ఉపాధి అవసరాలకు అనుగుణంగా పాలిటెక్నిక్ పాఠ్యాంశాలు
- February 15, 2023
విజయవాడ: పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా పాలిటెక్నిక్ విద్యార్ధులను తీర్చిదిద్దేందకు నూతన పాఠ్యాంశాలు సిద్దం చేయనున్నట్టు రాష్ట్ర నైపుణ్యాభివృద్ది, ఐటి శాఖ కార్యదర్శి సౌరభ్ గౌర్ అన్నారు. రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖ, రాష్ట్ర సాంకేతిక విద్యా, శిక్షణా మండలి సంయిక్త ఆధ్వర్యంలో పాలిటెక్నిక్ బోధనలో నూతన పాఠ్య ప్రణాళిక ఆవశ్యకత, అమలుపై బుధవారం విజయవాడలో ప్రత్యేక కార్యశాలను నిర్వహించారు. పరిశ్రమ ప్రతినిధులు, ఇంజనీరింగ్ కళాశాలల విభాగాధిపతులు, పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపల్స్, అధ్యాపకులు బృందాలుగా ఏర్పడి పూర్తి స్దాయి చర్చ అనంతరం పలు సూచనలను సమావేశం దృష్టికి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా సౌరభ్ గౌర్ మాట్లాడుతూ వాస్తవ పరిస్ధితుల మేరకు పాలిటెక్నిక్ విద్యార్ధులకు శిక్షణ అందించాలన్నదే ప్రభుత్వ ధ్యేయమన్నారు. పాలిటెక్నిక్ విద్యార్ధులకు తక్షణమే ఉపాధి లభించేలా పూర్తి స్ధాయిలో పాఠ్యాంశాల మార్పుకు శ్రీకారం చుడుతున్నామన్నారు. పరిశ్రమకు విద్యావ్యవస్ధకు మధ్య ఉన్న స్వల్ప అంతరాన్ని అధిగమించేలా ప్రస్తుతం మేధో మధనం చేస్తున్నామన్నారు.
సాంకేతిక విద్యా శాఖ సంచాలకురాలు, రాష్ట్ర సాంకేతిక విద్యా, శిక్షణా మండలి ఛైర్మన్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ అత్యధిక మార్కులు పొందిన విద్యార్ధులు సైతం ఉద్యోగం సాధించటంలో అవాంతరాలు ఎదుర్కోవటం ఆందోళన కలిగిస్తుందన్నారు. ఈపరిస్ధితికి గల కారణాలు వెలికి తీసి పరిష్కారం కనుగోనే ప్రయత్నంలో భాగమే ప్రస్తుత కార్యక్రమం అన్నారు. ఈ నేపధ్యంలో పలు అంశాలు సమాలోచన దృష్టికి వచ్చాయని నాగరాణి వివరించారు. ప్రస్తుతం 40శాతంగా ఉన్న ప్రాక్టికల్స్ ను 50శాతానికి చేయాలన్న సూచన కీలకం అన్నారు. పాఠ్య ప్రణాళిక రూప కల్పనలో నిరంతరం పరిశ్రమ వర్గాలకు చెందిన నిపుణుల భాగస్వామ్యం తీసుకోవటం, ఇతర రాష్ట్రాలలో ఉన్న సిలబస్ ను అధ్యయనం చేయటం, మారిన సిలబస్ కు అనుగుణంగా అధ్యాపకులకు శిక్షణ ఇవ్వటం, సకాలంలో పాఠ్యపుస్తకాల ముద్రణ వంటివి సమావేశంలో చర్చనీయాంశం అయ్యాయన్నారు. అఖిల భారత సాంకేతిక విద్యా మండలి మోడల్ పాఠ్య ప్రణాళికను సైతం పరిగణనలోకి తీసుకుని విద్యార్ధులకు మేలు చేకూరేలా 2023-2024 విద్యా సంవత్సరానికి నూతన పాఠ్య ప్రణాళిక సిద్దం చేయటమే తమ ముందున్న ధ్యేయమన్నారు. ప్రస్తుతం ఉన్న కోర్సుల సిలబస్ మార్పుతో పాటు, నూతన కోర్సుల రూపకల్పన జరగాలని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఆదేశించారని తదనుగుణంగా వ్యవహరిస్తున్నామని నాగరాణి పేర్కొన్నారు. 5జి సాంకేతికత, త్రిడి ప్రింటింగ్, కోడింగ్ వంటి అంశాలకు ప్రస్తుతం డిమాండ్ ఉందని దానికి అనుగుణంగా పాలిటెక్నిక్ కోర్సులను రూపకఃల్పన చేస్తామన్నారు.
శిక్షణ, ఉపాధి శాఖ సంచాలకురాలు లావణ్యవేణి మాట్లాడుతూ తగిన ప్రణాళికతో అధ్యయనం సాగిస్తే పాలిటెక్నిక్ విద్యార్ధులకు ఉపాధి సమస్య కాబోదన్నారు. విభిన్న పరిశ్రమలు తమ వాస్తవ అవసరాలకు అనుగుణమైన సిబ్బంది కోసం ఎదురు చూస్తున్నాయన్నారు. కార్యక్రమంలో మేఘా ఇంజనీరింగ్ ఎజిఎం నాసర్ వలి, టాటా మోటార్స్ హెడ్ రాజేంద్ర ప్రసాద్, ఎఫ్ ట్రానిక్స్ ఎగ్జిక్యూటివ్ మేనేజర్ భవానీ శంకర్, టెక్ మహీంద్ర హెడ్ కిరణ్, ఓలా ఎలక్ట్రికల్ నుండి అరుణ్, విష్ణు కెమికల్స్ ఎజిఎం సురేష్, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ నుండి రమేష్, తటవర్తి అప్పరల్స్ ఎండి సుబ్బారావు, కుశలవ ఇండస్ట్రీస్ డైరెక్టర్ గోపాలరావు పలు సూచనలు చేసారు. కార్యక్రమంలో సాంకేతిక విద్యా శాఖ సంయిక్త సంచాలకులు పద్మారావు, సాంకేతిక విద్యా బోర్డు కార్యదర్శి విజయ భాస్కర్, సంయిక్త కార్యదర్శి జానకిరామ్, ఉప సంచాలకులు రామకృష్ణ,కళ్యాణ్, సంయిక్త కార్యదర్శి నారాయణ రావు, ఉప కార్యదర్శి లక్ష్మిపతి తదితరులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- వాట్సాప్కు ధీటైన స్వదేశీ యాప్!
- భవిష్యత్తు అంతా AI: సీఎం చంద్రబాబు
- కూలిన మిలిటరీ హెలికాప్టర్: ఆరుగురు మృతి
- ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల సమరం!
- యూట్యూబర్ వైష్ణవి హత్య కేసులో కీలక పరిణామం..
- గల్ఫ్లో ఇరాన్ ప్రతీకారం..అమెరికా రాడార్ వ్యవస్థలు ధ్వంసం
- ఇరాన్ దాడులు..పబ్లిక్ హెల్త్ పై డబ్ల్యూహెచ్ఓ ఆందోళన..!!
- పిల్లిని రక్షించడానికి ప్రాణాలను పణంగా పెట్టిన వ్యక్తి..!!
- దమ్మామ్ మీదుగా కైరోకు.. కువైట్ ఎయిర్వేస్ సర్వీసులు..!!
- వెహికల్ నాయిస్ లిమిట్స్, మోడిఫికేషన్ పై హెచ్చరిక జారీ..!!









