పారికర్ మృతి...తదుపరి సీఎంపై కొనసాగుతున్న చర్చలు

- March 18, 2019 , by Maagulf
పారికర్ మృతి...తదుపరి సీఎంపై కొనసాగుతున్న చర్చలు

పనాజీ: గోవా ముఖ్యమంత్రి మనోహర్‌ పారికర్‌ కన్నుమూయడంతో కొత్త సీఎం ఎవరన్న దానిపై ఇంకా చర్చలు కొనసాగుతున్నాయి. ఆయన మరణ వార్త తెలిసిన కొన్ని గంటల్లోనే భాజపా సీనియర్‌ నేత, కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ రాష్ట్రానికి చేరుకున్నారు. భాగస్వామ్య పక్షాలతో కలిసి రాత్రి పొద్దుపోయే దాకా చర్చలు జరిపారు. కానీ సమావేశంలో తదుపరి సీఎం ఎవరన్నదానిపై ఇంకా స్పష్టత రాలేదని డిప్యూటీ స్పీకర్‌ మైకేల్‌ లోబో తెలిపారు. సంకీర్ణ పక్షమైన మహారాష్ట్రవాదీ గోమంటక్‌ పార్టీ నేత సుదిన్‌ ధావలికర్‌ తననే సీఎం చేయాలని పట్టుబడుతున్నట్లు ఆయన తెలిపారు.
మరోవైపు భాగస్వామ్య పక్షమైన గోవా ఫార్వర్డ్‌ పార్టీ అధినేత విజయ్‌ సర్‌దేశాయ్‌ కూడా భాజపా అధినాయకత్వంతో సంప్రదింపులు జరుపుతున్నారు. ''సంకీర్ణ ప్రభుత్వ ఏర్పాటుకు ఉన్న అన్ని అవకాశాలను వారితో చర్చించాం. అయితే ఇంకా తుది నిర్ణయానికి రాలేదు. మా ప్రతిపాదనలు వారి ముందు ఉంచాం. వాటిపై వారు స్పందించాల్సి ఉంది. మా పార్టీ ఇంతకాలం మనోహర్‌ పారికర్‌కు మద్దతు పలికింది. భాజపాకు కాదు'' అని సర్‌దేశాయ్‌ వివరించారు. అలాగే రాష్ట్రంలో ప్రస్తుతం అతిపెద్ద పార్టీగా ఉన్న కాంగ్రెస్‌ తమనే ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని గవర్నర్‌ను కోరిన విషయం తెలిసిందే. ప్రస్తుతం భాజపాకు సొంతంగా 12 మంది శాసనసభ్యులుండగా మిత్రపక్షాలతో కలిపి 20 మంది బలం ఉంది. 14 మంది శాసనసభ్యులతో అసెంబ్లీలో కాంగ్రెస్ అతిపెద్ద పార్టీగా నిలిచింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com