పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ దంపతులకు బిగ్‌షాక్..

- January 17, 2025 , by Maagulf
పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ దంపతులకు బిగ్‌షాక్..

పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్, ఆయన సతీమణి బుష్రా బీబీకి బిగ్ షాక్ తగిలింది. ఆల్ -ఖాదిర్ ట్రస్ట్ భూ ఆక్రమణ కేసులో శుక్రవారం న్యాయస్థానం వారికి శిక్షను విధించింది. ఇమ్రాఖాన్ కు 14ఏళ్లు, ఇమ్రాన్ భార్య బుష్రా బీబీకి ఏడేళ్లు జైలు శిక్షను విధిస్తూ రావల్పిండిలోని అడియాలా జైలులో ఏర్పాటు చేసిన తాత్కాలిక కోర్టులో న్యాయమూర్తి నాసిర్ జావేద్ రానా తీర్పునిచ్చారు. అంతేకాక.. ఇమ్రాన్ కు రూ.10లక్షలు, బుష్రాకు రూ.5లక్షలు జరిమానా విధించారు.

ఇమ్రాన్ ఖాన్ పలు కేసులో 2023 ఆగస్టు నుంచి రావల్పిండిలోని అడియాలా జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు. అయితే, ఆల్ -ఖాదిర్ ట్రస్ట్ భూ ఆక్రమణల కేసులో కోర్టు డిసెంబర్ 2024లో తీర్పును రిజర్వు చేసింది. ఇప్పటికే మూడుసార్లు ఈ కేసులో తీర్పు వాయిదాపడగా.. తాజాగా తుదితీర్పును కోర్టు వెల్లడించింది. తీర్పు వెలువడిన వెంటనే ఇమ్రాన్ సతీమణి బుష్రా బీబీని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ఇమ్రాన్ ఖాన్ దంపతులు ఆల్ ఖాదిర్ ట్రస్ట్ అనే ఫౌండేషన్ ను 1996లో స్థాపించారు. పేదరిక నిర్మూలన, విద్య, ఆరోగ్య సంరక్షణ కోసం ఈ ట్రస్ట్ పనిచేస్తుంది. ఈ ట్రస్టు మాటున అవినీతి జరిగిందంటూ నేషనల్ అకౌంటబిలిటీ బ్యూరో (ఎన్ఏబీ) డిసెంబర్ 2023లో ఇమ్రాన్ ఖాన్, అతని భార్యతో పాటు మరో ఆరుగురిపై కేసు నమోదు చేసింది. పాకిస్థాన్ ప్రభుత్వ ఖజానాకు 190 మిలియన్ పౌండ్లు నష్టం కలిగించారని ఆరోపిస్తూ కేసు నమోదు చేశారు. అయితే, ఈ కేసుకు సంబంధించి ప్రాపర్టీ టైకూన్ మాలిక్ రయీజ్ సహా మిగతా వారంతా దేశం వెలుపల ఉండటంతో ఖాన్, బీబీలపై మాత్రమే విచారణ జరిగింది.

తాజాగా వెలువడిన తీర్పుతో ఇమ్రాన్ ఖాన్ కు రాజకీయంగా పెద్ద ఎదురుదెబ్బేనని చెప్పొచచ్చు. ఇమ్రాన్ పై సుమారు 200 కేసులు నమోదు కాగా.. ప్రస్తుతం ఆయన అడియాలా జైల్లో ఉన్నారు. తోషఖానా, సైఫర్ తదితర కేసులకు సంబంధించి ఏడాది కాలంగా జైలు శిక్ష అనుభవిస్తున్నారు. తాజా కోర్టు తీర్పుతో ఇమ్రాన్ మరికొన్నేళ్ల పాటు జైలులోనే ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో పీటీఐ పార్టీ నాయకత్వంపై నీలినీడలు కమ్ముకున్నాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com