భారతదేశ నౌకాదళ దినోత్సవం

- December 04, 2024 , by Maagulf
భారతదేశ నౌకాదళ దినోత్సవం

భారతదేశ రక్షణ విభాగంలోని త్రివిధ దళాల్లో నావికాదళానికి ఎంతో ప్రాధాన్యం ఉంది. ఇండియన్ నేవీ సాధించిన విజయాలకు గుర్తుగా ప్రతి సంవత్సరం డిసెంబర్ 4వ తేదీన దేశవ్యాప్తంగా భారతదేశ నౌకాదళ దినోత్సవాన్ని నిర్వహిస్తారు. మరి ఈ రోజే భారత నౌకాదళ దినోత్సవాన్ని నిర్వహించడానికి ఉన్న కారణాలేంటో ఈరోజు తెలుసుకుందాం...

1971లో జరిగిన ఇండో-పాకిస్థాన్ యుద్ధంలో కరాచీ నౌకాశ్రయంపై దాడి చేసేందుకు ఇండియన్ నేవీ ఆపరేషన్ ట్రైడెంట్‌ను చేపట్టింది.దాదాపు ఐదు దశాబ్దాల క్రితం ఇదే రోజున ఇండో-పాక్ యుద్ధంలో ఆపరేషన్ ట్రైడెంట్‌లో భాగంగా PNS ఖైబర్‌ సహా నాలుగు పాకిస్థాన్ నౌకలపై ఇండియన్ నేవీ దాడులు చేసింది. ఈ ఆపరేషన్‌లో వందలాదిమంది పాకిస్థాన్ నేవీ సిబ్బందిని మనవాళ్లు మట్టికరిపించారు. పాక్ ఇంధన నిల్వ క్షేత్రాలు ధ్వంసం కావడంతో పాటు, 500 మందికిపైగా పాక్ నేవీ సిబ్బంది చనిపోయారు. ఈ దాడిలో భారత నేవీకి చెందిన ఐఎన్ఎస్ నిపత్, ఐఎన్ఎస్ నిర్ఘాట్, ఐఎన్ఎస్ వీర్ యుద్ధనౌకలు కీలక పాత్ర పోషించాయి.

ప్రభుత్వ ఆదేశాలతో.. 1971 డిసెంబర్ 4వ తేదీన గుజరాత్‌లోని ఒఖా పోర్టు (Okha Port) నుంచి పాక్ సాగర జలాల దిశగా బయల్దేరిన ఈ నౌకలు.. కరాచీ పోర్ట్‌పై దాడికి దిగాయి. కరాచీ హార్బర్ దిశగా వస్తోన్న భారత నౌకలను గమనించిన పాక్ నేవీ తమ నౌకలను కూడా రంగంలోకి దింపింది. దీంతో మిస్సైల్‌తో దాడికి దిగిన ఐఎన్ఎస్ వీర్..పాక్ యుద్ధనౌక ముహఫిజ్‌ను సముద్రంలో ముంచివేసింది.ఈ ఆపరేషన్లో పాల్గొన్న చాలామంది ఇండియన్ నేవీ సిబ్బందికి శౌర్య పురస్కారం లభించింది. ఆ దాడిలో పాల్గొన్న వీరుల పరాక్రమానికి గుర్తుగా ప్రతి ఏటా డిసెంబరు 4న భారత నౌకాదళ దినోత్సవాన్ని జరుపుకుంటారు.ఈ  సందర్భంగా ప్రతి సంవత్సరం ముంబైలోని గేట్‌వే ఆఫ్ ఇండియా వద్ద బీటింగ్ రిట్రీట్ సెర్మనీని ఇండియన్ నేవీ నిర్వహిస్తుంది.అలాగే, ఇండియన్‌ నేవీ బలం, బలగం, సముద్రంలో శత్రువులను మట్టి కరిపించే సత్తాను..ఈ రిహార్సల్స్‌ చేసి చూపిస్తారు.

  --డి.వి.అరవింద్(మాగల్ఫ్ ప్రతినిధి)    

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com