పాపిరెడ్డిపాళెంలో 9 రోజుల ఉచిత కంటి వైద్య శిబిరం

- February 08, 2026 , by Maagulf
పాపిరెడ్డిపాళెంలో 9 రోజుల ఉచిత కంటి వైద్య శిబిరం

తెలంగాణ: పాపిరెడ్డిపాళెం వాస్తవ్యులు కీ.శే. కోడూరు వేంకటరమణా రెడ్డి– శాంతమ్మల స్మృత్యర్థంగా గ్రామీణ ప్రజల కంటి చూపు సంరక్షణ లక్ష్యంగా మెగా ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహిస్తున్నారు. ప్రపంచ ప్రసిద్ధి గాంచిన శంకర నేత్రాలయ, చెన్నై మరియు శాంతా–వసంతా ట్రస్టు, హైదరాబాద్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ శిబిరం ఫిబ్రవరి 15 నుంచి 23 వరకు మొత్తం 9 రోజులపాటు జరుగనుంది.

గ్రామీణ ప్రాంతాల్లో అవగాహన లోపం, ఆర్థిక ఇబ్బందుల కారణంగా అనేక మంది కంటి పొరలు (కాటరాక్ట్) సహా వివిధ చూపు సమస్యలతో బాధపడుతున్నారు. అలాంటి పేద ప్రజలకు నాణ్యమైన వైద్యాన్ని పూర్తిగా ఉచితంగా అందించడమే ఈ శిబిరం ముఖ్య ఉద్దేశ్యం.

ఈ మహత్తర కార్యక్రమాన్ని శాంతాబయోటెక్నిక్స్ వ్యవస్థాపకులు పద్మభూషణ్ డాక్టర్ కోడూరు ఈశ్వర ప్రసాద్ రెడ్డి– వసంత దంపతులు తమ స్వగ్రామం పాపిరెడ్డిపాళెం తో పాటు పరిసర గ్రామాల ప్రజల కోసం ఏర్పాటు చేస్తున్నారు. తమను కన్న తల్లిదండ్రుల్ని, పుట్టిన ఊరిని ఎప్పటికీ మరవకూడదనే సందేశంతో ఈ సేవా కార్యక్రమం చేపట్టడం అభినందనీయం.

తోటపల్లి గూడూరు మండలం ఇస్కపాళెం గ్రామంలోని ప్రభుత్వ బీసీ హాస్టల్ ప్రాంగణంలో ఈ శిబిరం నిర్వహించనున్నారు.సుమారు 3,000 మందికి ఉచిత కంటి పరీక్షలు నిర్వహించి, చివరి ఐదు రోజుల్లో అవసరమైన వారికి కంటి పొర శస్త్రచికిత్సలను కూడా పూర్తిగా ఉచితంగా చేస్తారు. మందులు, కంటి అద్దాలు కూడా ఉచితంగా అందించనున్నారు.

అత్యాధునిక పరికరాలతో కూడిన సంచార వాహనాల ద్వారా గ్రామాలకే వెళ్లి కంటి పరీక్షలు నిర్వహిస్తారు. కంటి పొరలుగా నిర్ధారణ అయిన రోగులకు అదే శిబిరంలో ఎటువంటి ఖర్చు లేకుండా శస్త్రచికిత్స చేసి అవసరమైన లెన్స్‌లు అమర్చుతారు. దూర ప్రాంతాల నుంచి వచ్చే రోగులకు ఉచిత భోజన, వసతి సౌకర్యాలు కల్పిస్తారు. మధుమేహంతో వచ్చే కంటి సమస్యలపై ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు కూడా నిర్వహించనున్నారు.

కంటిలోని సహజ లెన్స్ మసకబారడాన్ని కంటి పొర లేదా కాటరాక్ట్ అంటారు.ఆధునిక వైద్యం ద్వారా ఇప్పుడు నొప్పి లేకుండా ఫాకో ఎమల్సిఫికేషన్, లేజర్ కాటరాక్ట్ సర్జరీ వంటి అత్యాధునిక పద్ధతులతో చికిత్స చేస్తున్నారు.శంకర నేత్రాలయ వంటి సంస్థలు పేదలకు కూడా అంతర్జాతీయ స్థాయి వైద్యం అందించడం విశేషం.

డబ్బు లేని కారణంగా ఎవరూ చూపు కోల్పోకూడదనే ఉద్దేశంతో నిర్వహిస్తున్న ఈ ఉచిత శిబిరాన్ని గ్రామీణ ప్రజలు పూర్తిగా వినియోగించుకోవాలని నిర్వాహకులు కోరుతున్నారు. పరిసర గ్రామాల ప్రజలకు ఈ సమాచారాన్ని చేరవేసి వృద్ధులు, పేదలు ఈ సేవలను సద్వినియోగం చేసుకునేలా సహకరించాలని పిలుపునిస్తున్నారు

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com