ప్లాస్టిక్‌ బాటిళ్లను సేకరించి లిమ్కా రికార్డు సృష్టించిన బిస్లెరీ..

- April 24, 2016 , by Maagulf
ప్లాస్టిక్‌ బాటిళ్లను సేకరించి లిమ్కా రికార్డు సృష్టించిన బిస్లెరీ..

దాహం వేసినపుడు వాటర్‌ బాటిల్‌ కొనుక్కొని తాగి సీసా అవతల పారేస్తాం.. అలాంటి ప్లాస్టిక్‌ బాటిళ్ల వల్ల పర్యావరణానికి ఎంత హాని కలుగుతుందనే విషయం మాత్రం ఆలోచించం. మనమే కాదు, చాలావరకు ఆ సీసాలను ఉత్పత్తి చేసే కంపెనీలూ అంతే. అయితే ఈ విషయంలో బిస్లెరీని మినహాయించవచ్చు.
వాడిపారేసిన బాటిళ్లను సేకరించి రీసైకిల్‌ చేయడానికి పూనుకుంది ప్రముఖ నీటి సీసాల ఉత్పత్తి సంస్థ బిస్లెరీ. అలా దాదాపు 1.1 మిలియన్ల ప్లాస్టిక్‌ బాటిళ్లను సేకరించి లిమ్కా రికార్డు సృష్టించింది. కంపెనీ తరఫున సామాజిక బాధ్యతగా చేసినా ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్వచ్ఛ భారత్‌ అభియాన్‌ కార్యక్రమానికీ తన వంతు చేయూత నిచ్చినట్లయింది.బిస్లెరీ 2015 అక్టోబర్‌ నుంచి ఖాళీ బాటిళ్లను సేకరించే కార్యక్రమాన్ని తలపెట్టింది. ఇందుకోసం ముంబయిలోని 150 పాఠశాలలకు చెందిన రెండు లక్షల మంది విద్యార్థుల సహాయాన్ని తీసుకుంది. ప్లాస్టిక్‌ వస్తువులను రీసైకిల్‌ చేయడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి రకరకాల వర్క్‌షాప్స్‌, సదస్సులను ఏర్పాటు చేసింది. గ్రీన్‌ ఎన్విరాన్‌మెంట్‌పై పలు అవగాహన కార్యక్రమాలను చేపట్టి విద్యార్థుల ద్వారానే ప్లాస్టిక్‌ బాటిళ్లను సేకరించారు. ఈ కార్యక్రమంలో బాలీవుడ్‌ నటుడు జాన్‌ అబ్రహం, స్వచ్ఛ్‌ మహారాష్ట్ర మిషన్‌ డైరెక్టర్‌ సమీర్‌ ఉన్‌హలేతో పాటు పలువురు ప్రముఖులు భాగం పంచుకున్నారు.1.1 మిలియన్‌ బాటిళ్లను సేకరించిన బిస్లెరీ ప్రపంచ రికార్డు సాధించి గిన్నిస్‌, లిమ్కా.. రికార్డుల్లోకి ఎక్కింది. ఇప్పటి వరకు 13,408 కేజీల ప్లాస్టిక్‌ బాటిళ్లపై ఈ రికార్డు నమోదైంది. బిస్లెరీ 20వేల కేజీల ప్లాస్టిక్‌ బాటిళ్లను సేకరించాలని లక్ష్యంగా పెట్టుకొంది. కాని 23,538 కేజీల బరువు ఉండే ప్లాస్టిక్‌ బాటిల్స్‌ను సేకరించి సరికొత్త రికార్డును సృష్టించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com