శబరిమల భక్తులకు దక్షిణ మధ్య రైల్వే గుడ్ న్యూస్

- November 11, 2022 , by Maagulf
శబరిమల భక్తులకు దక్షిణ మధ్య రైల్వే గుడ్ న్యూస్

హైదరాబాద్: శబరిమల భక్తులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త తెలిపింది. శబరిమల వెళ్లి వచ్చే భక్తుల కోసం మొత్తం 26 ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్టు ప్రకటించింది. సికింద్రాబాద్ నుంచి కొల్లాం, కొట్టాయంకు ఈ రైళ్లు అందుబాటులో ఉంటాయని అధికారులు తెలిపారు.

సికింద్రాబాద్-కొల్లాం (07117) రైలు ఈ నెల 20, డిసెంబరు 4, 18, జనవరి 8 తేదీల్లో సాయంత్రం 4 గంటలకు సికింద్రాబాద్‌లో బయలుదేరుతుంది. తర్వాతి రోజు రాత్రి 11 గంటలకు కొల్లాం చేరుకుంటుంది. ఇది కాచిగూడ, మహబూబ్‌నగర్, గద్వాల మీదుగా ప్రయాణిస్తుంది. తిరుగు ప్రయాణంలో ఈ రైలు (07118) నవంబరు 22 డిసెంబరు 6, 20, జనవరి 10 తేదీల్లో మధ్యాహ్నం 2.30 గంటలకు కొల్లాంలో బయలుదేరి తర్వాతి రోజు ఉదయం 9.05 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది.

సికింద్రాబాద్-కొల్లాం (07121) రైలు నవంబరు 27, డిసెంబరు 11, 25, జనవరి 1, 15 తేదీల్లో మధ్యాహ్నం సికింద్రాబాద్‌లో బయలుదేరి తర్వాతి రోజు రాత్రికి కొల్లాం చేరుకుంటుంది. ఇది కాజీపేట, ఖమ్మం మార్గాల్లో ప్రయాణిస్తుంది. కొల్లాం-సికింద్రాబాద్ (07122) రైలు నవంబరు 29, డిసెంబరు 13, 27, జనవరి 3, 17 తేదీల్లో తెల్లవారుజామున 2.30 గంటలకు బయలుదేరి తర్వాతి రోజు రాత్రి 10 గంటలకు కొల్లాం చేరుకుంటుంది.

సికింద్రాబాద్-కొల్లాం (07123) రైలు నవంబరు 21, 28 తేదీల్లో మధ్యాహ్నం 2.30 గంటలకు బయలుదేరి తర్వాతి రోజు రాత్రి 11.50 గంటలకు గమ్యస్థానం చేరుకుంటుంది. కొల్లాం-సికింద్రాబాద్ (07124) రైలు నవంబరు 23, 30 తేదీల్లో తెల్లవారుజామున 2.30 గంటలకు బయలుదేరి తర్వాతి రోజు ఉదయం 11 గంటలకు కొల్లాం చేరుకుంటుంది.

ఇక, సికింద్రాబాద్ నుంచి కొట్టాయం వెళ్లే రైలు (07125) నవంబరు 20, 27 తేదీల్లో సాయంత్రం 6.50 గంటలకు సికింద్రాబాద్‌లో బయలుదేరి తర్వాతి రోజు రాత్రి 9 గంటలకు కొట్టాయం చేరుతుంది. ఈ రైలు చర్లపల్లి, నల్గొండ, మిర్యాలగూడ మార్గంలో ప్రయాణిస్తుంది. కొట్టాయం నుంచి సికింద్రాబాద్ వెళ్లే రైలు (07126) నవంబరు 21, 28 తేదీల్లో సోమవారం రాత్రి 11.20 గంటలకు బయలుదేరి బుధవారం తెల్లవారుజామున 4 గంటలకు కొట్టాయం చేరుకుంటుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com