకర్ రెండూ మంటల్లో చిక్కుకున్నాయి. ప్రమాద సమయంలో బస్సులో డ్రైవర్, కండక్టర్ తో పాటు 26 మంది ఉన్నారు. వీరిలో 18మంది మంటల్లో చిక్కుకొని సజీవదహనం అయ్యారు. మరో ఇద్దరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందారు. వీరితో పాటు మరో ఆరుగురు ప్రయాణీకులు గాయపడ్డారు. తీవ్ర గాయాలతో ఉన్నవారిని ముల్తాన్‌లోని నిష్టర్ ఆసుపత్రికి తరలించారు. అయితే వారిలో మరికొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

ప్రమాదంలో మరణించిన ప్రయాణీకుల మృతదేహాలు పూర్తిగా కాలిపోయాయి. గుర్తించలేనంతగా ఉన్నాయి. మృతదేహాలను DNA పరీక్షల తర్వాత కుటుంబాలకు అప్పగిస్తామని స్థానిక అధికారులు తెలిపారు. గత మూడు రోజుల్లో పాకిస్థాన్ లోని ప్రావిన్స్ లో ఇది రెండో అతి పెద్ద ప్రమాదం. గత శనివారం తెల్లవారుజామున ప్రయాణికులతో వెళ్తున్న బస్సును చెరుకు లోడుతో వెళ్తున్న ట్రక్కు ఢీకొని పదమూడు మంది మరణించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com