పరీక్షల్లో పేపర్‌ లీకులు..రూ.కోటి జరిమానా

- June 22, 2024 , by Maagulf
పరీక్షల్లో పేపర్‌ లీకులు..రూ.కోటి జరిమానా

న్యూ ఢిల్లీ: నీట్‌, యూజీసీ నెట్‌ పేపర్‌ లీకులపై దేశవ్యాప్తంగా తీవ్ర నిరసనలు వెల్లువెత్తిన నేపథ్యంలో, పరీక్షల్లో అక్రమాల కట్టడికి ఉద్దేశించిన చట్టాన్ని కేంద్రప్రభుత్వం నోటిఫై చేసింది. ప్రభుత్వ పరీక్షల (అక్రమాల నిరోధక) చట్టం-2024కి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నాలుగు నెలల కిందటే ఆమోదముద్ర వేయగా, కేంద్రం తాజాగా చట్ట నిబంధనలను నోటిఫై చేసింది. ఈ నెల 21 నుంచే ఈ చట్టం అమల్లోకి రానున్నది. దీని ప్రకారం పోటీ పరీక్షల్లో అక్రమాలు పాల్పడితే గరిష్ఠంగా పదేండ్ల వరకు జైలు శిక్ష విధిస్తారు. అలాగే రూ.కోటి వరకు జరిమానా విధించే అవకాశం ఉన్నది. నెట్‌, యూజీసీ పేపర్‌ లీకుల నేపథ్యంలో ఈ చట్టాన్ని నోటిఫై చేయడం ప్రాధాన్యం సంతరించుకున్నది. ఈ చట్టాన్ని ఎప్పుడు అమలు చేస్తారని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ని ప్రశ్నించిన మరుసటి రోజే దీనిపై నోటిఫికేషన్‌ వెలువడటం గమనార్హం. న్యాయశాఖ నిబంధనలు రూపొందిస్తున్నట్టు కేంద్ర మంత్రి పేర్కొన్నారు. పబ్లిక్‌ ఎగ్జామినేషన్స్‌ (ప్రివెన్షన్‌ ఆఫ్‌ అన్‌ఫెయిర్‌ మీన్స్‌) బిల్లు-2024ను లోక్‌సభ ఫిబ్రవరి 6న ఆమోదించగా, 9న రాజ్యసభ ఆమోదించింది. అదే నెల 12న రాష్ట్రపతి ఆమోదముద్ర వేశారు. యూపీఎస్సీ, స్టాఫ్‌ సెలెక్షన్‌ కమిషన్‌, రైల్వేస్‌, బ్యాంకింగ్‌ రిక్రూట్‌మెంట్‌ ఎగ్జామ్స్‌, ఎన్టీఏ నిర్వహించే పరీక్షల్లో అక్రమాలను నిరోధించేందుకు ఈ చట్టాన్ని తీసుకొచ్చారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com