ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించేవారికి చల్లని మంచినీరు ..
- April 22, 2016
వేసవితాపం నుంచి ప్రయాణికులకు తన వంతుగా కొంత ఉపశమనం కలిగించాలని ఏపీఎస్ఆర్టీసీ భావిస్తోంది. ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించేవారికి చల్లని మంచినీరు అందించేందుకు సిద్ధం అవుతోంది. ఏసీ బస్సులతో పాటు సూపర్లగ్జరీ, డీలక్స్ బస్సులు ఎక్కిన ప్రయాణికులకు ఒక్కొక్కరికి లీటర్ మంచినీళ్ల సీసాను అందించాలని సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకుంది. పల్లెవెలుగు, ఎక్స్ప్రెస్ బస్సుల్లో మాత్రం.. పెద్ద వాటర్ క్యాన్లను ఏర్పాటుచేసి చల్లని మంచినీటిని అందించాలనుకుంటోంది. ఉద్యోగులకు మజ్జిగ ప్యాకెట్లు ఇవ్వనుంది. ఈ మేరకు ప్రణాళికలు సిద్ధం అయ్యాయి. ఏపీఎస్ఆర్టీసీ ఎండీ సాంబశివరావు ఒకట్రెండు రోజుల్లో ఆమోదముద్ర వేయనున్నట్లు సమాచారం.నెలకు రూ. 8 కోట్ల వ్యయం: ప్రయాణికులకు మంచినీళ్లు, ఉద్యోగులకు మజ్జిగ ప్యాకెట్లు కలిపి నెలకు రూ. 8 కోట్ల ఖర్చవుతుందని అధికారులు అంచనా వేశారు. ఇంద్ర, గరుడ, గరుడప్లస్, అమరావతి వంటి ఏసీ సర్వీసు బస్సులో వాటర్ బాటిళ్లు ఇచ్చే విధానం ఇప్పటికే అమల్లో ఉంది. అయితే ఈ బస్సుల్లో అరలీటరు మాత్రమే ఇస్తుండగా దీన్ని లీటర్కు పెంచాలని నిర్ణయించారు. నాన్ఏసీ డీలక్స్, సూపర్లగ్జరీ ప్రయాణికులకూ లీటర్ నీళ్ల సీసా ఇవ్వాలనుకుంటున్నారు. వేసవికాలం పూర్తయ్యేవరకు వాటర్ బాటిల్కు అదనంగా డబ్బులు తీసుకోకుండా ఉచితంగానే ఇవ్వనున్నట్లు సమాచారం.పల్లెవెలుగు (ఆర్డినరీ), ఎక్స్ప్రెస్ బస్సుల్లో మాత్రం పెద్ద వాటర్ క్యాన్లు ఏర్పాటుచేయాలనుకుంటోంది. కనీసం 20 లీటర్ల మంచినీళ్లను చల్లగా ఉంచే ప్రత్యేక క్యాన్లను బస్సులో ఏర్పాటుచేయనున్నారు. ఇప్పటికే ప్రయోగాత్మకంగా గుంటూరు రీజియన్లో పిడుగురాళ్ల, చిలకలూరిపేట, వినుకొండ డిపోల్లోని కొన్నిరూట్లలో ఈ విధానాన్ని అమలుచేస్తోంది. సంస్థలో ఉద్యోగులకు చల్లని మంచినీళ్లు, మజ్జిగ ప్యాకెట్ల అందించాలని నిర్ణయించింది. డ్రైవర్లు, కండక్టర్లకు ఒక్కొక్కరికి ఒక్కో మజ్జిగ ప్యాకెట్ ఇవ్వనుంది. ఒక్కో ప్యాకెట్కు రూ. 6 ఖర్చు చేయనున్నట్లు సమాచారం. ప్రతిరోజు మొత్తం 35 వేల మంది ఉద్యోగులకు మజ్జిగ ప్యాకెట్లు అందించాలని నిర్ణయించింది. రాష్ట్రవ్యాప్తంగా 128 బస్ డిపోల్లో వాటర్ కూలర్లను ఏర్పాటు చేయాలని కూడా నిర్ణయం తీసుకుంది
తాజా వార్తలు
- దుబాయ్ ఎయిర్పోర్ట్లో ఎటువంటి ప్రమాదాలు జరగలేదు: వదంతులను కొట్టిపారేసిన అధికారులు!
- అనుమతి లేకుండా ధరలు మారిస్తే.. QR1,000,000 ఫైన్..!!
- డ్రైవింగ్ చేసేటప్పుడు అత్యవసర హెచ్చరిక వస్తే?
- ఇరాన్ దురాక్రమణ..బహ్రెయిన్కు నాటో మద్దతు..!!
- గల్ఫ్ దేశాలపై ఇరాన్ దాడులు నేపథ్యంలో TGWWC–ఒమాన్ శాఖ అత్యవసర సమావేశం
- నేషనల్ వాటర్ కంట్రోల్ సెంట్రల్ ను సందర్శించిన పీఎం..!!
- ఆఫ్రికన్, మధ్య ఆసియా దేశాలతో ఒమన్ చర్చలు..!!
- రియాద్, జెడ్డా నుండి దుబాయ్ కు ఫ్లైట్స్ పునరుద్ధరణ..!!
- దుబాయ్ లో పబ్లిక్ సేఫ్టీపై కొత్త చట్టం..Dh2 మిలియన్ల ఫైన్..!!
- షార్లెట్లో NATS ఆధ్వరంలో మహిళా దినోత్సవ వేడుకలు









