ఇరాన్ లో హిజాబ్ వ్యతిరేక ఆందోళనలు..

- December 07, 2022 , by Maagulf
ఇరాన్ లో హిజాబ్ వ్యతిరేక ఆందోళనలు..

టెహ్రాన్: హిజాబ్ వ్యతిరేక ఆందోళనలతో ఇరాన్ అట్టుడుకుతోంది. రెండు నెలలుగా కొనసాగుతున్న ఆందోళనల్లో వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలో ఆందోళన చేస్తామని ప్రకటించిన తేదీకి ఒక రోజు ముందు అక్కడ విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఖరాజమీ, ఆర్క్ విశ్వవిద్యాలయాలు సహా మరో నాలుగు యూనివర్సిటీలకు చెందిన 1200 మంది విద్యార్థులు నిన్న ఆహారం తిన్న తర్వాత తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. విద్యార్థులు వాంతులు, వీరేచనాలు, తీవ్రమైన తలనొప్పి వంటి లక్షణాలతో ఇబ్బందిపడుతున్నారు.

కాగా, వీరిపై విష ప్రయోగం జరిగిందని ‘ది నేషనల్ స్టూడెంట్ యూనియన్’ తీవ్ర ఆరోపణలు చేసింది. దీంతో విశ్వవిద్యాలయ కెఫెటేరియాల్లో తినకూడదని నిర్ణయించుకున్నారు. మహ్సా అమిని అనే ఇరవై రెండేళ్ల యువతి హిజాబ్ ను సక్రమంగా ధరించకుండా మహిళల డ్రెస్ కోడ్ ను ఉల్లంఘించిందని నైతిక విభాగం పోలీసులు సెప్టెంబర్ 16న ఆమెను అరెస్టు చేశారు. ఆమెను పోలీసు కస్టడీలో తీవ్రంగా గాయపడి మృతి చెందిందని ఆరోపణలు వచ్చాయి. దీంతో దేశవ్యాప్తంగా హిజాబ్ వ్యతిరేక ఆందోళనలు మిన్నంటాయి.

వేల సంఖ్యలో మహిళలు వీధుల్లోకి వచ్చి అధ్యక్షులు ఇబ్రహీం రైసీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాజధాని టెహ్రాన్ తో సహా దేశ వ్యాప్తంగా ఆందోళనలు చేపట్టారు. ఆందోళనలో మహిళలు పలు మార్గాల్లో నిరసనలు తెలిపారు. జుట్టు కత్తిరించుకోవడంతోపాటు హిజాబ్ లను దగ్ధం చేశారు. ఆందోళనలను అణచివేసేందుకు ప్రభుత్వం పోలీసులు, సైన్యాన్ని ప్రయోగించింది.

దీంతో ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. ఘర్షణలు, కాల్సుల్లో 450 మందికి పైగా పౌరులు, 60 మంది వరకు భద్రతా బలగాలు మరణించారని హక్కుల కార్యకర్తలు అంటున్నారు. ఆందోళనలకు దిగివచ్చిన ప్రభుత్వం నైతిక పోలీసు విభాగాన్ని రద్దు చేసింది. అయినా దేశ వ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com