ఖతార్ ఫిఫా క్రీడా వినోదం వెనుక విషాదం
- December 10, 2022
నిజామాబాద్: ఖతార్ లో మృతి చెందిన నిజామాబాద్ జిల్లాకు చెందిన వలస కార్మికుల కుటుంబాలతో శనివారం (10.12.2022) నాడు జిల్లా కేంద్రం నిజామాబాద్ లోని రెడ్ క్రాస్ భవనంలో ఖతార్ ఫిఫా గల్ఫ్ అమరుల స్మారక సమావేశం జరిగింది. ఎమిగ్రంట్స్ వెల్ఫేర్ ఫోరం, ప్రవాసి మిత్ర లేబర్ యూనియన్, గల్ఫ్ జెఏసి, ఖతార్ మృతుల కుటుంబాలు కలిసి ఈ సమావేశాన్ని నిర్వహించారు. గల్ఫ్ కార్మిక సంఘాలు ఖతార్ లో మృతి చెందిన నిజామాబాద్ జిల్లాకు చెందిన 12 మంది కార్మికుల వివరాలు సేకరించి వారి ఫొటోలతో ఒక స్మారక బ్యానర్ ఏర్పాటు చేశారు. 12 మంది గల్ఫ్ అమరులకు పూలతో శ్రద్ధాంజలి ఘటించిన అనంతరం, సమావేశంలో వారి ఆత్మశాంతి కోసం రెండు నిమిషాలు మౌనం పాటించారు.
గల్ఫ్ కార్మిక నాయకులు పట్కూరి బసంత్ రెడ్డి, గుగ్గిల్ల రవిగౌడ్, సింగిరెడ్డి నరేష్ రెడ్డి, స్వదేశ్ పరికిపండ్ల, నెమలి అర్జున్, గాయకుడు అష్ట గంగాధర్, న్యాయవాది బాస రాజేశ్వర్ లు ఈ సమావేశంలో ప్రసంగించారు.
ఖతార్ లో ఫుట్బాల్ స్టేడియంలు, సంబంధిత నిర్మాణాలు, ఇతర పనులు చేసే కార్మికులు వివిధ కారణాలతో మృతి చెందారు. గత పదేళ్లలో ఖతార్లో దాదాపు 100 మంది తెలంగాణ వలస కార్మికులు మరణించినట్లు ఒక అంచనా. మరణానికి కారణం ఏదయినా... ఖతార్లో తమ ప్రాణాలను త్యాగం చేసిన అందరు వలస కార్మికుల కుటుంబాలకు 'ఫిఫా' కమిటీ మరియు ఖతార్ ప్రభుత్వం పరిహారం చెల్లించాలని వక్తలు కోరారు.
ఫిఫా పేరుతో ఖతార్ లో క్రీడేతర మౌలిక వసతుల నిర్మాణం జరిగింది కాబట్టి మృతులు అందరికీ పరిహారం ఇవ్వాలి. వలస కూలీల చెమటతో, రక్తంతో ఖతార్ పునర్నిర్మాణం అయ్యింది. ప్రపంచంలో అత్యంత ఆకర్షణీయమైన క్రీడగా ఫుట్ బాల్ పేరుపొందింది. ఫుట్ బాల్ కు 350 కోట్ల మంది అభిమానులున్నారు.
ఫిఫా పోటీల కోసం స్టేడియాలు, హోటళ్ల నిర్మాణం, రవాణా, టెలికమ్యూనికేషన్ సౌకర్యాల కల్పన, భద్రత కోసం ఖతార్ భారీగా డబ్బును వ్యయం చేసింది. ప్రపంచ కప్ ఫుట్ బాల్ కోసం ఖతార్ వెచ్చించిన నిధుల్లో చాలా భాగం క్రీడేతర మౌలిక వసతుల నిర్మాణానికి తోడ్పడ్డాయి. ఖతార్ జాతీయ విజన్-2030 లో భాగంగా మెట్రో రైల్వే, సరికొత్త నగరం, నూతన అంతర్జాతీయ విమానాశ్రయం, రేవు, వేల కిలోమీటర్ల కొత్త రహదారులు, 100 కు పైగా హోటళ్లు నిర్మించారు.
ఫిఫా పోటీలు ముగిసిన తర్వాత ఈ మౌలిక వసతులు అంతర్జాతీయ పెట్టుబడిదారులను, కొత్త పరిశ్రమలను ఖతార్ వైపు ఆకర్షిస్తాయని ప్రభుత్వం ఆశిస్తోంది. ఈ ఏడాది తొలి 10 నెలల్లోనే ఖతార్ కు 400 కోట్ల డాలర్ల విదేశీ పెట్టుబడులు ప్రవహించాయి. ఖతార్ లో గడచినా నాలుగేళ్లలో అంకుర సంస్థలు, సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు బాగా వృద్ధి చెందాయి.
టికెట్ అమ్మకాలు, అంతర్జాతీయ టెలివిజన్ ప్రసార హక్కులు, కార్పొరేట్ ప్రాయోజకుల ద్వారా లభించే 470 కోట్ల డాలర్ల ఆదాయాన్ని ఫిఫా తన జేబులో వేసుకుంటుంది. నిర్వహణ ఖర్చులు పోను ఫిఫా నికరంగా 300 కోట్ల డాలర్ల లాభం ఆర్జిస్తోంది.
2010 నుంచి ఈ స్టేడియాలు నిర్మాణానికి రాళ్ళెత్తిన కూలీలెవరనే ప్రశ్న అనివార్యంగా తలెత్తుతోంది. ఫుట్ బాల్ పోటీల కోసం మౌలిక వసతులను నిర్మిస్తూ 2010-2020 మధ్య ఖతార్ లో 6,500 మంది వలస కూలీలు మరణించారు. వారంతా భారత్, పాకిస్తాన్, బంగ్లాదేశ్, నేపాల్, శ్రీలంక కు చెందినవారే. దీనిపై మానవ హక్కుల సంఘాలు నిరసన తెలుపుతున్నాయి. మొత్తం మీద ఖతార్ ఫుట్ బాల్ సంరంభం చీకటి వెలుగుల బంతాటే!
తాజా వార్తలు
- లైసెన్స్ లేకుండా సేవలందిస్తే..SR2,600 ఫైన్..!!
- విడాకుల కేసులు పెరగడంపై షురా కౌన్సిల్ ఆందోళన..!!
- అలెర్ట్..ఉమ్ అల్ హౌల్ ఇంటర్చేంజ్లో ట్రాఫిక్ ఆంక్షలు..!!
- ఆన్లైన్ బెగ్గింగ్ మోసాలపై దుబాయ్ పోలీసుల వార్న్..!!
- రమదాన్..ధరల పర్యవేక్షణకు ముమ్మర తనిఖీలు..!!
- కింగ్ ఫైసల్ రోడ్డులో రెండు లేన్లు మార్చి 29 వరకు మూసివేత..!!
- T20WorldCup2026: ఆస్ట్రేలియా ఇంటికే..!
- ఢిల్లీలో AI సమ్మిట్ ప్రారంభం
- కొత్తగా ఎన్నికైన మేయర్, డిప్యూటీ మేయర్లు వీళ్లే
- 'రాయల్' ఫోటోగ్రాఫర్ రమేష్ శుక్లాకు షేక్ హమ్దాన్ నివాళి..!!









