అయోధ్యలో ఘనంగా దీపోత్సవం..

- November 03, 2024 , by Maagulf
అయోధ్యలో ఘనంగా దీపోత్సవం..

అయోధ్య: 2024 ఏడాది దీపావళి సందర్భంగా అయోధ్యలో అద్భుతం ఆవిష్కృతమైంది. అయోధ్యలోని రామమందిరంలో రామ్ లల్లాను ప్రతిష్టించిన తర్వాత మొదటి దీపావళిని ఘనంగా జరుపుకుంది.అయోధ్యలో భక్తులంతా కలిసి ఒకే సమయంలో 25 లక్షలకు పైగా దీపాలను వెలిగించారు.దాంతో అయోధ్య దీపోత్సవం మరోసారి గిన్నీస్ వరల్డ్ రికార్డును నెలకొల్పింది.చాలా మంది భక్తులు ఏకకాలంలో ఆరతి, నూనె దీపాలను వెలిగించడంతో అయోధ్య దీపాల కాంతుల్లో అద్భుతంగా మెరిసింది.

రామ మందిరం ఏర్పాటు తర్వాత తొలిసారి దీపోత్సవం వేడుకుల కోసం ఆలయ అధికారులు భారీ ఏర్పాట్లు చేశారు. సరయూ నది ఒడ్డున రామ్‌కిపైడితో సహా 55 ఘాట్‌లలో 25 లక్షల (2,512,585) మట్టి దీపాలు (దియాలు) వెలిగించడంతో పాటు 1,121 మంది ‘వేదాచార్యులు’ ఏకకాలంలో ‘ఆరతి’ చేస్తూ ఈ రెండు గిన్నీస్ వరల్డ్ రికార్డులు సృష్టించారు. మొత్తం 55 ఘాట్‌లలోని వెలిగించిన ప్రమిదలను ప్రత్యేక డ్రోన్లతో గిన్నిస్‌ ప్రతినిధులు లెక్కించారు. అయోధ్య దీపోత్సవం గ్రాండ్ ఈవెంట్ ఏరియల్ వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో వైరల్ అవుతుంది.

అయోధ్య దీపోత్సవం.. ఏడోసారి రికార్డులు బ్రేక్:
జీడబ్ల్యూఆర్ ప్రకారం.. అయోధ్య అతిపెద్ద నూనె దీపాలను ప్రదర్శించిన రికార్డును బద్దలు కొట్టడం ఇది ఏడవసారి. నవంబర్ 2021లో మొదటి రికార్డును నెలకొల్పింది. ఈ కార్యక్రమంలో 30వేల కన్నా ఎక్కువ మంది వాలంటీర్లు-ప్రధానంగా కాలేజీ విద్యార్థులు-నూనె దీపాలను ఏర్పాటు చేశారు. హాజరైనవారంతా దీపాలను వరుసలలో వెలిగించి అద్భుతమైన ప్రదర్శనతో ఆకట్టుకుంది. రెండో గిన్నీస్ వరల్డ్ రికార్డ్ టైటిల్ కోసం ‘ఎక్కువ మంది భక్తులు ఏకకాలంలో మట్టి దీపాలను ప్రదర్శించారు. ఇందుకోసం 1,211 మంది భక్తులు పాల్గొన్నారు. పాల్గొనే వారందరూ మునుపటి రాత్రి దీపాలను వెలిగించే విధానంపై రిహార్సల్ చేశారు. జీడబ్ల్యూఆర్ ధృవీకరించిన అనంతరం ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌కు సర్టిఫికేట్ అందించారు.

అయోధ్య దీపోత్సవం అద్భుతం.. : ప్రధాని మోదీ
ఇదిలావుండగా, ఈ అయోధ్య దీపోత్సవ దృశ్యాన్ని “అద్భుతం.. సాటిలేనిది ఊహించలేనిది” అని ప్రధాని నరేంద్ర మోదీ అభివర్ణించారు. “అయోధ్యలోని దివ్యమైన దీపోత్సవం సందర్భంగా అక్కడి ప్రజలకు అభినందనలు. లక్షలాది మంది వెలిగించిన దీపాలతో ప్రకాశించే రామ్ లల్లా పవిత్ర జన్మస్థలంలో ఈ జ్యోతిపర్వ ఉద్వేగభరితంగా ఉంటుంది. అయోధ్య ధామ్ నుంచి వెలువడే ఈ కాంతి పుంజం కొత్త ఉత్సాహం, కొత్త శక్తితో దేశవ్యాప్తంగా ప్రతిఒక్కరి కుటుంబ సభ్యుల జీవితంలో వెలుగులను నింపుతుంది. ” అని మోదీ పేర్కొన్నారు.

అయోధ్య దీపోత్సవం సందర్భంగా సీఎం యోగి ఆదిత్యనాథ్‌ ప్రత్యేక పూజలతో పాటు హారతి కార్యక్రమంలో పాల్గొన్నారు. నేపాల్‌, మయన్మార్‌, మలేసియా, థాయిలాండ్‌, ఇండోనేసియా, కంబోడియాకు చెందిన కళాకారులతో అద్భుత ప్రదర్శన నిర్వహించారు. . అంతేకాకుండా వివిధ రాష్ట్రాలకు చెందిన పలువురు కళాకారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఘాట్‌ల సమీపంలో దాదాపు 6 వేల మంది అతిథుల కోసం భారీ ఏర్పాట్లు చేశారు. దీపోత్సం అందరికి కనిపించేలా లైవ్‌ కవరేజీతో భారీ తెరలను ఏర్పాటు చేశారు. అయోధ్య నగరమంతా దాదాపు 10వేల మంది భద్రతా సిబ్బంది మోహరించి భద్రతను పర్యవేక్షించారు. ఈ దీపోత్సవ వేడుకల సందర్భంగా ప్రదర్శించిన డ్రోన్‌ షో, లేజర్‌ షో, సాంస్కృతిక ప్రదర్శనలు, రామాయణ ఘట్టాలు ఆద్యంతం భక్తులను ఆకట్టుకున్నాయి. లేజర్‌ షోతో రామాయణ ఘట్టాలు భక్తులను అబ్బురపరిచాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com