ఉక్రెయిన్‌ పై దాడి 20 మందికి పైగా మృతి

- April 13, 2025 , by Maagulf
ఉక్రెయిన్‌ పై దాడి 20 మందికి పైగా మృతి

రష్యా-ఉక్రెయిన్ యుద్ధం మరోసారి ఉద్రిక్తతకు దారి తీసింది. పండుగ వేళ కూడా సంస్కరణలు, శాంతి మార్గాన్ని పక్కన పెట్టిన రష్యా, సాధారణ ప్రజలపై భయంకరమైన దాడులు జరిపింది. ఉక్రెయిన్‌లోని సుమీ నగరాన్ని లక్ష్యంగా చేసుకున్న రష్యా ఆర్మీ రెండు క్షిపణులతో తీవ్ర దాడికి దిగింది. ఈ దాడిలో 20 మందికి పైగా అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోగా, మరో 30 మంది తీవ్రంగా గాయపడ్డారు.ఆదివారం సందర్భంగా స్థానికులంతా ఒక్కచోట చేరిన సమయంలో రెండు క్షిపణులతో రష్యా దాడి చేసింది.సుమీ నగరంపై రష్యా చేసిన క్షిపణుల దాడిని ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ తీవ్రంగా ఖండించారు. సాధారణ పౌరులే లక్ష్యంగా ఈ దాడి జరిగిందని తెలిపారు. ఈ దాడుల్లో పదుల సంఖ్యలో పౌరులు మరణించారని పేర్కొన్నారు. నివాస భవనాలు, విద్యాసంస్థలు, కార్లు వంటివి ధ్వంసమయ్యాయని చెప్పారు. ఈ ఘటనపై ప్రపంచ దేశాలు స్పందించాలని కోరారు. రష్యాపై ఒత్తిడి లేకుండా శాంతి స్థాపన చేయడం అసాధ్యమని అభిప్రాయపడ్డారు.

ఈ దాడితో యుద్ధం మరింత ఉద్ధృతంగా మారే ప్రమాదం ఉందని రక్షణ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే సంవత్సరాల తరబడి కొనసాగుతున్న ఈ యుద్ధం వల్ల వేలాది మంది ప్రాణాలు కోల్పోగా, లక్షల మంది నివాసాలు కోల్పోయి శరణార్థులుగా మారారు. తాజా దాడి ఉక్రెయిన్ ప్రజల్లో భయాన్ని మరింత పెంచింది.ఈ యుద్ధంలో రష్యా ఉక్రెయిన్ మీద పెద్ద స్థాయిలో దాడులు చేసింది. కేవలం సైనిక స్థావరాలపై కాకుండా, ప్రజలు నివసించే నగరాలపై కూడా రష్యా క్షిపణి దాడులు జరిపింది.అనేక నగరాలు నాశనం అయ్యాయి.ఉక్రెయిన్ మాత్రం ధైర్యంగా పోరాడుతోంది. 2022 ఫిబ్రవరి 24న, రష్యా ఉక్రెయిన్‌పై పెద్ద ఎత్తున యుద్ధం ప్రారంభించింది. ఇది 2014 నుండి కొనసాగుతున్న రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ప్రధాన తీవ్రతను సూచిస్తుంది. నాటో (ఉత్తర అట్లాంటిక్‌ ఒప్పంద సంఘము)లో చేరకుండా ఉక్రెయిన్‌ను చట్టబద్ధంగా నిషేధించాలని రష్యా డిమాండ్ చేసింది. రష్యా డొనెట్స్క్ పీపుల్స్ రిపబ్లిక్, లుహాన్స్క్ పీపుల్స్ రిపబ్లిక్, అనే రెండు స్వయం ప్రకటిత ఉక్రెయిన్ రాష్ట్రాలను గుర్తించింది. ఆ తర్వాత ఫిబ్రవరి 21న తూర్పు ఉక్రెయిన్‌ లోని డాన్‌బాస్ ప్రాంతంలో రష్యన్ సాయుధ దళాల చొరబాటు జరిగింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com