నటి వాహిని కన్నుమూత

- February 05, 2026 , by Maagulf
నటి వాహిని కన్నుమూత

టాలీవుడ్‌లో మరో విషాదం చోటుచేసుకుంది. ఒకప్పుడు సినిమాలు, సీరియల్స్‌లో కీలక పాత్రలతో గుర్తింపు తెచ్చుకున్న నటి జయవాహిని కన్నుమూశారు.గత కొంతకాలంగా క్యాన్సర్ తో బాధపడుతున్న ఆమె, బుధవారం తన స్వస్థలమైన విజయనగరంలో తుదిశ్వాస విడిచారు. నటి కరాటే కళ్యాణి సోషల్ మీడియా వేదికగా ఈ విషయాన్ని తెలియజేశారు. పద్మక్కను కాపాడుకోవాలని ప్రయత్నం చేసినా తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారంటూ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. 

“వాహిని అక్కా(పద్మక్క).. నిన్ను కాపాడాలి అని చాలా ప్రయత్నం చేశాను. కొద్దిసేపటి క్రితం తన జన్మస్థలం అయిన విజయనగరంలో స్వామిని చేరుకుంది. మొన్న చెప్పేశారు ఇక కష్టం అని, ఊరికి తీసుకువెళ్ళిపోయారు అంట.. ఆమె పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను. సద్గతి ఓం శాంతి. మేము నిన్ను ఎంతో మిస్ అవుతున్నాం పద్మక్క. కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాను” అని కరాటే కళ్యాణి తన ఫేస్ బుక్ లో పోస్ట్ పెట్టారు. వాహిని మరణ వార్త తెలియడంతో, పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు ఆమెకు సంతాపం తెలియజేస్తున్నారు.1978లో విజయనగరంలో జన్మించిన వాసవి, జయ వాహిని పేరుతో టెలివిజన్ మరియు సినీ రంగాల్లో మంచి గుర్తింపు సంపాదించారు. చిన్న చిన్న పాత్రలతో కెరీర్ ప్రారంభించిన ఆమె అనేక తెలుగు, తమిళ చిత్రాల్లో నటించారు. సినిమాలతో పాటు సీరియల్స్ ద్వారా ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు.

ముఖ్యంగా నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రల్లో ఆమె నటన ప్రత్యేకంగా గుర్తింపు తెచ్చిపెట్టింది. 2019లో విడుదలైన ‘రఘుపతి వెంకయ్య నాయుడు’ చిత్రంలో వీకే నరేష్ సరసన నటించిన ఆమె, చివరిసారిగా ‘బహిర్భూమి’ సినిమాలో కనిపించారు.గత కొన్ని సంవత్సరాలుగా రొమ్ము క్యాన్సర్‌తో బాధపడుతున్న వాసవి ఆరోగ్య కారణాల వల్ల నటనకు దూరమయ్యారు. ఆమె పరిస్థితి విషమించడంతో వైద్యులు ఇంటికి తీసుకెళ్లాలని సూచించగా, కుటుంబ సభ్యులు విజయనగరానికి తరలించారు. అక్కడే ఆమె చివరి శ్వాస విడిచారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com