మహావీర్ జయంతి
- April 21, 2024జైన మతస్తులకు మహావీర్ జయంతి ఎంతో ప్రత్యేకమైనది. ధర్మాన్ని ప్రచారం చేసే గురువుగా మహావీరుడు ప్రసిద్ధి చెందాడు. హిందూ పంచాంగం ప్రకారం ఛైత్ర మాసంలోని శుక్ల పక్షంలోని త్రయోదశి తిథి రోజున మహావీర్ జయంతిని జరుపుకుంటారు. ఈ సంవత్సరం ఏప్రిల్ 21న మహావీరుని జయంతి. ఆయన జయంతి రోజు జైన మతస్తులకు పరమ పవిత్రమైన దినం. మహావీర్ జయంతి రోజున జైన మతస్తులు ఆయన గౌరవార్ధం ప్రభాత్ ఫేరీ, ఊరేగింపు వంటి కార్యక్రమాలు నిర్వహిస్తారు.
మానవునిగా పుట్టిన ప్రతి ఒక్కరూ మోక్షాన్ని పొందాలంటే ఐదు సూత్రాలను తప్పక పాటించాలని మహావీరుడు బోధించాడు. మహావీరుడు బోధించిన అహింస, అస్తేయ, బ్రహ్మచర్యం, సత్యం, అపరిగ్రహం అనే ఈ ఐదు సూత్రాలను మహావీర్ జయంతి రోజున ప్రజలందరూ స్మరించుకుంటూ ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. అంతేకాకుండా ఈ పవిత్రమైన రోజున కఠినమైన ఉపవాస వ్రతాన్ని కూడా ఆచరిస్తారు.
క్రీస్తుపూర్వం 599వ సంవత్సరంలో బీహార్లోని వైశాలికి సమీపంలోని కుండల గ్రామంలో మహావీర్ రాజు సిద్ధార్థ, రాణి త్రిసాల దంపతులకు మహావీర్(వర్థమాన్) జన్మించినట్లు చెబుతారు. తను 28 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు తండ్రి మరణించాడు. ఆ సమయంలో యశోధరను పెళ్లి చేసుకున్నాడు. వీరికి ఓ కుమార్తె పుట్టింది.
రాజ కుటుంబంలో పుట్టిన మహావీరునికి విలాసాలు, సౌకర్యాలకు ఏ మాత్రం లోటు ఉండేది కాదు. అయితే తను ఎప్పటికీ వాటిని కోరుకులేదు. తనను ఖరీదైనవి ఏవీ ఆకర్షించలేదు. ఎప్పుడు కూడా తన ఉనికిని తెలుసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉండేవాడు. ఇదే క్రమంలో మహావీరుడు వైరాగ్యంతో తన 36వ ఏట రాజ్యాన్ని, ఐహిక సుఖాలను వదిలివేసి అంతర్గత శాంతి కోసం, ప్రశాంతం కోసం అడవులకు వెళ్లి దాదాపు 12 సంవత్సరాల పాటు తపస్సు చేశాడు.
12 సంవత్సరాల కఠిన తపస్సు తర్వాత మహావీరునికి జ్ఞానోదయం కలిగి మహావీరుడిగా మారాడు. తాను సంపాదించిన జ్ఞానాన్ని నలుగురికి పంచి పెట్టడానికి మగధ రాజ్యంతో పాటు తూర్పునకు వెళ్లి తన సిద్ధాంతాలను బోధించాడు. బింబిసారుడు, అజాత శత్రువు తదితర రాజులను కలుసుకున్నాడు.
దేశం నలుమూల తిరిగి తన సిద్ధాంతాలను వ్యాప్తి చేసిన మహావీరుడు తన 72వ ఏట తుది శ్వాస విడిచారు. ఇంతకు మునుపు 23 మంది తీర్ధంకరులు ఉన్న మహావీరుని హయాంలోనే జైన మతానికి విశేషమైన గుర్తింపు వచ్చింది. అందుకే 32 సంవత్సరాల పాటు అహింస, ధర్మం గురించి ప్రచారం చేసిన మహావీరుడు జైనులకు ఆరాధ్య దైవమయ్యారు. ఆయన జయంతి ప్రతి ఏటా ఒక ఉత్సవంలా జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది.
--డి.వి.అరవింద్(మాగల్ఫ్ ప్రతినిధి)
తాజా వార్తలు
- మళ్లీ టెన్షన్ పెడుతోన్న కరోనా.. సింగపూర్లో వ్యాపిస్తోన్న మహమ్మారి
- భారత్ లో రేపు ఐదో దశ పోలింగ్.. పోటీలో ప్రముఖ నేతలు
- సర్వత్రా ఉత్కంఠ..ఇరాన్ అధ్యక్షుడు రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ పర్వతాల్లో క్రాష్..
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు