సీఎం రేవంత్తో ఎమ్మార్ ప్రాపర్టీస్ ప్రతినిధులు భేటీ..
- February 27, 2025
హైదరాబాద్: దుబాయ్కి చెందిన ఎమ్మార్ ప్రాపర్టీస్ ప్రతినిధులు సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీ ధర్బాబుతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా.. తెలంగాణలోని వివిధ ప్రాజెక్టులపై దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న కేసులకు సంబంధించిన వివాదాలను పరిష్కరించాలని ఎమ్మార్ ప్రాపర్టీస్ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది.
2001లో ఉమ్మడి రాష్ట్రంలో దుబాయికు చెందిన ఎమ్మార్ ప్రాపర్టీస్ హైదరాబాద్లో కన్వెన్షన్ సెంటర్, హోటల్, గోల్ఫ్ కోర్సు, విల్లాలు తదితర ప్రాజెక్టుల్లో పెట్టుబడులకు అప్పటి ప్రభుత్వంతో ఒప్పందాలు చేసుకుందని…. ఏపీఐఐసీతో ఆ సంస్థ చేసుకున్న ఒప్పందాల్లో అక్రమాలు జరిగాయని అప్పట్లో సీబీఐ, ఈడీ కేసులు నమోదయ్యాయని చెప్పారు.
ఏజెన్సీల దర్యాప్తులు, కోర్టుల్లో విచారణలు కొనసాగుతున్నాయని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత 2015 అక్టోబర్లో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఎమ్మార్ ప్రాపర్టీస్కు సంబంధించిన ప్రాజెక్టుల వివాదాల పరిష్కారానికి ఛీప్ సెక్రెటరీ సారధ్యంలో అయిదుగురు సెక్రెటరీల కమిటీని ఏర్పాటు చేసిందని వివరించారు. మరోవైపు, కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ, భారత సొలిసిటర్ జనరల్ కూడా ఈ వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వానికి పలు సూచనలు చేశారు.
ఎమ్మార్ ప్రతినిధులతో జరిగిన తాజా చర్చల సందర్భంగా ఈ వివరాలన్నింటినీ అధికారులు ముఖ్యమంత్రికి నివేదించారు. వివిధ దర్యాప్తు ఏజెన్సీల కేసులు, ఛార్జీషీట్లు, న్యాయపరమైన అంశాలతో ముడిపడి ఉన్నందున ఎమ్మార్ ఒప్పందాల డాక్యుమెంట్లు, కోర్టు కేసుల వివరాలతో పాటు కేంద్ర ప్రభుత్వ సూచనలన్నీ క్షుణ్ణంగా పరిశీలించాలని ఈ సందర్భంగా సీఎం రేవంత్ అధికారులను ఆదేశించారు.
ఎమ్మార్ ప్రాపర్టీస్ వ్యవహారాన్ని పరిష్కరించేందుకు 2015లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీకి అదనంగా న్యాయ నిపుణులతో కూడిన మరో కమిటీ ఏర్పాటు చేయాలని సీఎం సూచించారు.
లీగల్ ఏజెన్సీ ఏర్పాటుకు సీఎం ఆమోదం
న్యాయ వివాదాలను అధ్యయనం చేయడానికి, సామరస్య పూర్వక పరిష్కారం చేసుకోవడానికి యూఏఈ ప్రభుత్వ ఆమోదంతో ఒక లీగల్ ఏజెన్సీని ఏర్పాటు చేస్తామని సంస్థ ప్రతినిధులు చేసిన ప్రతిపాదనను ముఖ్యమంత్రి అమోదించారు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసే కమిటీ ఆ ప్రతినిధులతో సంప్రదింపులు జరిపి తదుపరి సూచనలు, సలహాలు అందిస్తుందని చెప్పారు.
ఎమ్మార్ ప్రాపర్టీస్ వ్యవస్థాపకుడు, మేనేజింగ్ డైరెక్టర్ మహమ్మద్ అలీ రషీద్ అలబ్బర్ నేతృత్వంలో భారత్లో యూఏఈ మాజీ రాయబారి డాక్టర్ అహ్మద్ అల్ బన్నా, ఎమ్మార్ గ్రూప్ సీఈవో అమిత్ జైన్, ఆ కంపెనీ ఇంటర్నేషనల్ అఫైర్స్ హెడ్ ముస్తఫా అక్రమ్ ఈ సమావేశంలో పాల్గొన్నారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో జరిగిన ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి, పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్, ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావుతో పాటు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- సంక్రాంతికి కొత్త ఆఫీసులోకి ప్రధాని..
- గల్ఫ్ కార్మికుల మానవత్వం
- యూఏఈలో ఘనంగా సంక్రాంతి వేడుకలు
- ఒక్కరోజు విరామం తీసుకుందామంటే ఏదో ఒక పని పడుతోంది: సీఎం రేవంత్
- టీసీఎస్ లాభం రూ.10657 కోట్లు..
- యుద్ధ కళల్లో పవన్ కల్యాణ్ కు అంతర్జాతీయ గుర్తింపు
- దుబాయ్ హిట్ అండ్ రన్ కేసు.. ఇంకా ఐసియులోనే గర్భిణి..!!
- వెనెజువెలా అధ్యక్షుడుగా తనకు తానే ప్రకటించుకున్న ట్రంప్
- భారత్ అమ్ములపొదిలో చేరిన అత్యాధునిక మిస్సైల్
- సౌదీలో రైడ్-హెయిలింగ్ యాప్ కు ఫుల్ డిమాండ్..!!







