ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ పై కార్మికుల ఆగ్రహం

- May 02, 2023 , by Maagulf
ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ పై కార్మికుల ఆగ్రహం

రోమ్‌:  కార్మికుల పోరాటాల ఫలితమే మేడే అని, ఆ రోజుని ఏ మంత్రి మండలి క్యాట్‌వాక్‌గా ఉపయోగించకూడదంటూ ఇటలీలో కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం మేడే సందర్భంగా ఇటాలియన్‌ జనరల్‌ కన్ఫెడరేషన్‌ ఆఫ్‌ లేబర్‌ (CGIL), ఇటాలియన్‌ కన్ఫెడరేషన్‌ ఆఫ్‌ వర్కర్స్‌ యూనియన్స్‌ (CISL), ఇటాలియన్‌ యూనియన్‌ ఆఫ్‌ లేబర్‌ (UIL)లు సంయుక్తంగా బాసిలిటికా ప్రాంతంలోని పొటెంజా నగరంలో భారీ ప్రదర్శన చేపట్టాయి.  కార్మికులకు వ్యతిరేకంగా పలు నిర్ణయాలను ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ అమలు చేస్తున్నారని హెచ్చరించాయి. ఉక్రెయిన్‌ యుద్ధంతో దేశంలో నెలకొన్న ఆర్థిక పరిణామాల కారణంగా ప్రజల్లో కొనుగోలు శక్తి తగ్గిపోయిందని, అలాగే ప్రధాని జార్జియా మెలోని నిర్ణయాలకు వ్యతిరేకంగా అంతర్జాతీయ కార్మికుల దినోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా కార్మికులు తమ అసంతృప్తిని వ్యక్తం చేశారు.

సోమవారం మేడే సెలవుని నిర్లక్ష్యం చేస్తూ.. ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ మంత్రి మండలిని సమావేశపరిచి, ఈ ఏడాది చివరి వరకు పన్నుల భారాల సవరణ ఉత్తర్వులను ఆమోదించారు. కొత్త నిబంధన కార్మికులపై పన్ను వెడ్జ్‌ను భారీగా పెంచింది. పన్ను వెడ్జ్‌ అంటే యజమాని చెల్లించే జీతం మరియు కార్మికుడు పొందే ఆదాయం మధ్య వ్యత్యాసం. దీని ఫలితంగా ఏడాదికి 35,000 యూరోల వరకు సంపాదించే కార్మికులకు సుమారు 10 యూరోల నికర జీతం పెరుగుతుంది. ద్రవ్యోల్బణం అధికంగా ఉన్న సమయంలో ఈ పన్ను వెడ్జ్‌తో వేతనదారుల పట్టికను అనుసరించి అదనంగా 100 యూరోలను ఇస్తుందని మెలోనీ ప్రకటించారు.

ఈ ఉత్తర్వులపై కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధిక ద్రవ్యోల్బణం సమయంలో ఈ ఉత్తర్వులను నిరుపయోగంగా, పనికిరాని చెత్తగా కార్మికులు పేర్కొంటున్నారు. 'మేడే'కి విలువనివ్వాలని, ఆ రోజు ప్రత్యేకత గురించి తెలుసుకోవాలని ధ్వజమెత్తారు. కార్మికుల సంక్షేమం కోసం ప్రతి రోజూ ప్రభుత్వం ఆలోచించాలని, కేవలం మేడే ఒక్కరోజు తీసుకుంటే సరిపోదని మండిపడ్డారు. వాస్తవ ప్రత్యామ్నాయమంటే ఆదాయ పన్నులను తగ్గించడం కాదని... ఆదాయంలో 90 శాతం ఉన్నతాధికారుల జేబుల్లోకి వెళుతుందని ఆర్థికవేత్తలు కూడా స్పష్టం చేశారని అన్నారు. పేదరికానికి వ్యతిరేకంగా పోరాటం చేయడం నిజమైన ప్రత్యామ్నాయమని అన్నారు. గంటకు కనీసం పది యూరోల చట్టబద్ధమైన కనీస వేతన ప్రతిపాదనతో పాటు ఉద్యోగుల్లో అభద్రతను తొలగించడం, పని ప్రదేశాల్లో మరణాలను తగ్గించడమని పేర్కొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com