రియో ఒలింపిక్స్‌ లో బోపన్నకు జోడిగా లియాండర్‌ పేస్‌..

- June 11, 2016 , by Maagulf
రియో ఒలింపిక్స్‌ లో బోపన్నకు జోడిగా లియాండర్‌ పేస్‌..

ఆగస్టులో జరగబోయే రియో ఒలింపిక్స్‌ పురుషుల డబుల్స్‌ టెన్నిస్‌ విభాగంలో రోహన్‌ బోపన్నకు జోడిగా లియాండర్‌ పేస్‌ను ఎంపిక చేసినట్లు ఏఐటీఏ ప్రకటించింది. భాగస్వామి ఎంపిక విషయంలో బోపన్న కోరికను కాదని.. పేస్‌ను ఎంపికచేసింది. మిక్స్‌డ్‌ డబుల్స్‌లో సానియా మీర్జాకు జోడీగా బోపన్నను ఎంపికచేసింది. మహిళల డబుల్స్‌ విభాగంలో సానియా - ప్రార్థన తాంబ్రే జోడి ఎంపికైంది.తనకు జోడిగా రోహన్‌ బోపన్న సాకేత్‌మైనేనిని ఎన్నుకోవడంతో.. రియోలో పేస్‌ పాల్గొనడంపై నిన్నటి నుంచి సందిగ్ధత ఏర్పడిన విషయం తెలిసిందే.ఇటీవలే ఫ్రెంచ్‌ ఓపెన్‌ మిక్స్‌డ్‌ డబుల్స్‌ టైటిల్‌ సాధించిన లియాండర్‌పేస్‌ రియోలో పాల్గొనేందుకు ఆసక్తి చూపుతున్నాడు. పేస్‌ రియోలో ఆడితే.. వరుసగా ఏడుసార్లు ఒలింపిక్స్‌లో పాల్గొన్న భారత ఆటగాడిగా రికార్డు సృష్టించనున్నాడు. అయితే రియోకు నేరుగా అర్హత సాధించిన బోపన్న.. తనకు జోడిగా పేస్‌ను కాదని సాకేత్‌ను ఎంచుకుంటూ సెలక్షన్‌ కమిటీకి శుక్రవారం లేఖ రాశాడు.అయితే 2012లో జరిగిన లండన్‌ ఒలింపిక్స్‌లోనూ పేస్‌ను కాదని మహేశ్‌ భూపతితో జోడి కట్టాడు. దీంతో ఆ ఒలింపిక్స్‌లో పేస్‌.. విష్ణువర్థన్‌ కలిసి పోటీల్లో పాల్గొన్నారు. ఎవరికీ పతకం లభించలేదు. ఈ నేపథ్యంలో ఈసారి సెలక్షన్‌ కమిటీ బోపన్న నిర్ణయాన్ని కాదని అతనికి జోడీగా లియాండర్‌ పేస్‌ను ఎంపిక చేయడం గమనార్హం. పేస్‌ ఒలింపిక్స్‌కు వెళ్తే పతకం ఖాయమని ఇప్పటికే పలువురు ఇతర క్రీడాకారులు అతనికి మద్దతు ప్రకటిస్తున్నారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com