ప్రపంచ దేశాల్లో యోగాకి ప్ర‌త్యేక గుర్తింపు..

- September 29, 2025 , by Maagulf
ప్రపంచ దేశాల్లో యోగాకి ప్ర‌త్యేక గుర్తింపు..

విజ‌య‌వాడ‌: ప్రపంచ దేశాల్లో యోగాకి ప్ర‌త్యేక గుర్తింపు తెచ్చింది సాక్షాత్తు మన దేశ ప్రధాని నరేంద్ర మోదీ అని ఉపసభాపతి రఘురామ కృష్ణరాజు పేర్కొన్నారు. స్థానిక పీబీ సిద్ధార్థ ఆర్ట్ అండ్ సైన్స్ కళాశాల ప్రాంగణంలో నాలుగు రోజుల పాటు జర‌గ‌నున్న 6వ జాతీయ జూనియర్, సీనియర్-సి యోగాసన ఛాంపియన్‌షిప్‌ను నేడు ర‌ఘురామ‌ కృష్ణ‌రాజు ముఖ్యఅతిథిగా హాజరై లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయ‌న మాట్లాడుతూ, యోగా ద్వారా మానసిక ప్రశాంతత లభిస్తుందన్నారు. అలాగే వ్యాధుల బారిన పడకుండా ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపవచ్చని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ యోగాకు ప్రాధాన్యతనిచ్చి సాధన చేయాలన్నారు. గౌర‌వ అతిథిగా హాజ‌రైన ఎంపీ కేశినేని శివనాథ్(చిన్ని) మాట్లాడుతూ, యోగాసనాలు శారీరక, మానసిక ఆరోగ్యానికి పునాది అన్నారు. విజయవాడలో జాతీయ స్థాయి పోటీలు జరగడం గర్వకారణమన్నారు. యోగాసన క్రీడలను అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకొచ్చింది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలేనని పేర్కొన్నారు. రాష్ట్ర యోగాసన స్పోర్ట్స్ సంఘం గౌరవాధ్యక్షుడు గొట్టిపాటి వెంక‌ట రామకృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ, ఈ పోటీల్లో దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి సుమారు 1500 మందికి పైగా క్రీడాకారులు హాజరయ్యారన్నారు. ముందుగా క్రీడాకారులు చేసిన గౌరవ వందనాన్ని అతిథులు స్వీకరించారు. అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, శాప్ ఛైర్మన్ అనిమిని రవినాయుడు, శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్, రాష్ట్ర యోగాసన స్పోర్ట్స్ సంఘం అధ్యక్షురాలు ఎ.రాధిక, ఉపాధ్యక్షుడు రాజశేఖరరెడ్డి, ప్రధాన కార్యదర్శి పి.ప్రేమ్‌కుమార్‌, యోగాసన భారత్ స్పోర్ట్స్ కన్సల్టెంట్ శ్రేయస్ మార్కండేయ, తదితరులు పాల్గొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com