కోల్‌కతా: ఆసుపత్రి మాజీ హెడ్‌పై సీబీఐ ప్రశ్నల వర్షం

- August 19, 2024 , by Maagulf
కోల్‌కతా: ఆసుపత్రి మాజీ హెడ్‌పై సీబీఐ ప్రశ్నల వర్షం

కోల్‌కతా: బెంగాల్ హత్యాచార ఘటన పై సీబీఐ ముమ్మర దర్యాప్తు చేస్తోంది. ఆ ఘటన జరిగిన సమయంలో వైద్యకళాశాలకు ప్రిన్సిపల్‌గా ఉన్న సందీప్‌ ఘోష్‌ను కొద్దిరోజులుగా దర్యాప్తు సంస్థ (CBI) విచారిస్తోంది.

ఆయనపై ప్రశ్నల వర్షం కురిపించింది. వాటిలో కొన్ని ప్రశ్నలు మీడియాలో దర్శనమిచ్చాయి.

ఆసుపత్రిలో చోటుచేసుకున్న మరణాన్ని తొలుత ఆత్మహత్యగా ప్రకటించాల్సినంత తొందరేమొచ్చింది..? ఎవరి సలహా మేరకు కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు..? అందులో వాస్తవాలను ఎందుకు ప్రస్తావించలేదు..?
మీరొక డాక్టర్‌. నేరం జరిగిన ప్రాంతాన్ని భద్రంగా ఉంచడం ముఖ్యమని మీకు అనిపించలేదా..?క్రైమ్‌సీన్‌లో సాక్ష్యాలను తారుమారు చేయడం నేరమని మీకు తెలుసు. మరి విచారణ పూర్తయ్యేవరకు ఎందుకు భద్రంగా ఉంచలేదు..?
మృతురాలి కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వడంలో గంటలపాటు ఆలస్యం ఎందుకు జరిగింది..? వారికి మృతదేహాన్ని చూపించడంలో ఎందుకు ఆలస్యం చేశారు..? ఆసుపత్రిలో ఎలాంటి భద్రతాఏర్పాట్లు ఉన్నాయి..?
ఘటన జరగ్గానే మీరు ఎందుకు రాజీనామా చేయలేదు..?అందుకుగల కారణం ఏంటి..? ఘటన గురించి తెలియగానే ఎలాంటి చర్యలు చేపట్టారు..? మృతదేహం దొరికిన సెమినార్ హాల్ పక్కన ఉన్న గదులకు అప్పటికప్పుడు మరమ్మతులు చేయాల్సిన అవసరం ఏమొచ్చింది..?గత మూడురోజులుగా అర్ధరాత్రి వరకు అడిగిన ప్రశ్నలివి. వాటికి ఆయన సరైన సమాధానాలు చెప్పలేదని తెలుస్తోంది. అలాగే సీబీఐ ఆయన కాల్ రికార్డులను పరిశీలిస్తోంది. ఘటనకు ముందు తర్వాత ఎవరెవరితో మాట్లాడారో ఆరాతీస్తోంది. ఈ రోజు కూడా ఆయన్ను విచారణకు పిలిచింది.
కోల్‌కతాలోని ఆర్‌జీ కార్‌ వైద్య కళాశాల ఆసుపత్రిలో జూనియర్‌ వైద్యురాలిపై హత్యాచార (Kolkata Doctor Rape Murder) ఘటన పెను సంచలనం రేపుతోంది. అది జరిగిన రెండు రోజుల తర్వాత కాలేజీ ప్రిన్సిపల్‌గా ఉన్న డాక్టర్ సందీప్‌ ఘోష్‌ రాజీనామా చేశారు. ''నన్ను పదవి నుంచి దింపేలా విద్యార్థులను కొంతమంది రెచ్చగొట్టారు. నిందితుడికి శిక్ష పడాలనే కోరుకున్నా. బాధితురాలికి వ్యతిరేకంగా ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. కావాలనే నా పరువు తీస్తున్నారు. సామాజిక మాధ్యమాల్లో నాపై జరుగుతున్న ఈ అవమానాన్ని భరించలేకపోతున్నా. మృతి చెందిన అమ్మాయి నా కుమార్తెలాంటిదే. నేను కూడా ఓ తండ్రినే. అందుకే రాజీనామా చేస్తున్నా. భవిష్యత్తులో ఎవరికీ ఇలాంటి దారుణ ఘటన జరగకూడదు'' అంటూ రాజీనామా సమర్పించారు.

ఆ తర్వాత కొద్ది గంటల వ్యవధిలోనే కలకత్తా మెడికల్ కాలేజ్‌ అండ్ హాస్పిటల్‌కు ప్రిన్సిపల్‌గా నియమితులయ్యారు. ఈ నియామకం వివాదాస్పదం కావడంతో కలకత్తా హైకోర్టు స్పందించింది. సందీప్‌ ఘోష్‌ సుదీర్ఘ సెలవులో ఉండాలని ఆదేశించింది. ''ఆసుపత్రిలో పనిచేస్తోన్న వైద్యులకు ప్రిన్సిపలే గార్డియన్. ఆయనే ఎలాంటి జాలి చూపించకపోతే ఇంకెవరు చూపిస్తారు. ఆయన ఎక్కడా పనిచేయకుండా ఇంట్లోనే ఉండాలి'' అని పేర్కొంది. ఆయన రాజీనామా చేసిన వెంటనే మరొక పదవి ఎలా ఇస్తారని ప్రభుత్వాన్ని ప్రశ్నించిన సంగతి తెలిసిందే.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com