స్వశక్తితో బ్రతకడం ద్వారా మహిళల ఆత్మగౌరవం మరింతగా పెరుగుతుంది: డీజీపి జితేందర్

- March 16, 2025 , by Maagulf
స్వశక్తితో బ్రతకడం ద్వారా మహిళల ఆత్మగౌరవం మరింతగా పెరుగుతుంది: డీజీపి జితేందర్

హైదరాబాద్: ఈరోజు రాచకొండ పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో రాచకొండ సెక్యూరిటీ కౌన్సిల్ వారి భాగస్వామ్యంతో మహిళలకు ఉద్యోగ అవకాశాలు కల్పించి వారు జీవితంలో ఉన్నత స్థానాలకు ఎదిగేందుకు దోహదపడేలా భారీ జాబ్ మేళా కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. 

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర డిజిపి జితేందర్ మాట్లాడుతూ, సమాజంలో సగభాగం ఉన్న మహిళలను గౌరవించడం ప్రతి ఒక్కరి విధి అని తెలిపారు. మహిళలు గృహిణిగా, తల్లిగా, ఉపాధ్యాయురాలిగా, స్నేహితురాలిగా, కూతురిలా ఇలా విభిన్న పాత్రలు పోషిస్తూ పురుషుడి విజయంలోనూ, అతని సుఖసంతోషాలలోనూ ప్రముఖ పాత్ర పోషిస్తారని, అటువంటి స్త్రీలను గౌరవించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. అయితే స్త్రీలు కేవలం ఇంటికి పరిమితం కాకుండా ఉన్నత చదువులు చదివి, వారిలో ఉన్న విభిన్న నైపుణ్యాలను, మేధస్సును ఉపయోగించుకొని వారి అర్హతలకు తగిన విధంగా ఉన్నత ఉద్యోగ అవకాశాలు దక్కించుకొని ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. 

స్త్రీలు ఆత్మగౌరవంతో బతకడం ద్వారా వారి విలువ మరింతగా పెరుగుతుందని, స్వశక్తితో బతకడం అనేది అందుకు మరింతగా దోహదం చేస్తుందని పేర్కొన్నారు. స్త్రీలు తమకున్న నైపుణ్యాలను కోల్పోకూడదని, వారికున్న మేధస్సును సమాజానికి ఉపయోగపడేలా చేయాలని అందుకోసం ఉత్సాహంగా అందుబాటులో ఉన్న ఉద్యోగ అవకాశాలను దక్కించుకొని సమాజ నిర్మాణంలో తమ వంతు పాత్ర పోషించాలని సూచించారు. మనదేశంలో అధిక సంఖ్యలో ఉన్న యువ జనాభా మనకు గొప్ప సంపద అని, ఆ యువశక్తిని సరైన రీతిలో ఉపయోగించుకుంటే దేశం మరింతగా అభివృద్ధి పథంలో పయనిస్తుందని పేర్కొన్నారు. రోజురోజుకూ ప్రపంచం మరింతగా కొత్త పుంతలు తొక్కుతోందని, అన్ని రంగాల్లోనూ పోటీతత్వం పెరుగుతోందని, కాబట్టి ప్రతి ఒక్కరూ ఎప్పటికప్పుడు తమ నైపుణ్యాలను, శక్తియుక్తులను మెరుగుపరుచుకోవాలని సూచించారు. 

ఈ కార్యక్రమానికి గౌరవ అతిథిగా హాజరైన రాచకొండ కమిషనర్ సుధీర్ బాబు మాట్లాడుతూ, స్త్రీని గౌరవించే చోట దేవతలు కొలువై ఉంటారని, స్త్రీని గౌరవించడం అంటే మనల్ని మనం గౌరవించుకోవడమేనని తెలిపారు. మహిళలు తమ నైపుణ్యాలు మరియు మేధస్సును ఉపయోగించుకొని తమ స్వశక్తితో జీవించడం ద్వారా వారి ఆత్మవిశ్వాసం మరియు ఆత్మగౌరవం మరింతగా పెరుగుతాయని, అందుకు దోహదపడేలా ఈ జాబ్ మేళా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ జాబ్ మేళా ద్వారా దాదాపు 2800 మంది ఉత్సాహవంతులైన మహిళలు ఉద్యోగ అవకాశాల కోసం నమోదు చేసుకోగా వారిలో విభిన్న అర్హతలు, నైపుణ్యాలు కలిగిన దాదాపు 2323 మంది ఉద్యోగాలు పొందినట్లు పేర్కొన్నారు. 

ఈ జాబ్ మేళా ద్వారా ఉద్యోగాలు పొందిన మహిళలు తమ వృత్తి జీవితంలో మరింతగా ఎదిగేందుకు అవసరమైన అన్ని రకాల తోడ్పాటును కూడా భవిష్యత్తులో అందిస్తామని కమిషనర్ గారు హామీ ఇచ్చారు. రాచకొండ సెక్యూరిటీ కౌన్సిల్ లోని సభ్య కంపెనీలు గొప్ప మనసుతో ముందుకు వచ్చి ఎంతోమంది ఆశావహులైన మహిళలకు ఉద్యోగాలు కల్పించడం అనేది ఎంతో గొప్ప విషయమని ప్రత్యేకంగా అభినందించారు. మహిళలను పురుషులతో సమానంగా చూడడమే మనం వారికి ఇచ్చే గౌరవమని, ప్రతి రంగంలోనూ పురుషులతో సమానంగా పోటీ పడుతున్న మహిళలను ప్రతి ఒక్కరూ గౌరవించాలన్నారు.

ఈ కార్యక్రమంలో మల్కాజ్గిరి డీసీపీ పివి పద్మజ, డీసీపీ యాదాద్రి అక్షాంశ్ యాదవ్, డిసిపి ఎల్బీనగర్ ప్రవీణ్ కుమార్, డిసిపి క్రైమ్ అరవింద్ బాబు, డిసిపి అడ్మిన్ ఇందిర, డీసీపీ ట్రాఫిక్  శ్రీనివాసులు, డిసిపి ఉమెన్ సేఫ్టీ ఉషా విశ్వనాథ్, డిసిపి రోడ్ సేఫ్టీ మనోహర్,డీసీపీ స్పెషల్ బ్రాంచ్ జి.నరసింహారెడ్డి, డిసిపి ఎస్ఓటి రమణారెడ్డి, డిసిపి శ్యామ్ సుందర్,డీసీపీ సైబర్ క్రైమ్స్ నాగలక్ష్మి మరియు ఫోరమ్ వైజ్ జాయింట్ సెక్రటరీలు: సేఫ్టీ & సెక్యూరిటి ఫోరమ్: వాసుదేవ్ రావు - గ్రూప్ డైరెక్టర్ CDC SNIST, ఉమెన్స్ ఫోరం: డాక్టర్ రాధికానాథ్, సాయి సెక్యూరిటీ డైరెక్టర్, సైబర్ సెక్యూరిటీ ఫోరమ్, ట్రాఫిక్ ఫోరమ్: శ్రీనివాస్, శ్రీనివాస టూర్స్ & ట్రావెల్స్ వ్యవస్థాపక డైరెక్టర్, సోషల్ ఔట్రీచ్ ఫోరమ్:మిస్టర్ వంశీ ప్రోగ్రామ్ మేనేజర్ ఇన్ఫోసిస్, ఆర్.కె.ఎస్.సి చీఫ్ కోఆర్డినేటర్ సావిత్రి మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com