దారుణంగా మోసపోయామని ఓ ఎన్నారై ..

- June 24, 2016 , by Maagulf
దారుణంగా మోసపోయామని ఓ ఎన్నారై ..

తెలంగాణ రాష్ట్రం పెట్టుబడులకు అనుకూలమని ఓ వ్యక్తిని నమ్మి సాప్ట్వేర్ కంపెనీ పెడితే అతడి చేతిలో దారుణంగా మోసపోయామని ఓ ఎన్నారై ఆవేదన వ్యక్తం చేశారు. నమ్మి కంపెనీ వ్వవహారాలు అప్పగిస్తే రూ. 42 కోట్లు ఎగనామం పెట్టాడని వాపోయాడు.
సికింద్రాబాద్లోని జప్తా హోటల్లో గురువారం పసుమర్తి వేణుమాధవ్ అనే ఎన్నారై తన తల్లితో కలిసి విలేకరులతో మాట్లాడారు. తమను మోసం చేసిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలంటూ ఎక్కడికి వెళ్లినా న్యాయం జరగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
''అతడి వెనుక హోం మంత్రి హస్తం ఉంది. పోలీసులు అతడికే మద్దతు పలుకుతున్నారు. నాకు న్యా యం జరిగేదెలా?'' అని ప్రశ్నించారు. మెటీరియల్ సాఫ్ట్వేర్ సిస్టమ్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీని 2008లో స్థాపించిన తాను కంపెనీ వ్య వహారాలను మేనేజర్ శాంతన్కుమార్కు అప్పగించి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ ఇచ్చానని తెలిపారు.
దాన్ని ఆసరాగా చేసుకుని అతడు రూ. 42 కోట్లు కాజేశాడని ఆరోపించారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసినా, అతడిపై చర్యలకు వెనకాడుతున్నారని, దీని వెనక హోంమంత్రి నాయిని నరసింహారెడ్డి హస్తం ఉందన్నారు. బ్యాంకులో ఫోర్జరీ సంతకాలు చేసి కోట్లు కొల్లగొట్టారని, సంతకాలు ఫోర్జరీ చేశారని ఎఫ్ఎస్ఎల్ నిర్ధారించినా పోలీసులు అతడిని అరెస్టు చేయడం లేదన్నారు.
ఇదంతా చూస్తే కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో ఎన్నారైలకు రక్షణ లేదన్న భావన కలుగుతోందని అన్నారు. తమకు న్యాయం చేయాలని, ఈ విషయంపై ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా దృష్టి సారించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com