ఏపీ గేమ్ ఛేంజర్ గ్రీన్ అమోనియా ప్రాజెక్ట్..

- January 17, 2026 , by Maagulf
ఏపీ గేమ్ ఛేంజర్ గ్రీన్ అమోనియా ప్రాజెక్ట్..

కాకినాడ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీగా తయారు చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. భవిష్యత్తులో ప్రపంచం మొత్తం కాకినాడ వైపు చూస్తుందన్నారు. మన సంస్కృతిని కాపాడుకుంటూనే టెక్నాలజీని వాడుకోవాలన్నారు. గ్రీన్ అమోనియా భవిష్యత్తులో పెను మార్పునకు నాంది పలుకుతుందన్నారు. సన్ రైజ్ ఆంధ్రప్రదేశ్ లో 20 పోర్టులు వస్తున్నాయని చెప్పారు. గ్రీన్ అమోనియా, గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తికి ఏపీ అనుకూలం అని తెలిపారు. 2027 నాటికి తొలి దశ ఉత్పత్తి ప్రారంభం అవుతుందని తెలిపారు. కాకినాడ నుంచి విదేశాలకు గ్రీన్ అమోనియా సరఫరా అవుతుందన్నారు. గ్రీన్ అమోనియా పరిశ్రమ ఏపీకి గేమ్ చేంజర్ కానుందన్నారు చంద్రబాబు.


ఏపీలో అతిపెద్ద గ్రీన్ అమోనియా ప్రాజెక్ట్ కు సీఎం చంద్రబాబు శ్రీకారం చుట్టారు. ఈ గ్రీన్ అమోనియా ప్రాజెక్ట్ ను ఏఎం గ్రీన్ సంస్థ కాకినాడలో ఏర్పాటు చేస్తోంది. గ్రీన్ అమోనియా ప్రాజెక్ట్ కు ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ శంకుస్థాపన చేశారు. 13వేల కోట్ల రూపాయలతో 495 ఎకరాల్లో ప్లాంట్ ఏర్పాటు చేస్తున్నారు. ఏటా 1.5 మిలియన్ టన్నుల గ్రీన్ అమోనియా ఉత్పత్తి చేసేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. అలాగే ఏటా 1,950 మెగావాట్ల ఎలక్ట్రోలైజర్ ను ఉత్పత్తి చేయనుంది ఏఎం గ్రీన్ సంస్థ. జర్మనీ, జపాన్, సింగపూర్ కు గ్రీన్ అమోనియాను ఎగుమతి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ ప్లాంట్ ద్వారా ప్రత్యక్షంగా పరోక్షంగా 2వేల 600 మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి.

గ్రీన్‌ ఎనర్జీ ఉత్పత్తి బాగా పెంచాలని ప్రధాని మోదీ కోరుతున్నారని చంద్రబాబు తెలిపారు. 2014లోనే తమ ప్రభుత్వం గ్రీన్‌ ఎనర్జీకి నాంది పలికిందని గుర్తు చేశారు. ఇప్పుడు గ్రీన్‌ హైడ్రోజన్‌, గ్రీన్‌ అమ్మోనియాకు నాంది పలికామన్నారు. కాకినాడలో ఏర్పాటయ్యేది ప్రపంచంలోనే అతిపెద్ద గ్రీన్‌ అమ్మోనియా పరిశ్రమ అని తెలిపారు. బొగ్గు వినియోగం వల్ల పర్యావరణం దెబ్బతింటోందన్న ముఖ్యమంత్రి చంద్రబాబు కాలుష్యం వల్ల సముద్రంలోనూ పెను మార్పులు వస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. మన రాష్ట్రానికి వెయ్యి కిలోమీటర్ల సముద్ర తీరం ఉందని, 20 పోర్టులు ఏర్పాటు కానున్నాయని వెల్లడించారు.

నాడు ఎన్టీఆర్‌ చొరవతో కాకినాడకు నాగార్జున ఫెర్టిలైజర్స్‌ కంపెనీ వచ్చిందని చంద్రబాబు గుర్తు చేశారు. ఇలాంటి పరిశ్రమలకు అనుకూలమైన పరిస్థితులన్నీ ఇక్కడున్నాయన్నారు. 2047 నాటికి ఆంధ్రప్రదేశ్ స్వర్ణాంధ్రప్రదేశ్‌గా తయారవుతుందని సీఎం చంద్రబాబు ఆశాభావం వ్యక్తం చేశారు.

‘ప్రభుత్వాలు, పార్టీలు మారినా పరిపాలనా పరమైన విధానాలు మాత్రం స్థిరంగా ఉండాలి. గత పాలకులు- రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడిదారులను బెదిరించి, కోర్టుకు ఈడ్చి నానా ఇబ్బందులుపెట్టారు. కూటమి ప్రభుత్వం మాత్రం ప్రతి అడుగులో పెట్టుబడిదారుల్లో విశ్వాసం నింపుతుంది. వారికి అండగా నిలుస్తుంది.ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని మా ప్రభుత్వం నుంచి పెట్టుబడిదారులకు ఎలాంటి వేధింపులు ఉండవ’ని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. రాష్ట్రంలో పెట్టుబడిదారులకు సానుకూల వాతావరణం కల్పిస్తున్నామన్నారు. పర్యావరణాన్ని పరిరక్షించుకుంటూ అభివృద్ధిలో ఆంధ్రప్రదేశ్ ని అగ్రగామిగా నిలిపే దిశగా వడివడిగా అడుగులు వేస్తున్నామని తెలిపారు. పునరుత్పాదక ఇంధన రంగంలో రాష్ట్రాన్ని దేశంలో మొదటి స్థానంలో నిలపడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమన్నారు. దేశ కాలుష్య రహిత ఇంధన ప్రయాణంలో గ్రీన్ అమ్మోనియా ప్రాజెక్టు కీలక మైలురాయి అని చెప్పారు. శనివారం కాకినాడలోని వాకలపూడిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు పి.వి.ఎన్. మాధవ్ తో కలసి ఏఎం గ్రీన్ సంస్థ వారి గ్రీన్ అమ్మోనియా-గ్రీన్ హైడ్రోజన్ కాంప్లెక్స్ కు శంకుస్థాపన చేశారు. గ్రీన్ అమ్మోనియా ప్లాంట్ నిర్మాణాన్ని ప్రారంభించారు. ప్లాంట్ నమూనాని పరిశీలించి. యంత్ర పరికరాల పైలాన్ ను ఆవిష్కరించారు. 

అనంతరం జరిగిన సమావేశంలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ “బలమైన సంకల్పం ఉంటే ఏదైనా సాధించగలం అని గ్రీన్ కో వ్యవస్థాపకులు చలమలశెట్టి అనిల్ నిరూపించారు. అనేక కష్టనష్టాలను తట్టుకుని ఈ రోజున ఏఎం గ్రీన్ కంపెనీ స్థాపించారు. కాకినాడలో 495 ఎకరాల విస్తీర్ణంలో ఈ ప్రాజెక్టు ఏర్పాటు కానుంది. ఏడాదికి 1.5 మిలియన్ మెట్రిక్ టన్నుల గ్రీన్ అమ్మోనియా ఉత్పత్తి లక్ష్యంగా పెట్టుకున్నారు. రూ.15, 600 కోట్లు పెట్టుబడితో ప్రారంభం అవుతున్న ఈ సంస్థలో 8 బిలియన్ డాలర్ల విలువైన ఉత్పాదక ఇంధన పెట్టుబడులు రానున్నాయి. 2027 ఏడాది చివరికి తొలి దశ కమిషనింగ్ లక్ష్యంగా, పునరుత్పాదక ఇంధన ఆధారిత శుద్ధ ఇంధన కేంద్రంగా ఈ ప్రాజెక్టు రూపుదిద్దుకోబోతోంది. నిర్మాణ దశలో సుమారు 8,000 మందికి, ఆపరేషన్ దశలో సుమారు 1,500 మందికి ప్రత్యక్ష ఉపాధి, పరోక్షంగా కొన్ని వేల మందికి దీర్ఘకాల ఉపాధి అవకాశాలు సృష్టించే ఈ ప్రాజెక్టు విజయవంతం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వ్యవస్థాపకులు అయిన చలమలశెట్టి అనిల్,మహేష్ కి అభినందనలు తెలియజేస్తున్నాను.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com