జకోవిచ్ చిరకాల స్వప్నం నెరవేరింది..
- August 05, 2024
పారిస్: సెర్బియన్ టెన్నిస్ క్రీడాకారుడు నోవాక్ జకోవిచ్ చిరకాల స్వప్నం నెరవేరింది. ఒలింపిక్స్ లో టెన్నిస్ సింగిల్స్ లో పసిడి పతకం సాధించాలన్న సుదీర్ఘ కాల కోరిక నెరవేరింది. పారిస్ ఒలింపిక్స్ 2024లో పురుషుల తుది పోరులో జకోవిచ్ స్పెయిన్ కు చెందిన అల్కరాస్ ను ఓడించాడు. హోరాహోరీగా సాగిన మ్యాచ్ లో చివరికి జకోవిచ్ రెండు సెట్లను టై బ్రేక్ లోనే గెలుచుకున్నాడు. దీంతో 16 ఏళ్ల సుధీర్ఘ కెరియర్ తర్వాత అతడు ఒలింపిక్స్ చరిత్రలో తొలిసారి స్వర్ణ పతకాన్ని గెలిచాడు. అల్కారాస్ పై విజయం తరువాత జకోవిచ్ భావోద్వేగాన్ని నియంత్రించుకోలేక కన్నీటి పర్యంతమయ్యాడు.
సుదీర్ఘ కెరీర్ లో ఒలింపిక్స్ లో తొలిసారి స్వర్ణాన్ని గెలుచుకున్న జకోవిచ్ .. మ్యాచ్ అనంతరం మైదానంలోనే ఉన్న అతని భార్య జెలీనా, కుమార్తె తారా వద్దకు వెళ్లాడు. కుమార్తె తారాను హత్తుకొని తీవ్ర భావోద్వేగానికి గురయ్యాడు. తన భార్య, కుమార్తెను కౌగిలించుకుని ఆనందంతో కన్నీళ్లు పెట్టుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ మ్యాచ్ జరుగుతున్న సమయంలో అతని కుమార్తె ‘ మా నాన్న ఉత్తముడు’ అంటూ బ్యానర్తో కనిపించిన చిత్రం కూడా వైరల్ అయింది.
జకోవిచ్ 2008 బీజింగ్ ఒలింపిక్స్ లో కాంస్యం గెలుచుకున్నాడు. 2012 లండన్ క్రీడల్లో నాలుగో స్థానాన్ని దక్కించుకున్నాడు. 2016 రియోలో జరిగిన ఒలంపిక్స్ లో తొలి రౌండ్లోనే ఇంటిముఖం పట్టాడు. 2020లో టోక్యా ఒలింపిక్స్ లోనూ నాల్గో స్థానంతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. కెరీర్ చరమాంకానికి వచ్చేసిన జకోవిచ్ ఆఖరి ప్రయత్నంలో తన సుదీర్ఘ టెన్నిస్ కెరీర్ లో కలగా మిగిలిన ఉన్న ఒలింపిక్స్ లో స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకున్నాడు. స్వర్ణం సాధించడంతో కెరీర్ గోల్డెన్ స్లామ్ ఆటగాళ్ల జాబితాలో జకోవిచ్ చేరాడు. నాలుగు గ్రాండ్ స్లామ్ టైటిళ్లతో పాటు ఒలింపిక్స్ లో స్వర్ణ పతకం గెలిచిన ఆటగాళ్లను కెరీర్ గోల్డెన్ స్లామ్ ప్లేయర్లుగా పేర్కొంటారు.
తాజా వార్తలు
- ఈద్ అల్-అధా శుభాకాంక్షలు తెలిపిన భారత రాయబారి పరామిత త్రిపాఠి..!!
- సుల్తాన్ ఖబూస్ మస్జీదులో ఈద్ ప్రార్థనలు చేసిన సుల్తాన్..!!
- మినాలో భద్రతను సమీక్షించిన ఇంటీరియర్ మినిస్టర్..!!
- లుసైల్ ప్యాలెస్లో ఈద్ అల్-అధా వేడుకల్లో పాల్గొన్న అమీర్..!!
- మనామా సూక్లో ఈద్ సందడి..జోరుగా సాగిన కొనుగోళ్లు..!!
- ఈద్ అల్ అదా వేడుకలకు కొత్త వెలుగులు నింపిన నవజాత శిశువులు..!!
- తెలంగాణలో 3 రోజులు రెడ్ అలర్ట్
- సరికొత్త డిజిటల్ హంగులతో ‘మహానాడు 2026’ జెండా ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు!
- శ్రీలంక వెళ్లే భారతీయులకు గుడ్ న్యూస్
- డ్రైవింగ్ చేస్తూ ఈద్ శుభాకాంక్షలు పంపొద్దు: అబుదాబి పోలీసుల హెచ్చరిక









