పింగళి వెంకయ్య జయంతి సందర్భంగా వెంకట సుబ్బారావుకు జాతీయ పురస్కారం

- August 02, 2025 , by Maagulf
పింగళి వెంకయ్య జయంతి సందర్భంగా వెంకట సుబ్బారావుకు జాతీయ పురస్కారం

హైదరాబాద్: అపరిమిత దేశభక్తి మరియు నిస్వార్థ ప్రజాసేవకు ప్రతీక అయిన జాతీయ పతాక రూపకర్త పింగళి వెంకయ్య పేరుతో ఇచ్చే అవార్డును ఈ ఏడాది భూదాన ఉద్యమకారుడు, ప్రముఖ సామాజిక సేవకుడు గోవిందరాజు వెంకట సుబ్బారావు అందుకున్నారు. ఈ సందర్భంగా హర్యానా పూర్వ గవర్నర్ బండారు దత్తాత్రేయ ముఖ్య అతిథిగా హాజరై, అవార్డు అందజేశారు.

వంశీ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో త్యాగరాయ గాన సభలో నిర్వహించిన పింగళి వెంకయ్య 148వ జయంతి ఉత్సవంలో ఈ పురస్కార ప్రదానోత్సవం జరిగింది.ఈ సందర్భంగా దత్తాత్రేయ మాట్లాడుతూ, “జాతీయ జెండా ఒక్క దేశానికే కాదు, జాతి గర్వానికి చిహ్నం.అటువంటి త్రివర్ణ పతాకాన్ని గాంధీ సూచన మేరకు రూపకల్పన చేసిన మహానుభావుడు పింగళి వెంకయ్య,” అని ప్రశంసించారు.

పురస్కార గ్రహీత వెంకట సుబ్బారావు గురించి మాట్లాడుతూ, ఆయన భూదాన ఉద్యమం, మధ్యపాన నిషేధ ఉద్యమాల్లో పాల్గొనడమే కాకుండా, వికలాంగులు, బడుగు బలహీన వర్గాలకు విద్య, వైద్యం, ఆహారం, వసతి వంటి అంశాల్లో సేవలు అందించారని వివరించారు.

కార్యక్రమానికి అధ్యక్షత వహించిన రాష్ట్ర ప్రభుత్వ పూర్వ సలహాదారు డా. కె.వి.రమణ మాట్లాడుతూ, “జాతీయ జెండా దేశ ఆత్మ గౌరవానికి ప్రతీక. అటువంటి జెండాను రూపొందించిన పింగళి వెంకయ్య సేవలు మరువలేనివి,” అన్నారు.

పురస్కార గ్రహీత వెంకట సుబ్బారావు మాట్లాడుతూ, “92 ఏళ్ళ వయసులో పింగళి వెంకయ్య పేరిట అవార్డు పొందడం గర్వకారణం. ఇది నా జీవితంలో మరిచిపోలేని స్మృతి,” అని చెప్పారు.

వేదికపై పింగళి వెంకయ్య మనవడు నరసింహం మాట్లాడుతూ, “నెహ్రూ నుంచి ఏ ప్రధానమంత్రి కూడా వెంకయ్య గారిని జాతీయ జెండా రూపకర్తగా గుర్తించలేదు. కానీ ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల ఆయనను గౌరవంగా ప్రస్తావించారు,” అని గుర్తు చేశారు.

కార్యక్రమంలో సాహితీ కిరణం సంపాదకులు పొత్తూరి సుబ్బారావు, కాగడా మా శర్మ తదితరులు పాల్గొన్నారు.వంశీ రామరాజు కార్యక్రమాన్ని నిర్వహించగా డా.సుధా దేవి స్వాగతం పలికారు. కార్యక్రమ ప్రారంభంలో ఫణి కశ్యప్, ప్రసన్న, రాధా రాణి, రమాదేవి దేశభక్తి గీతాలు ఆలపించి సభకు శోభ ఇచ్చారు.

 

 

 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com