సెమీస్లో కివీస్పై టీమ్ఇండియా ఘన విజయం
- November 15, 2023
ముంబై: విశ్వవిజేతగా నిలిచేందుకు భారత్కు ఇంకొక్క విజయం చాలు. 12 ఏళ్ల కలను తీర్చుకునేందుకు టీమ్ఇండియా ఎదుట సువర్ణావకాశం. సెమీఫైనల్లో న్యూజిలాండ్ను మట్టికరిపించిన భారత్ దర్జాగా ఫైనల్లో అడుగుపెట్టింది. ఆదివారం (నవంబర్ 19)న ఫైనల్ మ్యాచ్ జరగనుంది. దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరగనున్న రెండో సెమీ ఫైనల్ మ్యాచ్లో విజయం సాధించిన జట్టుతో ఫైనల్ మ్యాచ్లో భారత్ అమీ తుమీ తేల్చుకోనుంది. ఈ ఒక్క మ్యాచులో గెలిస్తే చాలు ప్రపంచకప్ విజేతగా భారత్ నిలవనుంది.
398 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ 48.5 ఓవర్లలో 327 పరుగులకు ఆలౌటైంది. దీంతో భారత్ 70 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ గెలుపుతో 2019 వన్డే ప్రపంచకప్లో ఎదురైన ఓటమికి ప్రతీకారం తీర్చుకున్నట్లైంది. కివీస్ బ్యాటర్లలో డారిల్ మిచెల్ (134; 119 బంతుల్లో 9 ఫోర్లు, 7 సిక్సర్లు) సెంచరీ చేశాడు. కేన్ విలియమ్సన్ (69; 73 బంతుల్లో 9 ఫోర్లు, 1 సిక్స్) హాప్ సెంచరీ చేశాడు. మిగిలిన వారు విఫలం కావడంతో కివీస్ ఓటమి తప్పలేదు. భారత బౌలర్లలో మహ్మద్ షమీ ఏడు వికెట్లు తీశాడు. బుమ్రా, సిరాజ్, కుల్దీప్ యాదవ్ లు తలా ఓ వికెట్ పడగొట్టారు.
విరాట్ కోహ్లీ (117; 113 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్సర్లు), శ్రేయస్ అయ్యర్ (105; 70 బంతుల్లో 4 ఫోర్లు, 8 సిక్సర్లు) శతకాలతో చెలరేగడంతో మొదట బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 398 పరుగులు చేసింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్కు ఓపెనర్లు రోహిత్ శర్మ (47; 29 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సర్లు), శుభ్మన్ గిల్ (79; 65 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్స్లు) శుభారంభం అందించారు. మొదటి వికెట్కు 71 పరుగులు జోడించిన తరువాత కేన్ విలియమ్సన్ అద్భుత క్యాచ్ పట్టడంతో రోహిత్ శర్మ ఔట్ అయ్యాడు.
ఆ తరువాత శతకం దిశగా దూసుకువెలుతున్న గిల్ రిటైర్డ్ హర్ట్ గా వెనుదిరిగాడు. ఈ క్రమంలో బ్యాటింగ్కు వచ్చిన శ్రేయస్ అయ్యర్ తో కలిసి విరాట్ కోహ్లీ ఇన్నింగ్స్ను నడిపించారు. వీరిద్దరు కివీస్ బౌలర్లపై ఎదురుదాడికి దిగారు. పోటాపోటీగా బౌండరీలు బాదారు. ఫెర్గూసన్ బౌలింగ్లో రెండు పరుగులు తీసిన కోహ్లీ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. వన్డేల్లో కోహ్లీకి ఇది 50వ సెంచరీ. ఈ క్రమంలో వన్డేల్లో యాభై సెంచరీలు చేసిన మొదటి ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. ఆ తరువాత కాసేపటికే సౌథీ బౌలింగ్లో కాన్వే క్యాచ్ అందుకోవడంతో కోహ్లీ ఔట్ అయ్యాడు. కోహ్లీ-శ్రేయస్ జోడి మూడో వికెట్కు 163 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.
కోహ్లీ నిష్ర్కమించినా కూడా శ్రేయస్ దూకుడుగా ఆడాడు. ఈ క్రమంలో 67 బంతుల్లో సెంచరీ చేశాడు. మరికాసేటికే శ్రేయస్ ఔట్ అయ్యాడు. ఆఖర్లో కేఎల్ రాహుల్ (39 నాటౌట్ 20 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లు) దూకుడుగా ఆడడంతో భారత్ నాలుగొందల పరుగులకు దగ్గరగా వచ్చింది.
తాజా వార్తలు
- ఎతిహాద్ రైల్ ప్రయాణికులకు కీలక మార్గదర్శకాలు..
- యూఏఈలో సాధారణ పాస్పోర్ట్, వీసా సేవల నిలిపివేత మరో రోజు పొడిగింపు..
- ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్తో ఒమాన్ సుల్తాన్ హైథమ్ భేటీ..
- మూడు నెలల పాటు జరిమానాల్లో 50% తగ్గింపు ప్రకటించిన షార్జా పోలీసులు
- పద్మభూషణ్ డా.నోరి దత్తాత్రేయుడిని ఘనంగా సత్కరించిన మెడికవర్ హాస్పిటల్స్
- డ్రగ్స్ మాఫియా పై ఉక్కుపాదం.. స్మగ్లర్ల ఆస్తుల జప్తు: హోమ్ మంత్రి అనిత
- ఖమేనీ అంత్యక్రియలకు ప్రధాని మోదీ దూరం..
- నెలల విరామం తర్వాత ఇరాన్–యూఏఈ మధ్య విమాన సర్వీసులు పునఃప్రారంభం
- సెమీకండక్టర్–ఏఐ అవకాశాలకు తైవాన్కు ICIE ఆహ్వానం
- తెలంగాణలో భారీగా డీఎస్పీల బదిలీలు..డీజీపీ సీవీ ఆనంద్ ఉత్తర్వులు







