పొలిటికల్ కింగ్ మేకర్....!

- April 25, 2024 , by Maagulf
పొలిటికల్ కింగ్ మేకర్....!

దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత దేశ రాజకీయాల్లో ఎన్ని పెనుమార్పులు సంభవించాయే తెలియదు కాని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో మాత్రం అనేక మార్పులు చేర్పులు జరుగుతూ వచ్చాయి. ఈ రాజకీయ సంస్కరణల కాలంలో నీలం సంజీవ రెడ్డి , కాసు బ్రహ్మానంద రెడ్డి వంటి శక్తివంతులైన ముఖ్యమంత్రులతో పాటుగా అప్పటి మంత్రులు అల్లూరి సత్యనారాయణ రాజు, ఏ.సి.సుబ్బారెడ్డి వంటి పలువురు బలమైన నాయకులు రాష్ట్ర రాజకీయాలను శాసించారు. రాష్ట్ర రాజకీయాల్లో కింగ్ మేకర్ గా చక్రం తిప్పిన వ్యక్తి ఒకరున్నారు.  

కానీ వీరితో పాటుగా ఎటువంటి ఉన్నత పదవి లేకుండానే రాష్ట్ర రాజకీయాలలో తనదైన శైలిలో చాణక్య రాజకీయం చేయడంతో పాటు, రాజకీయాలకు కొత్త అర్థం చెప్పిన రాజకీయ దురంధరుడిగా ఆయనకు పేరుంది. కింగ్‌మేకర్‌గా ప్రసిద్ధి పొంది ఆయన పేరు కన్న తాను అధిష్టించిన పదవితోనే రాష్ట్ర స్థాయిలో ప్రసిద్ధి గాంచారు.ఆయనే రాయవరం మునుసుబు సత్యనారాయణ మూర్తి గారు.  అసలు పేరు వుండవిల్లి సత్యనారాయణ మూర్తి అయినప్పటికీ వంశపారంపర్యంగా వచ్చిన మునసబు గిరీ ఆయన పేరుగా మారింది. ఈయనను జనం రాయవరం దత్తుడు అని పిలిచేవారు. నేడు రాయవరం మునుసుబు జయంతి.

వుండవిల్లి సత్యనారాయణ మూర్తి ఏప్రిల్ 25,1916న ఒకప్పటి ఉమ్మడి మద్రాస్ ప్రావిన్స్ లోని తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురం తాలూకా రాయవరం గ్రామంలోని సంపన్న సంపన్న రైతు కుటుంబంలో జన్మించారు. కన్న తల్లిదండ్రులు రిమ్మలపూడి నారాయణ మూర్తి , సూరమ్మ గార్లు కాగా చిన్నతనంలోనే తన తల్లి తండ్రి గారైన వుండవిల్లి రామయ్య , చెల్లాయమ్మ దంపతులకు దత్తతగా వెళ్లడంతో వీరిని రాయవరం దత్తుడు అని కూడా ఆ ప్రాంత ప్రజానీకం పిలుచుకుంటుంది.

సత్యనారాయణ మూర్తి తాత గారైన మునుసుబు రామయ్య ఆకస్మిక మరణంతో అతి పిన్న వయస్సులోనే రాయవరం మునుసుబుగా బాధ్యతలు చేపట్టడంతో స్కూల్ విద్య వరకే పరిమితం కావడం జరిగింది. అయితే, మునుసుబుగా అతికొద్ది కాలంలోనే గ్రామ పరిపాలన మీద పట్టు సాధించి రామచంద్రపురం తాలూకా రాజకీయాల్లో కీలకమైన పాత్ర పోషించే స్థాయికి ఎదగడం జరిగింది. ఈ క్రమంలోనే 1939లో వెదురుపాక గ్రామ కేంద్రంగా ఉన్న మునుసుబు పదవిని రాయవరం గ్రామానికి మార్పించి తాలూకా రాజకీయాల్లో ఆ గ్రామానికి ప్రత్యేక గుర్తింపు తీసుకువచ్చారు

చిన్నతనం నుంచే దేశ స్వతంత్రం కోసం పోరాడిన మహాత్మా గాంధీ మరియు ఆయన నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీని మునుసుబు ఏంతో అభిమానించే వారు, దేశ స్వతంత్రం రాక ముందు నుండే కాంగ్రెస్ పార్టీని  రామచంద్రపురం తాలూకాలో బలోపేతం చేసేందుకు అన్ని సామాజిక వర్గాలకు చెందిన వారిని రాజకీయంగా ప్రోత్సహించడం జరిగింది. 

అనతి కాలంలోనే తన కార్యశీలత , అంకుటిత దీక్ష ,పట్టుదల, క్రమశిక్షణలతో జిల్లా రాజకీయాల్లో తిరుగులేని నాయకుడిగా ఏదిగారు. గోదావరి జిల్లాల్లో ఉన్న జమీందారి వర్గాలకు, ఇతర రాజకీయ కుటుంబాలకు సైతం దక్కని అశేష ప్రజాభిమానాన్ని సొంతం చేసుకున్నారు.

కాంగ్రెస్ కురువృద్ధుడు కళా వెంకట్రావు శిష్యుడిగా జిల్లా రాజకీయాల్లో కీలకమైన పాత్ర పోషిస్తున్న సమయంలోనే కాంగ్రెస్ తరపున ఉమ్మడి గోదావరి జిల్లాల స్థానిక సంస్థల శాసనమండలి సభ్యుడిగా ఎన్నికై ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో అడ్డుపెట్టారు.

ఆనాటి రాష్ట్ర రాజకీయాల్లో బలవంతులైన నీలం సంజీవ రెడ్డి, అల్లూరి సత్యనారాయణ రాజు, పిడతల రంగారెడ్డి , కాసు బ్రహ్మానంద రెడ్డి, ఏ.సి.సుబ్బారెడ్డి లు రాజకీయ ఆధిపత్య పోరు నడుస్తున్న సమయంలో మునుసుబు గారు తటస్థంగా వ్యవహరిస్తూనే పార్టీ లో ప్రజాస్వామ్య వ్యవస్థ పటిష్టపరిచేందుకు కృషి చేశారు.

రాజకీయ వ్యూహాలను రచించడంలో దిట్ట. నాటి ప్రధాని ఇందిరాగాంధీ వద్ద ఈయనకు మంచి పలుకుబడి ఉండేది. కాంగ్రెస్‌ పార్టీ అధిష్టానం వద్దే పట్టు ఉండడంతో రాష్ట్ర రాజకీయాలలో ముఖ్యమంత్రులను సైతం మార్పించిన ఘనత మునసబుకు ఉందని ఆయన శిష్యులు నేటికీ చెబుతారు. ఆనాటి ముఖ్యమంత్రి సంజీవ రెడ్డి పక్షపాత రాజకీయాలను విభేదించిన కాసు బ్రహ్మానంద రెడ్డి వర్గంలో మునుసుబు గారు కూడా కీలకంగా వ్యవహరించారు.1964లో సంజీవ రెడ్డిని దింపి కాసు బ్రహ్మానందరెడ్డి ముఖ్యమంత్రి కావడంలో ఈయన తెరవెనుక కీలకపాత్ర పోషించారు.  

బ్రహ్మానంద రెడ్డి వర్గంలో ముఖ్య నాయకుడిగా ఉంటూనే కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కోశాధికారి గా పదవి బాధ్యతలు చేపట్టి పార్టీ కార్యక్రమాలు విజయవంతంగా నిర్వహించారు.1967, 1972, 1978 అసెంబ్లీ ఎన్నికల్లో గోదావరి జిల్లాల నుంచి పాత కాంగ్రెస్ మరియు ఇందిరా కాంగ్రెస్ పార్టీలకు చెందిన అభ్యర్థులు అత్యధిక శాతం మంది ఎమ్మెల్యేలుగా గెలుపొందడంలో ఈయన కీలకమైన పాత్ర పోషించారు.

1977లో దేశవ్యాప్తంగా జనతాపార్టీ ప్రభంజనం ఉన్న సమయంలో అనేక మంది కాంగ్రెస్ పాత కాపులు మొత్తం జనతా పార్టీకి జై కొట్టడంతో సందిగ్ధంలో పడిన ఇందిరా గాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతూ ఆమెకు అండగా నిలుస్తూ వచ్చారు. 1978 అసెంబ్లీ ఎన్నికల్లో విశాఖపట్నం, గోదావరి జిల్లాల్లో కాంగ్రెస్ పార్టీకి విజయాన్ని చేకూర్చే బాధ్యతను భుజానికెత్తుకొని అన్ని తానై వ్యవహరించి పార్టీని విజయతీరాల వైపు నడిపించారు. పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఎటువంటి ఉన్నతమైన రాజకీయ పదవులు ఆశించలేదు.

అయితే, అభిమానుల కోరిక మేరకు రాయవరం సమితి అధ్యక్షుడుగా మునుసుబు పనిచేశారు.రాయవరం సమితి అధ్యక్షుడుగా ఉంటూనే జిల్లా, రాష్ట్ర రాజకీయాల్లో తన పట్టును నిలుపుకుంటూ వచ్చారు.1982లో ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించిన తర్వాత పార్టీలోకి రావాలని ఎన్టీఆర్ స్వయంగా వీరికి ప్రత్యేకంగా ఆహ్వానం పలికినా కాంగ్రెస్ పార్టీని మాత్రం వీడలేదు.

రాయవరం మునుసుబుగా గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేశారు.1950వ దశకంలోనే ఆ గ్రామానికి విద్యుత్ సౌకర్యం కల్పించడం, రోడ్ల నిర్మాణంతో పాటుగా విద్యా, వైద్య రంగాలను అభివృద్ధి పరిచారు. గ్రామంలో పలు రకాల సహకార పరిశ్రమలను ఏర్పాటు చేశారు.రాయవరంలో అన్ని ప్రభుత్వ కార్యాలయాలు ఒకే చోట ఏర్పాటు చేసి తన దూరదృష్టిని చాటుకున్నారు.

బ్రహ్మానంద రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో గోదావరి జిల్లాల వ్యాప్తంగా ఉన్న బడుగు బలహీన వర్గాలకు చెందిన వారికి  ఉపాధి కల్పన, వ్యవసాయం చేసుకోవడానికి బంజరు భూముల పంపిణీ చేయించారు. అలాగే, గోదావరి జిల్లాల్లో రోడ్లు నిర్మాణం, సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం, సహకార వ్యవస్థల బలోపేతం , ప్రభుత్వ సంక్షేమ పథకాల ఫలాలను లబ్ధిదారులకు అందేలా చర్యలు చేపట్టారు.

మునుసుబు విద్యాభివృద్ధి కోసం కీలకంగా కృషి చేశారు. విద్య ద్వారానే సమాజంలో ఉన్న అంతరాలు తొలగించడం సాధ్యం అని నమ్మిన వ్యక్తి కావడంతో జిల్లా పరిషత్ ఉపాధ్యక్షుడుగా ఉన్న సమయంలో జిల్లా పరిషత్ నిధులతో తూర్పుగోదావరి జిల్లాలోని పలు గ్రామాల్లో పాఠశాలలు స్థాపించారు.పాఠశాల విద్యార్థులకు ఉన్నత విద్య కోసం ఉపకారవేతనాలు మంజూరు చేయించడం జరిగింది. 

ఉన్నత స్థాయి విద్యను అందించేందుకు తన సొంత నిధులతో 1966లోనే రామచంద్రపురం పట్టణంలో వి.ఎస్.యం డిగ్రీ కళాశాలను (V.S.M Degree and PG college) స్థాపించి ఎందరో నిరుపేద విద్యార్థులకు ఉచితంగా ఉన్నత విద్య చెప్పించారు. కళాశాలలో చదువుకున్న ఎందరో విద్యార్థులు ఈరోజు దేశ , విదేశాల్లో ఉన్నత స్థానాల్లో ఉన్నారు.

రాజకీయాల్లో ఎందరో బడుగు బలహీన మరియు మధ్యతరగతి వర్గాలకు చెందిన యువకులను రాజకీయాల్లో ప్రోత్సహించారు.రాజకీయాలు ధనవంతులకే కాదు సామాన్యులకు కూడా అని నమ్మి వారిని తన శిక్షణలో రాష్ట్ర నాయకులుగా తయారు చేశారు.రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్‌చంద్రబోస్, మాజీ రాజ్యసభ సభ్యురాలు తటవర్తి రత్నాబాయి, మాజీ మంత్రి దివంగత సంగీత వెంకటరెడ్డి(చినకాపు), మాజీ ఎమ్మెల్యేలు తేతలి రామారెడ్డి, వల్లూరి రామకృష్ణ చౌదరి, బొడ్డు భాస్కర రామారావు వంటి గోదావరి జిల్లాలకు చెందిన అనేకమంది ప్రముఖ రాజకీయ నాయకులు వీరి శిష్యులు.

సామాన్యులకు ప్రభుత్వంలో ఏ పని కావాలన్నా రాయవరం మున్సబు గారి వద్దకు వెళితే అయిపోతుందని ప్రతీతి. వివిధ పనుల నిమిత్తం ఆయన వద్దకు వచ్చే జనాన్ని తన సొంత ఖర్చులతో జిల్లా రాజధానికి, రాష్ట్ర రాజధానికి తీసుకువెళ్లి మరీ ఆ పనులు పూర్తి చేసేవారు.దాదాపు 1600 ఎకరాల భూస్వామి అయిన ఈయన సింహభాగం రాజకీయాలకే వెచ్చించారని చెప్పుకుంటారు.

గోదావరి ప్రాంతంలో ఆది నుండి బలమైన జమీందారి మరియు రాజకీయ కుటుంబాలకు చెందిన వారికి దక్కని అశేషమైన ప్రజాభిమానం వీరి సొంతం.రాజకీయాల్లో వీరితో సైద్ధాంతికంగా విభేదించిన ఆనాటి కమ్యూనిస్టు, సోషలిస్టు పార్టీలకు చెందిన నాయకులతో సైతం సన్నిహితంగా మెలిగేవారు.తన రాజకీయ ఉన్నతికి కారణమైన కాంగ్రెస్ పార్టీ అభిమానంతోనే తన చివర శ్వాస విడిచిపెట్టె వరకు మార్గ మధ్యలో ఎన్ని ప్రలోభాలు ఎదురైనా ఆ పార్టీతోనే కొనసాగారు.

1989లో సార్వత్రిక ఎన్నికలకు అభ్యర్థులతో నామినేషన్లు వేయించే పనిలో భాగంగా కాంగ్రెస్ అభ్యర్థులైన సినీ నటి జమున, మాజీ మంత్రి పిల్లి సుభాష్‌చంద్రబోస్‌లతో కలసి ద్రాక్షారామ శ్రీ భీమేశ్వరస్వామి సన్నిధిలో కార్తీకమాసంలో ఏకాదశి రోజున లక్షపత్రి పూజ చేయిస్తూ నవంబర్‌ 6న గుండెపోటు వచ్చి అక్కడే కన్నుమూశారు.ఈనాడు ఎమ్మెల్యే , మంత్రి పదవులు ఉంటేనే ప్రజలకు ఏదో చేయొచ్చు అనే అపోహలతో బ్రతుకుతున్న రాజకీయ నాయకులకు భిన్నంగా మునుసుబు గారి రాజకీయ ప్రయాణం సాగింది.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఏర్పాటు నుండి ఇప్పటి వరకు మన రాజకీయాల్లో ఎందరో గొప్ప గొప్ప రాజకీయ నాయకులు మరియు వ్యూహకర్తలు ఉన్నారు. వాళ్ళందరి గురించి కాకపోయినా రాజకీయాల్లో నిస్వార్థంగా ప్రజలకు సేవ చేసిన ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రలో కనుమరుగైన ఇలాంటి ఈ ప్రముఖ రాజకీయ వేత్తల గురించి ఇప్పటి తరానికి చెందిన వారు  తెలుసుకోవాలి. 
                                    
                                                --డి.వి.అరవింద్(మాగల్ఫ్ ప్రతినిధి)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com