అమెరికాలో విద్యార్థులను వెంటాడుతున్న భయాలు
- January 27, 2025
ట్రంప్ అమెరికా కొత్త అధ్యక్షునిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే ఆయన ఎడాపెడా ఎగ్జిక్యూటివ్ ఆదేశాలపై సంతకాలు పెట్టేస్తుండటంతో పలు వర్గాలకు కష్టాలు ప్రారంభమయ్యాయి. తాము అనుకున్నట్టే అయ్యిందని, ట్రంప్ తిరిగి అధికారంలోకి వస్తే తమకు తిప్పలు తప్పవన్న తమ భయాలు నిజమయ్యాయని వారు వాపోతున్నారు. ముఖ్యంగా అక్రమ వలసదారులపై ట్రంప్ కొరడా ఝళిపించడంతో ఎక్కడ తమపై ఆ వేటు పడుతుందేమోనని పలువురు విద్యార్థులు సైతం భయంతో వణుకుతున్నారు. భారత్ సహా వివిధ దేశాల విద్యార్థులు అక్కడ చదువుకుంటూ పార్ట్టైం ఉద్యోగాలు చేస్తున్నారు.
పార్ట్టైం ఉద్యోగాలకు సంబంధించి ఆ దేశంలో కఠిన నిబంధనలు ఉన్నా ఇంతవరకు అవి సరిగ్గా అమలు కాలేదు. అయితే ట్రంప్ అధికారం చేపట్టాక వాటిని కఠినంగా అమలు చేస్తుండటంతో పార్ట్ టైం ఉద్యోగాలు చేస్తూ తాము దొరికితే ఎక్కడ డిపోర్టేషన్ (దేశ బహిష్కరణ) చేస్తారోనన్న భయంతో అమెరికాలోని పలువురు భారతీయులు వాటిని చేయడం మానేస్తున్నారు. ఉద్యోగం వద్దు బాబోయ్.. ఇక్కడ ఉండనిస్తే చాలు అన్న ధోరణి వారిలో కన్పిస్తున్నది.
ఇప్పటికే అధికారులు పలు సంస్థల్లో యథేచ్ఛగా తనిఖీలు చేస్తున్నారు. దీంతో భయమేసి నేను, నా స్నేహితులు పార్ట్ టైం ఉద్యోగాలను మానేసాం. రిస్క్ తీసుకుని మా స్టూడెంట్ వీసాలను కోల్పోలేం’ అని న్యూయార్క్లో ఉన్నత విద్యను అభ్యసిస్తున్న యూపీకి చెందిన విద్యార్థి తెలిపాడు. ప్రస్తుతం 3 లక్షల మంది భారతీయ విద్యార్థులు అమెరికాలోని వివిధ విద్యాసంస్థల్లో చదువుతున్నారు. అదే సమయంలో ఆ అగ్ర దేశంలో 20,407 మంది సరైన పత్రాలే లేకుండా అక్రమంగా నివసిస్తున్నట్టు అధికారిక లెక్కలు చెబుతున్నాయి.
కఠినంగా నిబంధనలు అమలు
అమెరికాలో చదువుతున్న చాలామంది విద్యార్థులు ఎఫ్-1 వీసాపై ఉన్నారు. దీని ప్రకారం వారు వారానికి 20 గంటల పాటు పార్ట్టైం ఉద్యోగం చేసుకోవచ్చు. అయితే ఆయా క్యాంపస్లోనే వారు వాటిని చేయాల్సి ఉంటుంది. దానిని అతిక్రమించితే అమెరికా దౌత్య విధానం ప్రకారం వారిని దేశం నుంచి బయటకు పంపేయవచ్చు. అయితే క్యాంపస్ల్లోనే అందరికీ ఉద్యోగాలు లభించవు కాబట్టి అక్కడి విద్యార్థులు రెస్టారెంట్లు, పెట్రోల్ పంప్లు, రిటైల్ స్టోర్ల్లో అనధికారికంగా పని చేస్తుంటారు. ఆయన కార్యనిర్వాహక ఉత్తర్వులతో ఎప్పుడు ఎవరిపై వేటు పడుతుందోనని వేలాది మంది బిక్కుబిక్కుమంటున్నారు.
తాజా వార్తలు
- ఏప్రిల్ 5 నుండి భారత్ కు కువైట్ ఎయిర్వేస్ సర్వీసులు..!!
- బహ్రెయిన్ గ్రాండ్ మస్జీదు.. విజిటర్స్ కు ఆధ్యాత్మిక అనుభవం..!!
- 70% పెరిగిన డీజిల్ ధర..ఆందోళనలో సూపర్మార్కెట్లు..!!
- 100,000 కంటే ఎక్కువ మందికి సామాజిక భద్రతా పింఛన్లు..!!
- సెప్టెంబర్కు మారిన అటానమస్ ఇ-మొబిలిటీ ఫోరమ్..!!
- 911కు మార్చి నెలలో 2.6 మిలియన్లకు పైగా కాల్స్..!!
- డిగ్రీ, పీజీ విద్యార్థులకు శుభవార్త..
- అమరావతి బిల్లు ఆమోదం..ప్రధాని మోదీని కలిసిన నారా లోకేశ్
- వరల్డ్ క్లాస్ రాజధానిగా అమరావతి: మంత్రి కొండపల్లి శ్రీనివాస్
- కేరళలో ఎస్పీబీ విగ్రహావిష్కరణ









