సౌదీ లో భారతీయుల పాట్లు

- June 27, 2016 , by Maagulf
సౌదీ లో భారతీయుల పాట్లు

సౌదీలో ఓ కంపెనీ చేసిన మోసంతో దాదాపు 4500 మంది భారతీయులు చిక్కుకుపోయారు. వీరిలో 200 మంది హైదరబాదీయులు కూడా ఉన్నారు. సౌదీ బిన్‌లాడిన్ గ్రూప్(ఎస్‌బీజీ) అనే నిర్మాణ కంపెనీలో పనిచేస్తున్న వీరికి ఆరు నెలలుగా కంపెనీ వేతనాలు చెల్లించడం లేదు. చేతిలో చిల్లిగవ్వ లేకపోవడంతో వారిలో కొందరు యాచనకు దిగుతున్నారు. కంపెనీ వద్ద కాంట్రాక్ట్ కార్మికులుగా పనిచేస్తున్న వారిలో ఉత్తరప్రదేశ్, బిహార్, పశ్చిమబెంగాల్ రాష్ట్రాలకు చెందిన వారు పెద్ద సంఖ్యలో ఉన్నారు. రియాద్‌లోని భారత రాయబార కార్యాలయం, విదేశీ వ్యవహారాల శాఖా మంత్రి సుష్మాస్వరాజ్ వెంటనే ఈ విషయంలో జోక్యం చేసుకుని తమను తిరిగి సురక్షితంగా స్వదేశం పంపాలని బాధితులు కోరుతున్నారు.
''కంపెనీ ఆరు నెలలుగా వేతనాలు ఇవ్వడం లేదు. చేతిలో డబ్బులు లేకపోవడంతో తిండీ కూడా లేదు. జీతాలు అడిగేందుకు వెళితే దాడి చేస్తున్నారు. మాకేం చేయాలో పాలుపోవడం లేదు. వెంటనే భారత ప్రభుత్వం స్పందించి పెండింగ్ జీతాలు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలి. క్షేమంగా స్వదేశం చేర్చాలి'' అని కోల్‌కతాకు చెందిన రషీద్ భారత ప్రభుత్వాన్ని కోరాడు.
సౌదీ బిన్‌లాడిన్ గ్రూప్ నిర్మించిన ఓ బ్రిడ్జి నాలుగు నెలల క్రితం కూలిపోవడంతో ప్రభుత్వం ఆ కంపెనీ కాంట్రాక్టును రద్దుచేసింది. దీంతో కంపెనీ పలువురు ఉద్యోగులను ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా, వారి వేతనాలు చెల్లించకుండా విధుల నుంచి తొలగించింది. దీంతో కార్మికులు కఫీల్(లేబర్ కాంట్రాక్టర్లు)ను ఆశ్రయించగా వారు కంపెనీతో మాట్లాడుకోవాలని చెబుతున్నారని, వారిని అడిగితే ఇచ్చేది లేదు పొమ్మంటున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. తాము తిరిగి స్వదేశాలకు వెళ్లేందుకు చేతిలో డబ్బులు లేవని, పాస్‌పోర్టులు కూడా కాంట్రాక్టర్ల వద్దే ఉన్నాయని పేర్కొన్నారు.
ఓ హైదరాబాద్ కార్మకుడు మాట్లాడుతూ చేతిలో డబ్బులు లేకపోవడంతో బతికేందుకు యాచించాల్సిన పరిస్థితి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్ నుంచి వచ్చిన వారిలో 200 మంది ఇక్కడ చిక్కుకుపోయినట్టు ఆయన వివరించారు. తమ పరిస్థితిని అర్థం చేసుకుని ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ఈ విషయంలో స్పందించి తమను తిరిగి హైదరాబాద్ రప్పించే ఏర్పాట్లు చేయాలని బాధితులు కోరుతున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com