తెలంగాణ క్యాబినెట్ లో కీలక మార్పులు

- October 29, 2025 , by Maagulf
తెలంగాణ క్యాబినెట్ లో కీలక మార్పులు

హైదరాబాద్: తెలంగాణ క్యాబినెట్ లో కీలక మార్పులు: జూబ్లీహిల్స్ ఎన్నికల వేడి నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్‌లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కాంగ్రెస్ హైకమాండ్ ఇప్పటికే మాజీ క్రికెటర్, మాజీ ఎంపీ మోహమ్మద్ అజారుద్దీన్‌కి మంత్రి పదవి ఇవ్వాలని నిర్ణయించినట్లు సమాచారం. అదే సమయంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని కూడా క్యాబినెట్ లో చేర్చే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి. ఇద్దరినీ మంత్రివర్గంలోకి తీసుకోవడం ద్వారా పార్టీ అంతర్గత అసంతృప్తిని తగ్గిస్తూ, రాబోయే స్థానిక ఎన్నికలకు ముందు మైనార్టీ మరియు రెడ్డి వర్గాలను సమతూకం చేయాలని కాంగ్రెస్ యోచిస్తోంది.

సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో త్వరలో జరగబోయే క్యాబినెట్ విస్తరణకు ఇప్పటికే ముహూర్తం ఖరారైనట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో అజారుద్దీన్ ప్రమాణస్వీకారం ఎల్లుండి జరిగే అవకాశం ఉంది అనే వార్తలు సచివాలయ వర్గాల్లో వినిపిస్తున్నాయి.

ప్రస్తుతం తెలంగాణ కేబినెట్లో మైనార్టీ ప్రతినిధులు లేని విషయం హైకమాండ్ దృష్టికి వెళ్లింది. అందువల్ల మైనార్టీ వర్గాల నుంచి ఒకరిని మంత్రి వర్గంలోకి తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి చాలా కాలంగా ఆలోచిస్తున్నారని తెలుస్తోంది.ఈ సందర్భంలో మాజీ మంత్రి షబ్బీర్ అలీ, ఫిరోజ్ ఖాన్, అజారుద్దీన్ పేర్లు చర్చకు వచ్చాయి. కానీ జూబ్లీహిల్స్‌ లో ముస్లిం ఓట్లు అధికంగా ఉండడం, అజారుద్దీన్‌కు ఆ ప్రాంతంలో గట్టి పట్టు ఉండడం వల్ల ఆయనకు ప్రాధాన్యం ఇవ్వాలని పార్టీ పెద్దలు నిర్ణయించినట్లు సమాచారం.

ప్రస్తుతం తెలంగాణ క్యాబినెట్ లో మూడు ఖాళీలు ఉన్నాయి. అందులో రెండు స్థానాలు అజారుద్దీన్ మరియు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డితో భర్తీ అయ్యే అవకాశం ఉంది. మిగిలిన ఒక పదవిని బీసీ వర్గం నుంచి ఎంపిక చేయాలనే యోచనలో సీఎం రేవంత్ రెడ్డి ఉన్నారని తెలుస్తోంది. ఈ అంశంపై తుది నిర్ణయం రేపటిలోగా వెలువడే అవకాశం ఉంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com