నేటి నుంచి ఫుట్‌బాల్ ప్రపంచకప్.. 29రోజులు 64 మ్యాచ్‌లు..

- November 20, 2022 , by Maagulf
నేటి నుంచి ఫుట్‌బాల్ ప్రపంచకప్.. 29రోజులు 64 మ్యాచ్‌లు..

దోహా: మరికొద్ది గంటల్లో ప్రపంచం మొత్తం అబ్బురపడే అత్యద్భుత ఘట్టానికి తెర లేవనుంది. ఎడారి దేశం ఖతార్‌లో మెగా క్రీడా సంబరానికి విజిల్ మోగనుంది. ఖతార్ దేశపు రాజధాని ధోహా వేదికగా 22వ ఫుట్ బాల్ వరల్డ్ కప్ నేటి నుంచి ప్రారంభం కానుంది. నేడు జరిగే తొలి మ్యాచ్‌లో అతిథ్య ఖతర్‌తో ఈక్వెడార్ తలపడుతుంది. ఖతార్ జాతీయ దినోత్సవం అయిన డిసెంబర్ 18న ఫైనల్ జరుగుతుంది. 2006లో ఆసియా క్రీడలకు ఆతిథ్యం ఇచ్చిన తర్వాత ఖతర్‌లో మరో మెగా క్రీడా సంబరం ఇదే కావటం విశేషం.ఈ ప్రపంచకప్ నాలుగేళ్లకు ఒకసారి జూన్- జులైలో నిర్వహిస్తారు. అయితే ఆ సమయంలో 50 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే ఖతర్ లో నిర్వహణ సాధ్యం కాదని ఫిఫా మరో ప్రత్యామ్నాయాన్ని సూచించింది. పలు చర్చల అనంతరం ఫుట్‌బాల్ లీగ్‌ల షెడ్యూల్ లో మార్పులు చేస్తూ నవంబర్- డిసెంబర్ మార్చారు.

ఈ మెగా టోర్నీలో మొదటి రెండు రోజులు మినహా గ్రూప్ దశలో ప్రతీరోజూ నాలుగు మ్యాచ్ లు జరుగుతాయి. నేటి నుంచి డిసెంబర్ 18వరకు జరిగే ఈ మెగా టోర్నీలో డిసెంబర్ 3న రౌండ్ ఆఫ్-16 (ఫ్రీ క్వార్టర్ ఫైనల్స్) ప్రారంభమవుతాయి. ఖతార్ నేడు ప్రారంభ మ్యాచ్ గ్రూప్-ఏలోని ఈక్వెడార్‌తో అతిథ్య ఖతార్ జట్టు తలపడుతుంది. భారత్ కాలమానం ప్రకారం రాత్రి 7.30 గంటల నుంచి ఈ వేడుకలు జరుగుతాయి.

మొత్తం ఎనిమిది వేదికల్లో ఈ మ్యాచ్ లు జరుగుతాయి. వరల్డ్ కప్ ట్రోపీని ఎనిమిది వేదికలను గుర్తు చేయడంతో పాటు ఎప్పటికీ శాశ్వతం అన్నట్లుగా గణిత సంజ్ఞ ఇన్ఫినిటీని కలుపుతూ టోర్నీ లోగోను నిర్వాహకులు తయారు చేశారు. ఈ టోర్నీలో మరో విశేషం ఏమిటంటే.. జట్టు ఒక్కో మ్యాచ్ నుంచి మరో మ్యాచ్ కోసం విమానాల్లో ప్రయాణించే అవసరం లేకుండా వేదికలు దగ్గరలోనే ఉన్నాయి. 1930 తర్వాత ఇదే తొలిసారి కావడం విశేషం. ఎనిమిది స్టేడియాలు, ప్రాక్టీస్ మైదానాలన్నీ 10 కిలోమీటర్ల పరిధిలోనే ఉన్నాయి. ప్రతీ జట్టు తమకు ప్రాక్టీస్ కోసం కేటాయించిన ఒకే బేస్ క్యాంప్‌లోనే టోర్నీ మొత్తం సాధన చేస్తుంది.

--రాజ్ కుమార్ వనంబత్తిన(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com