తొక్కిసలాట పై స్పందించిన విజయ్

- September 30, 2025 , by Maagulf
తొక్కిసలాట పై స్పందించిన విజయ్

చెన్నై: కరూర్‌లో జరిగిన తొక్కిసలాట ఘటన దేశాన్ని కుదిపేసింది.ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన అమాయకులపై అందరూ ఆవేదన వ్యక్తం చేస్తుండగా, తొలిసారి టీవీకే అధ్యక్షుడు, సినీ నటుడు విజయ్ కూడా తన మనసులోని బాధను వెలిబుచ్చారు. తన రాజకీయ జీవనంలో, వ్యక్తిగత జీవితంలో ఇంత పెద్ద విషాదాన్ని ఎప్పుడూ చూడలేదని ఆయన అన్నారు. ఆ సంఘటన తనను లోతుగా కలిచివేసిందని తెలిపారు.

విజయ్ మాట్లాడుతూ, “ప్రజల ప్రాణాలు ఎప్పుడూ సురక్షితంగా ఉండాలని నేను కోరుకుంటాను. కానీ కరూర్‌లో జరిగిన ఈ విషాదం నాకు చాలా బాధ కలిగించింది. నిజం వెలుగులోకి రావాల్సిందే. ఈ దుర్ఘటన జరిగడం దురదృష్టకరం. అయినా ప్రజల భద్రతనే నేను ఎప్పుడూ ప్రాధాన్యతగా చూస్తాను” అని అన్నారు.

తనను టార్గెట్ చేయండి కానీ, ప్రజలను కాదని అని పేర్కొన్నారు. త్వరలోనే బాధితులను కలుస్తానని తెలిపాడు. అంతేకాదు, తిరుపతికి వెళ్లి శ్రీవేంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుంటానని ప్రకటించారు. ‘ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ (CM Stalin) మాపై ప్రతీకారం తీర్చుకోడానికి ప్రయత్నిస్తున్నారా? కానీ, మేము ఎలాంటి తప్పుచేయలేదు’ అని విజయ్ పేర్కొన్నారు.

‘ముఖ్యమంత్రి సర్.. మీరు ఏదైనా ప్రతీకారం కోసం ప్లాన్ చేస్తే అది నాపైనే చేయండి… మా నాయకులను టచ్ చేయకండి.. నేను ఎక్కడికి పోను ఇళ్లు లేదా ఆఫీసులో ఉంటా’ అని స్టాలిన్‌ పరోక్షంగా వార్నింగ్ ఇచ్చారు.కరూర్ తొక్కిసలాట ఘటనలో టీవీకే జిల్లా సెక్రెటరీ మతియఝగన్‌పై పోలీసులు హత్యాయత్నం, నేరపూరిత హోమిసైడ్, ప్రజా భద్రతకు ముప్పు కలిగించడం వంటి సెక్షన్ల కిందట పోలీసులు కేసు నమోదుచేయడంతో విజయ్ పైవిధంగా స్పందించినట్టు తెలుస్తోంది.

అలాగే, మరో ఇద్దరు సీనియర్ టీవీకే నేతలు జనరల్ సెక్రెటరీ ఎన్ బస్సీ ఆనంద్, జాయింట్ సెక్రెటరీ నిర్మలా శేఖర్‌లపై కూడా కేసు నమోదయ్యింది. గుర్తుతెలియని ఓ పోలీసు అధికారి నమోదుచేసిన మూడో కేసు ప్రకారం.. విజయ్ పై ‘ఉద్దేశపూర్వకంగా అధికార ప్రదర్శన’ – అంటే ర్యాలీకి వెళ్లే మార్గంలో షెడ్యూల్‌ లో లేని ప్రాంతంలో ప్రసంగించడం, హైప్, అంచనాలు పెంచడానికి ఉద్దేశపూర్వకంగా ఆలస్యంగా రావడం వంటి కారణాలే తొక్కిసలాటకు దారితీసినట్టు అభియోగం మోపారు.

అయితే, ఈ అభియోగాలపై విజయ్ స్పందిస్తూ.. తానుగానీ, తన పార్టీ గానీ ఎటువంటి తప్పుచేయలేదని అన్నారు. సురక్షిత ప్రదేశంలో ర్యాలీ నిర్వహణ సహా భద్రత ప్రోటోకాల్ అనుసరించామని తెలిపారు.

‘నా పర్యటనలో ప్రజల భద్రతకు సంబంధించిన ఎటువంటి రాజీపడలేదు.. అన్ని రాజకీయ అంశాలను పక్కన పెట్టి, అలాంటి (సురక్షితమైన) ప్రదేశంలో సభ నిర్వహణకు పోలీసుల అనుమతి తీసుకున్నాం’ అని విజయ్ స్పష్టం చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com