ఒలింపిక్ విలేజ్‌లో అడుగు పెట్టిన భారత్!

- July 21, 2024 , by Maagulf
ఒలింపిక్ విలేజ్‌లో అడుగు పెట్టిన భారత్!

పారిస్: పారిస్ ఒలింపిక్స్ 2024కు సమయం ఆసన్నమైంది. మరో 5 రోజుల్లో ఈ క్రీడల మహాసంగ్రామానికి తెరలేవనుంది. జూలై 26న ఈ మెగా ఈవెంట్ జరగనుండగా.. నిర్వాహకులు క్రీడా గ్రామాన్ని తెరిచి ఆయా దేశాల అథ్లెట్లకు స్వాగతం పలుకుతున్నారు. భారత్ కూడా ఒలింపిక్స్ విలేజ్‌లో అడుగుపెట్టింది.

దేశం నుంచి మొదటగా ఆర్చరీ, రోయింగ్ బృందాలు క్రీడా గ్రామాన్ని చేరుకున్నాయని ఈ ఒలింపిక్స్‌కు భారత చెఫ్ డి మిషన్‌గా వ్యవహరిస్తున్న దిగ్గజ షూటర్ గగన్ నారంగ్ తెలిపాడు. 'నేను గురువారం రాత్రి పారిస్ చేరుకున్నాను. భారత్ నుంచి ముందుగా ఆర్చరీ, రోయింగ్ బృందాలు శుక్రవారం ఒలింపిక్ విలేజ్‌లో అడుగుపెట్టాయి. ఇక్కడి వాతావరణానికి అథ్లెట్లు నెమ్మదిగా అలవాటుపడుతున్నారు.

పురుషుల హాకీ జట్టు కూడా క్రీడా గ్రామానికి రానుంది. భారత అథ్లెట్లు అంతా మంచి ఉత్సాహంతో ఉన్నారు. వచ్చి రాగానే పోటీల వేదికలో ప్రాక్టీస్ చేయాలనుకుంటున్నారు. భారత అథ్లెట్లకు కావాల్సిన అన్ని సౌకర్యాలు కల్పిస్తాం. ఒలింపిక్స్ కోసం చెఫ్ డి మిషన్‌గా పారిస్‌కు రావడం నాకు దక్కిన గౌరవంగా భావిస్తాను.

భారత అథ్లెట్ల బృందంలో స్ఫూర్తి నింపేందుకు ప్రయత్నిస్తా. మెడల్స్ సాధించే భారత అథ్లెట్ల సంఖ్య పెరగడం సంతోషంగా ఉంది.'అని గగన్ నారంగ్ చెప్పుకొచ్చాడు. ఈ ఒలింపిక్స్‌లో భారత్ నుంచి మొత్తం 117 మంది అథ్లెట్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. 20 ఈవెంట్స్‌లో పోటీపడనున్నారు.ఈ సారి భారత్ పతకాల సంఖ్యలో డబుల్ డిజిట్ సాధిస్తుందనే ఆశతో అభిమానులు ఉన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com