మహిళల అభివృద్ధికి సీఎం రేవంత్ సంచలన నిర్ణయం

- April 21, 2025 , by Maagulf
మహిళల అభివృద్ధికి సీఎం రేవంత్ సంచలన నిర్ణయం

హైదరాబాద్: రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కార్ మహిళలను అభివృద్ధి పథంలోకి తీసుకొచ్చేందుకు విశ్వప్రయత్నాలు చేస్తోంది. అనేక విప్లవాత్మక సంస్కరణలు తీసుకొస్తోంది. ఇప్పటికే మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించింది సీఎం రేవంత్ సర్కార్. తెలంగాణలో కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతోంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ప్రతి మహిళకు నెలకు రూ. 2500 తో పాటు వివాహం సమయంలో కళ్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ తోపాటు తులం బంగారం ఇచ్చే కార్యక్రమాన్ని త్వరలో ప్రారంభించనుంది.

పెట్రోల్ బంకులను ఏర్పాటు
అయితే వీటికంటే ముందు మహిళల కోసం సీఎం రేవంత్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు.మహిళల సాధికారతే లక్ష్యంగా మరో సరికొత్త పథకానికి కాంగ్రెస్ ప్రభుత్వం శ్రీకారం చుట్టనుంది. ఈ మేరకు రాష్ట్రంలోనే తొలిసారిగా సంగారెడ్డి జిల్లాలో పూర్తిగా మహిళలతో నిర్వహించబడే పెట్రోల్ బంకులను ఏర్పాటు చేస్తోంది. ఈ మేరకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. మొదటి దశలో ఫైలట్ ప్రాజెక్ట్ కింద 5 నియోజకవర్గాల్లో ఈ బంకులు ప్రారంభం కానున్నట్లు సమాచారం.

20 నుంచి 30 ఏళ్ల మధ్య ఉన్న మహిళలు అర్హులు
ఆ తర్వాత దశల వారీగా రాష్ట్రం మొత్తం వ్యాపింప చేయాలని సీఎం రేవంత్ సర్కార్ ప్లాన్ చేస్తోంది. ఈ పథకానికి 20 నుంచి 30 ఏళ్ల మధ్య ఉన్న మహిళలు అర్హులుగా ప్రకటించింది. టెన్త్, ఇంటర్ పాసైన వారికి పెట్రోల్, డీజిల్ నింపడం, క్యాషియర్ బాధ్యతలు అప్పగిస్తారు. అలాగే డిగ్రీ పూర్తి చేసిన మహిళలను మేనేజర్ పోస్టుల్లో నియమించనున్నారు అధికారులు. ఈ పథకం ద్వారా మహిళలకు ఉపాధి అవకాశాలను పెరిగి స్వయం సమృద్ది సాధిస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ మహిళా పెట్రోల్ బంకులను సంగారెడ్డి జిల్లాతో పాటు జహీరాబాద్, ఆందోల్, పటాన్ చెరు, నారాయణ ఖేడ్ ప్రాంతాల్లో ఏర్పాటు చేయనున్నారు. మరో 15 రోజుల్లో ఇవి అందుబాటులోకి రానున్నాయని కాంగ్రెస్ ప్రభుత్వం చెబుతోంది. ఈ మేరకు పెట్రోల్ బంకుల వివరాలను తెలంగాణ కాంగ్రెస్ తన అధికారిక ఖాతాలో పోస్ట్ చేసింది. ఈ పెట్రోల్ బంకులను ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సహకారం, భాగస్వామ్యంతో ఏర్పాటు చేయనున్నారు. ఒక్కో బంకు ఏర్పాటుకు రూ. 2 కోట్ల వరకు ఖర్చు అవుతుందని సమాచారం. ఈమేరకు ఐఓసీఎల్ తో దీర్ఘకాలికంగా 20 ఏళ్లపాటు ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది.

మహిళల్లో స్వయంసాధికారత
ఈ కార్యక్రమం ద్వారా మహిళల్లో స్వయంసాధికారత, ఉపాధి, ఉద్యోగ అవకాశాలు మెరుగుపడతాయని కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తోంది. టెన్త్, ఇంటర్, డిగ్రీ పాసై 20 ఏళ్ల నుంచి 30 ఏళ్ల మధ్య ఉన్న మహిళలు ఈ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని పేర్కొంది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మహిళలకు ఫ్రీ బస్ కార్యక్రమాన్ని మహిళలు విజయవంతంగా సద్వినియోగం చేసుకుంటున్నారు.ఈ ఫ్రీ బస్ పథకాన్ని మరింత బలోపేతం చేసే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఈ మేరకు కొత్తగా మరో 2వేల బస్సులు ఏర్పాటు చేయాలని భావిస్తోంది.మరో 3,500 మంది డ్రైవర్లు అవసరమని అంచనా వేసింది.ఈ మేరకు డ్రైవర్లు, కండక్టర్ల నియామకాలు చేపట్టేందుకు ప్రణాళికలు చేస్తోంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com