రక్షా బంధన్...!
- August 19, 2024
సోదరసోదరీమణుల అనురాగం, అప్యాయతలకు ప్రతీక రక్షా బంధన్.. తమ మధ్య బలమైన బంధాన్ని గుర్తు చేసుకునే ప్రియమైన భారతీయ పండుగ. ఈ పండుగను దేశవ్యాప్తంగా కుల మాతాలకు అతీతంగా జరుపుకుంటారు. పవిత్రమైన రాఖీ కట్టడంతో జరుపుకునే ఈ పండుగ సోదర, సోదరీమణుల మధ్య ప్రేమ, రక్షణ, ప్రత్యేక సంబంధాన్ని సూచిస్తుంది. ఆ క్రమంలో సోదరీమణులు సోదరుడికి మంచి ఆరోగ్యం, శ్రేయస్సు, దీర్ఘాయువు ఉండాలని కోరుకుంటారు. అయితే, ఈ ఏడాది రాఖీ పౌర్ణిమను సోమవారం ఆగస్టు 19న జరుపుకుంటున్నాం.
శ్రావణ పౌర్ణమి రోజు.. దాదాపుగా ప్రతీ సోదరి.. తన సోదరుడు లేదా సోదర సమానుడి చేతి మణికట్టుకు ఈ రాఖీ కడుతుంది. సోదరుడు తనకు ఎల్లకాలం రక్షణగా నిలవడమే కాకుండా.. తనపై ప్రేమాభిమానులు కురిపించాలని ప్రతీ సోదరి భావిస్తుంది. అందుకు ప్రతీకగా సోదరుడి చేతికి రాఖీ కడుతుంది. ఈ ప్రత్యేకమైన రోజున బహుమతులు ఇవ్వడం ఒక ముఖ్యమైన సంప్రదాయంగా కొనసాగుతుంది. ఇది ఇద్దరి మధ్య సంబంధాన్ని మరింత బలపరుస్తుంది. ప్రతి బహుమతి వారి జీవితంలో శ్రేయస్సు, ఆనందాన్ని తీసుకురావడంలో తోడ్పడుతుంది.
హిందూ సంప్రదాయం ప్రకారం రాఖీ కట్టడానికి అత్యంత అనుకూలమైన సమయం అపరాహ్న కాలం, అంటే మధ్యాహ్నం. మతపరమైన వేడుకలతోపాటు ఆచారాలను నిర్వహించేందుకు ఈ అపరహ్నాన్ని అనుకూలమైన సమయంగా పరిగణిస్తారు. అయితే అపరాహ్నము వేళ కుదరకుంటే.. సాయంత్రం ప్రదోష సమయం కూడా అనుకూలమైనదిగా పరిగణించ వచ్చని జ్యోతిష్య పండితులు పేర్కొంటున్నారు.
శాస్త్రాల ప్రకారం.. భద్రకాలంలో సోదరీమణులు తమ సోదరుల చేతికి రాఖీ కట్టకూడదు. ఆ సమయంలో రాఖీ కడితే అశుభం జరుగుతుందని చెబుతారు. భద్రకాలం ముగిసిన తరువాత సోదరులకు రాఖీలు కడితే మంచిదని పండితులు చెబుతున్నారు. సోమవారం భద్రకాల సమయం సూర్యోదయాన 5.33గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం 1.33 గంటల వరకు ఉంటుంది. భద్రకాలం ముగిసిన తరువాత రాఖీ పండుగను జరుపుకోవచ్చు. మధ్యాహ్నం 1.34 గంటల నుంచి రాత్రి 9.08 గంటల వరకు శుభ సమయం ఉంటుందట. ఆ సమయంలో సోదరులకు రాఖీ కడితే విశేషమైన ఫలితాలు కలుగుతాయని, సంవత్సరం అంతా విష్ణుమూర్తి అనుగ్రహం లభిస్తుందని పండితులు చెబుతున్నారు.
ఇక్కడ మరోవాదనను కూడా పలువురు పండితులు వినిపిస్తున్నారు. సోమవారం మధ్యాహ్నం 1.33 గంటల వరకు భద్రకాలం ఉంటుంది. కానీ, చంద్రుడు మకరరాశిలో ఉండటం వల్ల భద్రకాల నివాసం పాతాళంలో ఉంటుంది. కావున భూమ్మీద ఏ శుభకార్యముపైనా భద్రకాల ప్రభావం ఉండదని చెబుతున్నారు. అందుచేత రక్షాబంధన్ పండుగను సోమవారం రోజంతా జరుపుకోవచ్చని కొందరు పండితులు చెబుతున్నారు. రాహుకాలంలో మాత్రమే రాఖీ కట్టవద్దని సూచిస్తున్నారు.
--డి.వి.అరవింద్(మాగల్ఫ్ ప్రతినిధి)
తాజా వార్తలు
- వెనిజులాలో భూకంపాల విధ్వంసం..మృతుల సంఖ్య 1,430కు చేరిక
- కరీంనగర్లో తొలి స్పేస్ ల్యాబ్ ప్రారంభించిన పారమిత హెరిటేజ్ పాఠశాల
- వాహనాల నిర్వహణను నిర్లక్ష్యం చేయొద్దు..దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- కార్మికుల భద్రతకు దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం
- సౌదీ అరేబియాకు వెళ్లే ప్రయాణికులకు బంగారం పై కొత్త నిబంధనలు
- కువైట్లో అతిపెద్ద వలస కార్మిక వర్గంగా భారతీయులు..!!
- హోర్ముజ్ లో నౌకాయాన స్వేచ్ఛపై సౌదీతో ఒమన్ చర్చలు..!!
- మరో 8మంది భారతీయుల మృతదేహాలు స్వదేశానికి తరలింపు..!!
- యూఏఈ మీడియేషన్ విజయాన్ని స్వాగతించిన బహ్రెయిన్..!!
- వెనిజులాకు యూఏఈ 10 మిలియన్ డాలర్ల తక్షణ సహాయం..!!







