సిమ్లాలో కూలిన శివాలయం…9 మంది మృతి

- August 14, 2023 , by Maagulf
సిమ్లాలో కూలిన శివాలయం…9 మంది మృతి

హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని సిమ్లాలో కురుస్తున్న భారీవర్షాల కారణంగా శివాలయం కూలిపోయింది. ఈ దుర్ఘటనలో 9మంది మరణించారని హిమాచల్ రాష్ట్ర ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ చెప్పారు. సమ్మర్ హిల్ ప్రాంతంలోని ఆలయం వద్ద కొండచరియలు విరిగిపడటంతో డజన్ల కొద్దీ చిక్కుకున్నారు. హిమాచల్ పోలీసులు, స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (SDRF) అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. సావన్ సందర్భంగా ప్రార్థనలు చేసేందుకు భక్తులు తరలివచ్చారు.

శివాలయం కూలిన సంఘటన జరిగినప్పుడు దాదాపు 50 మంది ఉన్నారని ఓ అధికారి చెప్పారు. ఇప్పటికీ చిక్కుకుపోయిన వ్యక్తులను రక్షించేందుకు స్థానిక యంత్రాంగం శిథిలాలను తొలగించేందుకు కృషి చేస్తోందని ముఖ్యమంత్రి తెలిపారు. శివ్ మందిర్ కూలిన ఘటనలో ఇప్పటికి 9 మృతదేహాలను వెలికితీశారు. ఆలయం కూలిన ప్రదేశానికి ముఖ్యమంత్రి చేరుకోనున్నారు. హిమాచల్ ప్రదేశ్‌లో గత 48 గంటలుగా నిరంతరాయంగా వర్షాలు కురుస్తున్నాయి.

బియాస్ నది నీటిమట్టం పెరిగింది. వర్షాలకు సంబంధించిన సంఘటనల్లో కొంతమంది మరణించారు. హిమాచల్ ప్రదేశ్‌లోని సోలన్‌లో ఒక గ్రామంలో క్లౌడ్ బరస్ట్ వల్ల ఏడుగురు మరణించారు. ఈ సంఘటన ఆదివారం అర్థరాత్రి జాదోన్ గ్రామంలో చోటుచేసుకుంది. ఆరుగురిని రక్షించినట్లు అధికారి తెలిపారు.

గత 24 గంటల్లో హిమాచల్ ప్రదేశ్‌లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడి, బస్సులు ట్రక్కుల రాకపోకలు నిలిచిపోయాయి. సిమ్లా-చండీగఢ్ రహదారితో సహా పలు రహదారులను మూసివేశారు. సోలన్‌లోని కోటి సమీపంలోని చక్కి మోర్ వద్ద రహదారికి ఇరువైపులా పెద్ద సంఖ్యలో భారీ వాహనాలు నిలిచిపోయాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com