శాంతి సందేశ వ్యాప్తి..15 వేల కి.మీ సైకిల్ రైడ్ చేస్తున్న భారతీయుడు

- February 22, 2023 , by Maagulf
శాంతి సందేశ వ్యాప్తి..15 వేల కి.మీ సైకిల్ రైడ్ చేస్తున్న భారతీయుడు

యూఏఈ: కేవలం 21 సంవత్సరాల వయస్సులో అహ్మద్ సబిత్.. ఈజిప్ట్‌లోని అల్ అజార్ విశ్వవిద్యాలయానికి చేరుకోవడానికి 15,000 కిలోమీటర్లకు పైగా సైక్లింగ్ చేసే సవాలును స్వీకరించాడు. దాదాపు 200 రోజుల తన ప్రయాణంలో సబిత్ మానవత్వం, శాంతియుత పోషణ కోసం ప్రవక్త ముహమ్మద్ (స) సందేశాన్ని ప్రచారం చేయనున్నాడు. తన సైకిల్‌పై అతను భారతదేశం, ఒమన్, యూఏఈ, ఖతార్, బహ్రెయిన్, కువైట్, సౌదీ అరేబియా, ఈజిప్ట్, జోర్డాన్, పాలస్తీనా, ఇజ్రాయెల్‌తో సహా రెండు ఖండాలలోని దాదాపు 11 దేశాల ద్వారా ప్రయాణించనున్నాడు. తన ప్రయాణంలో సబిత్ ప్రతి దేశంలోని స్థానిక సంప్రదాయాలను అధ్యయనం చేయనున్నాడు. “వివిధ సంస్కృతుల గురించి తెలుసుకోవడం గురించి నేను ఎప్పుడూ థ్రిల్‌గా ఉంటాను. ఈ యాత్రలో నేను మరింత సాంస్కృతిక వైవిధ్యాన్ని చూస్తానని ఖచ్చితంగా అనుకుంటున్నాను. ”అని సబిత్ చెప్పాడు.

భారతదేశంలోని కర్ణాటకలోని మంగళూరు సమీపంలోని బంటావాల్ నివాసి అయిన సబిత్ అక్టోబర్ 20, 2022న కేరళలోని తిరువనంతపురం నుండి తన ప్రయాణాన్ని ప్రారంభించాడు. అతను భారతదేశంలోని పశ్చిమ కనుమల మీదుగా సైకిల్ తొక్కాడం ప్రారంభించి రెండు నెలల్లో ముంబై చేరుకున్నాడు. ముంబై నుండి అతను ఒమన్‌లోని నిజ్వా, సోహర్ మీదుగా హట్టా సరిహద్దు వైపు ప్రయాణిస్తూ సలాలాకు చేరుకున్నాడు. జనవరి 27న అతను సైకిల్‌పై 4,000 కిలోమీటర్లు ప్రయాణించి యూఏఈ హట్టా సరిహద్దుకు చేరుకున్నాడు.  సగటున సబిత్ ప్రతిరోజూ 6 నుండి 8 గంటల పాటు 70 నుండి 100 కిలోమీటర్లు రైడ్ చేస్తాడు. ప్రస్తుతం సబిత్ కరామాలో తన బంధువులతో ఉంటున్నాడు. రాబోయే కొద్ది రోజుల్లో తన ప్రయాణాన్ని కొనసాగించాలని నిర్ణయించుకున్నాడు. అతను అబుధాబి వైపు ప్రయాణించి ఏడు రోజుల్లో సౌదీ అరేబియా సరిహద్దుకు చేరుకుంటాడు. " ఉమ్రా చేయడానికి మక్కా వైపు వెళ్లే ముందు ఖతార్, బహ్రెయిన్ మరియు కువైట్‌లను సందర్శిస్తాను" అని సబిత్ చెప్పారు. తన పవిత్ర తీర్థయాత్ర, మదీనాలోని చారిత్రక ప్రదేశాలను సందర్శించిన తర్వాత  సబిత్.. జోర్డాన్, పాలస్తీనా, ఇజ్రాయెల్, ఆపై ఈజిప్ట్‌లోని తన విశ్వవిద్యాలయానికి వెళ్లాలని యోచిస్తున్నాడు.

సబిత్ ఈ యాత్ర కోసం చిన్నప్పటినుండి డబ్బును దాచుకున్నట్లు తెలిపాడు. ట్రిప్ మొత్తం ఖర్చు దాదాపు ఒక మిలియన్ భారతీయ రూపాయలు (సుమారు 44,000 Dh) అని, తన డబ్బులో దాదాపు పావువంతు ఖర్చు చేసినట్లు తెలిపాడు. ప్రయాణం కోసం ఎంచుకున్న సైకిల్ ధర రూ.150,000 (సుమారు 6,600 దిర్హాంలు) అని, కాగా.. ఇప్పటి వరకు తన భోజనం, వసతి కోసం ఎలాంటి ఖర్చులు చెల్లించలేదని, తన పాలోవర్లే తనకు అన్ని సమకూర్చారని సబిత్‌ తెలిపారు. యూట్యూబ్‌లో 140,000 మంది సబ్‌స్క్రైబర్‌లను, ఇన్‌స్టాగ్రామ్‌లో 108,000 మంది ఫాలోవర్లను సంపాదించుకున్న ‘సబీ ఇన్‌స్పైర్స్’ పేరుతో సబిత్ తన సోషల్ మీడియా హ్యాండిల్స్‌లో తన పర్యటన విశేషాలను పంచుకుంటున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com