బ్రిటన్‌లోని భారతీయులకు ఊరట

- August 06, 2024 , by Maagulf
బ్రిటన్‌లోని భారతీయులకు ఊరట

లండన్: బ్రిటన్‌లోని భారతీయులకు ఊరట కలిగించే విషయం. బ్రిటిష్‌ పౌరులు, శాశ్వత నివాసితులు (భారత వారసత్వం ఉన్నవారితో సహా) తమ బంధువులను కుటుంబ వీసాపై తీసుకువచ్చేందుకు ఉన్న నిబంధనలపై కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం వెనక్కి తగ్గింది.

ఇందుకు సంబంధించి వార్షిక ఆదాయ పరిమితిని పెంచుతూ రిషి సునాక్‌ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని పక్కనపెట్టింది. దీంతో వార్షికాదాయం 38వేల పౌండ్లు (41.5లక్షలు) ఉండనవసరం లేదు. లేబర్ పార్టీ నిర్ణయం అక్కడ నివసిస్తోన్న అనేక మంది భారతీయులకు ఉపశమనం కలిగించనుంది.

కుటుంబ ఆదాయ పరిమితిని 29వేల పౌండ్ల నుంచి 38,700 పౌండ్లకు పెంచాలని తీసుకున్న నిర్ణయాన్ని తాత్కాలికంగా పక్కన పెడుతున్నట్లు బ్రిటన్ హోంశాఖ మంత్రి యెవెట్ కూపర్‌ ఇటీవల పేర్కొన్నారు. 2025 నుంచి అమల్లోకి తీసుకురానున్న ఈ విధానాన్ని వలసవాద సలహా కమిటీతో సమీక్షించాలని నిర్ణయించామన్నారు. అంతవరకు ప్రస్తుతమున్న కుటుంబ ఆదాయ పరిమితి 29వేల పౌండ్లుగానే ఉండనుందని చెప్పారు. వలసలకు సంబంధించి తమ ప్రభుత్వం కొత్త విధానాన్ని అనుసరిస్తుందని పేర్కొన్న కూపర్‌.. విదేశీయులను నియమించుకునే ముందు, స్థానిక శ్రామిక శక్తికి నైపుణ్యాలను మెరుగుపరచడంపై దృష్టి సారిస్తామన్నారు.

ఎవరైనా కుటుంబ వీసాకు స్పాన్సర్‌ చేయాలంటే.. వారి కనీస వార్షిక ఆదాయం 29,000 జీబీపీ (గ్రేట్‌ బ్రిటన్‌ పౌండ్‌)లుగా ఉండాలి. గతంలో ఈ పరిమితి 18,600 జీబీపీలుగా ఉండగా.. దాన్ని ఇటీవలే 55 శాతం మేర పెంచారు. 2025 నుంచి దీన్ని 38,700 పౌండ్లకు పెంచాలని రిషి సునాక్‌ ప్రభుత్వం నిర్ణయించింది. వలసలను అడ్డుకునేందుకు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల్లో ఇదీ ఒకటి. అయితే, బ్రిటన్‌ ఇచ్చే కుటుంబ వీసా కేటగిరీల్లో భారతీయులు కూడా భారీ సంఖ్యలో లబ్ధిపొందుతుంటారు. 2023లో 5248 మంది వీసా పొందారు. తాజాగా కీర్‌ స్టార్మర్‌ తీసుకున్న నిర్ణయంతో అనేక మంది భారతీయులతో సహా విదేశీయులకు ఉపశమనం లభించనుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com