తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం..
- April 14, 2025
హైదరాబాద్: ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేసుకుంటూ వస్తున్న రేవంత్ సర్కార్.. తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఫుడ్ డెలివరీ, ట్రాన్స్ పోర్ట్, ప్యాకేజ్ డెలివరీల్లో పనిచేసే గిగ్ వర్కర్ల భద్రత కోసం కొత్త పాలసీని రూపొందించింది. గిగ్ వర్కర్ల ఉద్యోగ భద్రత, జీతాలు, యాక్సిడెంటల్ బీమా, గ్రీవెన్స్ సెల్, పిర్యాదులు వాటి పరిష్కారం, సామాజిక భద్రత, వర్కర్ల పై కంపెనీల వేధింపులు జరిపినప్పుడు చర్యలు తీసుకోవటం వంటి అంశాలు ఈ పాలసీలో ఉన్నాయి.
రాష్ట్రంలో స్విగ్గీ, జొమాటో, ఓలా, ఉబర్ తోపాటు ఇతర రంగాల్లో పనిచేస్తున్న గిగ్ వర్కర్లు మొత్తం సుమారు 7లక్షల మంది ఉన్నారని కార్మిక శాఖ లెక్కలు చెబుతున్నాయి. వీరి భద్రతకు చట్టం తెస్తామని అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో తెలంగాణలో భారత్ జోడో యాత్రకు వచ్చిన సమయంలో రాహుల్ గాంధీ గిగ్ వర్కర్లు, ప్లాట్ ఫాం వర్కర్లతో సమావేశమైన సందర్భంలో వారికి హామీ ఇచ్చారు. ఇందులో భాగంగా 2023 డిసెంబర్ 30న గిగ్, ప్లాట్ ఫాం వర్కర్లు మరణిస్తే రూ.5లక్షలు యాక్సిడెంటల్ డెత్ ఇన్సూరెన్సు అమలు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వం. వీరికి ఆరోగ్య శ్రీ స్కీమ్ వర్తించేలా వర్కర్ల రిజిస్ట్రేషన్ల వివరాలను ఆ పోర్టల్ కు కార్మిక శాఖ అనుసంధానం చేస్తోంది.
రాష్ట్ర ప్రభుత్వం గిగ్ వర్కర్ల కోసం కొత్తగా తెచ్చే పాలసీ క్లియరెన్స్ కోసం న్యాయ శాఖకు కార్మిక శాఖ ప్రతిపాదనలు పంపించింది. వారంలో క్లియరెన్స్ రానుందని కార్మిక శాఖ అధికారులు చెబుతున్నారు. క్లియరెన్స్ రాగానే నోటిఫికేషన్ ఇచ్చి అభ్యంతరాలు, సలహాలు స్వీకరిస్తారు. ఆ తరువాత వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో బిల్లు ప్రవేశపెట్టే అవకాశం ఉన్నట్లు సమాచారం.
ఇప్పటికే జార్ఖండ్, కర్ణాటక, రాజస్థాన్ రాష్ట్రాల్లో గిగ్ వర్కర్ల కోసం పాలసీని తీసుకొచ్చేందుకు అక్కడి ప్రభుత్వాలు ప్రయత్నాలు చేస్తున్నాయి. అయితే, కొన్ని కారణాల వల్ల ఆయా రాష్ట్రాల్లో కార్యరూపం దాల్చలేదు. ఆ రాష్ట్రాల కంటే ముందుగానే అసెంబ్లీలో ఈ పాలసీని ప్రవేశపెట్టి చట్టం చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. అదే జరిగితే.. గిగ్ వర్కర్ల రక్షణకు పాలసీ తీసుకొచ్చిన తొలి రాష్ట్రంగా తెలంగాణ నిలవనుంది.
తాజా వార్తలు
- మే 1న డీజీపీగా బాధ్యతలు స్వీకరించనున్న సీవీ ఆనంద్
- పడవలలో ఉన్న175 మంది గాజా కార్యకర్తలను అరెస్టు చేసిన ఇజ్రాయెల్
- అమెరికా-ఇరాన్ సంక్షోభం: హర్మూజ్ జలసంధి పై ముదురుతున్న పోరు
- ఘోర రోడ్డు ప్రమాదం..15 మంది దుర్మరణం.. 20 మందికి పైగా తీవ్ర గాయాలు
- హై-టెక్ సేవలను ప్రారంభించిన రాయల్ హాస్పిటల్..!!
- జూలై 1 నుండి 31 వరకు ఖతార్ టాయ్ ఫెస్టివల్..!!
- బహ్రెయిన్ లో దోమల వ్యాప్తి నివారణ పై స్పెషల్ ఫోకస్..!!
- కువైట్ లో మే 3 నుండి వైద్య సిబ్బందికి సెలవులు..!!
- ఆన్లైన్ కంటెంట్ పై సౌదీ అరేబియా కఠిన చర్యలు..!!
- భారీగా భారత్-యూఏఈ విమాన ఛార్జీలు..!!









