యూఏఈలోని భారతీయ ప్రవాసులకు ఇక ఇ-పాస్‌పోర్టులే..!!

- October 31, 2025 , by Maagulf
యూఏఈలోని భారతీయ ప్రవాసులకు ఇక ఇ-పాస్‌పోర్టులే..!!

యూఏఈ: పాస్‌పోర్ట్ కోసం దరఖాస్తు చేసుకునే యూఏఈలోని ప్రవాసులు ఇకపై ఇ-పాస్‌పోర్ట్‌ను మాత్రమే పొందుతారు. ఈ మేరకు దుబాయ్‌లోని కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా (CGI) అధికారులు ధృవీకరించారు. ఈ-పాస్‌పోర్ట్ వ్యవస్థను భారత ప్రభుత్వం అక్టోబర్ 28న ప్రపంచవ్యాప్తంగా ప్రారంభించింది.  

ఈ-పాస్‌పోర్ట్ అనేది రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ (RFID) చిప్ మరియు పాస్‌పోర్ట్ హోల్డర్ వ్యక్తిగత వివరాలు,  బయోమెట్రిక్ సమాచారాన్ని కలిగి ఉంటుంది.  కొంతమంది నివాసితులకు కొత్త RFID-ఎంబెడెడ్ పాస్‌పోర్ట్‌లు ఇప్పటికే జారీ చేయబడిందని అధికారులు తెలిపారు.

కొత్త నిబంధనల ప్రకారం, దరఖాస్తుదారులు పాస్‌పోర్ట్ సేవా కార్యక్రమం (GPSP 2.0)లో కొత్త పాస్‌పోర్ట్ కోసం దరఖాస్తు చేసుకోవాలి. ఇది వేచి ఉండే సమయాన్ని తగ్గిస్తుందని యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లోని భారత రాయబార కార్యాలయం ఛార్జ్ డి అఫైర్స్ ఎ. అమర్‌నాథ్ అన్నారు. ఎంబెడెడ్ చిప్ పాస్ పోర్టుకు మరింత భద్రతను అందిస్తుందని పేర్కొన్నారు. ఎవరైనా పాస్‌పోర్ట్‌ను నకిలీ చేయడానికి ప్రయత్నిస్తే.. వారిని ఇమ్మిగ్రేషన్ సిస్టమ్స్ సులువుగా గుర్తిస్తాయని తెలిపారు.

అయితే, ప్రస్తుతానికి, పాస్‌పోర్ట్ దరఖాస్తుల కోసం విదేశాలలో ఫిజికల్ బయోమెట్రిక్‌లను సేకరించే ప్రణాళికలు లేవని అధికారులు తెలిపారు. పాస్‌పోర్ట్ జారీ సమయం లేదా సేవా ఛార్జీలలో ఎటువంటి మార్పులు ఉండవని పేర్కొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com