బాంబు బెదిరింపుతో ఈఫిల్ టవర్ ఖాళీ

- August 13, 2023 , by Maagulf
బాంబు బెదిరింపుతో ఈఫిల్ టవర్ ఖాళీ

ప్రపంచ ప్రఖ్యాతమైన ఈఫిల్ టవర్‌కు బాంబు బెదిరింపు వచ్చింది. ఫ్రాన్స్ రాజధాని పారిస్ నగరంలో కొలువై ఉన్న ప్రపంచ ప్రఖ్యాత ఈఫిల్ టవర్లో బాంబు పెట్టామని గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్ చేశారు. నిత్యం వేలాది మంది సందర్శించే ఈఫిల్ టవర్ ను బాంబు బెదిరింపు నేపథ్యంలో భద్రతా బలగాలు తమ అధీనంలోకి తీసుకున్నాయి. అధికారులు టవర్‌లోని మూడు ఫ్లోర్ల నుంచి పర్యాటకులను ఖాళీ చేయించారు.

ఈఫిల్ టవర్‌లో బాంబు పెట్టారని ఎప్పుడైనా పేలవచ్చునని ఫోన్ రావడంతో భద్రతా బలగాలు రంగంలోకి దిగాయి. కింది భాగంలో ఉన్న సందర్శన స్థలం నుంచి కూడా పర్యాటకులను బయటికి పంపించి వేశారు. ఈఫిల్ టవర్ నిర్వహణ సంస్థ ఎస్ఈటీఈ (SETE) దీనిపై స్పందించింది. బెదిరింపు కాల్ వచ్చిన వెంటనే పోలీసులకు సమాచారం అందించామని ఎస్ఈటీఈ అధికార ప్రతినిధి తెలిపారు. బాంబు డిస్పోజల్ నిపుణులు అక్కడికి తరలివచ్చారు. పోలీసులు కూడా వెంటనే అక్కడికి చేరుకుని తనిఖీలు చేపట్టినట్టు, అక్కడున్న ఓ రెస్టారెంటులోనూ సోదాలు నిర్వహించినట్టు వివరించారు.అయితే సుమారు రెండు, మూడు గంటల తర్వాత సందర్శకులను తిరిగి అనుమతించినట్లు ఫ్రెంచ్ పోలీసు వర్గాలు తెలిపాయి. గతంలో 2020 సెప్టెంబరులో, పోలీసులకు ఇలాంటి కాల్ రాగా అప్పుడు కూడా టవర్‌ను రెండు గంటల పాటు ఖాళీ చేయించారు. ఇది ఈ టవర్ నిర్మాణ పనులు జనవరి 1887లో ప్రారంభమై మార్చి 31, 1889న పూర్తయ్యాయి. 1889లో జరిగిన వరల్డ్ ఫెయిర్ సందర్భంగా ఆ ఏడాదిలో ఈఫిల్‌ టవర్‌ను సుమారు 20 లక్షల మంది సందర్శించారు. గత ఏడాది 62 లక్షల మంది దీనిని చూసేందుకు అక్కడకు వెళ్లారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com