ముంబై మార్కెట్‌లో భారీ అగ్ని ప్రమాదం.. 20 షాపులు దగ్ధం

- March 13, 2023 , by Maagulf
ముంబై మార్కెట్‌లో భారీ అగ్ని ప్రమాదం.. 20 షాపులు దగ్ధం

ముంబై: మహారాష్ట్ర రాజధాని ముంబైలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. సోమవారం ఉదయం ముంబైలోని పశ్చిమ జోగేశ్వరి ప్రాంతం, ఓషివారా మార్కెట్‌లో అగ్ని ప్రమాదం జరిగింది. అక్కడి ఒక గోడౌన్‌లో చెలరేగిన మంటలు చుట్టుపక్కల వ్యాపించాయి.

ఉదయం పదకొండు గంటల సమయంలో రామ్ మందిర్ దగ్గర ఫర్నీచర్ గోడౌన్‌లో మంటలు మొదలయ్యాయి. ఈ మంటలు క్రమంగా ఇతర ప్రాంతాలకు వ్యాపించాయి. ఈ ప్రాంతంలోని దాదాపు 20కి పైగా షాపులకు మంటలు అంటుకున్నాయి. వెంటనే స్థానికులు ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. ఎనిమిది ఫైర్ ఇంజిన్లు ఘటనా స్థలానికి చేరుకుని, సహాయక చర్యలు ప్రారంభించాయి. అనంతరం మరో ఏడు ఫైర్ ఇంజిన్లు సహాయక చర్యల్లో పాల్గొన్నాయి. మొత్తం 15 ఫైర్ ఇంజిన్లు మంటలను ఆర్పేందుకు ప్రయత్నించాయి. చాలా శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చాయి. ఇంకా అగ్ని ప్రమాద ప్రభావం కొనసాగుతోంది.

మంటలను పూర్తిగా చల్లార్చేందుకు అగ్నిమాపక సిబ్బంది కృషి చేస్తున్నారు.ఈ ప్రమాదాన్ని లెవెల్-3 స్థాయి అగ్ని ప్రమాదంగా ఫైర్ సిబ్బంది చెప్పారు. ఈ ఘటనలో ఎవరికీ, ఎలాంటి హాని జరగకపోవడం విశేషం. ప్రాణ నష్టం లేకపోయినప్పటికీ, ఆస్తి నష్టం మాత్రం ఎక్కువగానే ఉంది. అగ్ని ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com