ఏపీలో మెట్రో నిర్మాణాలు..సీఎం కీలక ఆదేశాలు

- August 30, 2024 , by Maagulf
ఏపీలో మెట్రో నిర్మాణాలు..సీఎం కీలక ఆదేశాలు

అమరావతి: రాష్ట్రంలో మెట్రో రైళ్ల ఏర్పాటుపై ప్రభుత్వం వేగం పెంచింది. అమరావతి, విజయవాడలో మెట్రో పనులు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది.

విజయవాడ బస్టాండ్ నుంచి గన్నవరం ఎయిర్ పోర్టు వరకు మొదటి దశలో మెట్రో పనులు చేపట్టేందుకు ప్రస్తుతం ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. రెండో దశలో అమరావతిలో మెట్రో పనులు చేపట్టాలని భావిస్తోంది.

అయితే అమరావతిలో రూ. 160 కోట్లతో సీఆర్డీఏ ప్రధాన కార్యాలయం ఏర్పాటు చేయాలని అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు. 3 ఎకరాల 62 సెంట్లలో బిల్డింగ్ నిర్మించాలని సూచించారు. అంతేకాదు మున్సిపాలిటీలకు సంబంధించిన అన్ని విభాగాలు ఈ బిల్డింగ్‌లో ఉండే విధంగా ప్లాన్ చేయాలన్నారు. అలాగే హ్యాపీనెస్ట్ అపార్టుమెంట్లను సైతం అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించారు. త్వరలోనే నిర్మాణాలు చేపట్టేందుకు అధికారులు సిద్ధంగా ఉండాలని సూచించారు.

కాగా 2014-19లో హ్యాపీనెస్ట్ అపార్టుమెంట్లు నిర్మించాలని అప్పటి చంద్రబాబు ప్రభుత్వం ప్లాన్ చేసింది. కొన్ని అపార్టుమెంట్లను నిర్మించింది. కానీ 2019లో జగన్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఆ ప్రాజెక్టు అలాగే నిలిచిపోయింది. దీంతో రూ. 200 కోట్ల నష్టం వాటిల్లిందని ప్రస్తుత కూటమి ప్రభుత్వం గుర్తించింది. ఈ హ్యాపీనెస్ట్ అపార్ట్‌మెంట్లను పూర్తి చేసి.. అప్పుడు బుక్ చేసుకున్న ధరలకే ఫ్లాట్స్ ఇవ్వాలని తాజాగా నిర్వహించిన సమీక్షలో చంద్రబాబు నిర్ణయించారు. అలాగే అమరావతి ప్రాంతంలో గతంలో ఎవరైతే భూములు ఇవ్వలేదో ఇప్పుడు పూలింగ్ నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. మొదట ఎవరైతే భూములు ఇచ్చారో వారికే తొలి ప్రాధాన్యం ఇవ్వాలని, సెప్టెంబర్ 15లోపు రాజధాని రైతుల బకాయిలు చెల్లించాలని అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com